ఎర్రగుంట్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులుగా కౌన్సిలర్ స్థానాలకు పోటీచేసి గెలిచిన తర్వాత తెదేపాకు ఫిరాయించిన ఎనిమిది మంది కౌన్సిలర్లపై అనర్హత వేటు పడింది. ఈ విషయాన్ని కమిషనర్ ప్రభాకర్రావు శనివారం విలేకర్లకు వెల్లడించారు. అనర్హులుగా ప్రకటించిన వారిలో ఎస్.పురుషోత్తం(ఒకటోవార్డు), వి.సరస్వతి(మూడో వార్డు), ఎ.గంగాభవాని (అయిదోవార్డు), జి.నారాయణరెడ్డి(ఆరోవార్డు), ఎస్.ఆసియాబేగం(పదోవార్డు), జె.మహిత(పన్నెండోవార్డు), ఎస్.మస్తాన్వలి(పదమూడోవార్డు), వి.లక్ష్మి(పద్నాలుగో వార్డు) కౌన్సిలర్లు ఉన్నారని ఆయన వివరించారు.
నగర పంచాయతీకి జులై నెల 3న జరిగిన మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ఛైర్మన్ ఎన్నికల సమయంలో విప్ ధిక్కరించి తెదేపా అభ్యర్థులకు ఓటు వేశారని వైకాపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి అనర్హత కలిగినవారిగా ఎనిమిది మంది కౌన్సిలర్లను ప్రకటించి ఉత్తర్వులు జారీచేసినట్లు ఆయన పేర్కొన్నారు.