ఒక ప్రాంతానికి, ఒకే వర్గానికి మేలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు

కడప: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి తీరాల్సిందేనని కడప శాసన సభ్యుడు ఎస్‌బి అంజద్‌బాషా డిమాండ్ చేశారు. జిల్లాపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జిల్లాలో ఉక్కు పరిశ్రమ, ఉర్దూ యూనివర్సిటీ, హజ్ హౌస్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం ఆయన కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒక్క వైఎస్‌ఆర్ హయాంలోనే జిల్లాకు మేలు జరిగిందన్నారు. ఎన్నో అభివృద్ధి పనులు సాగాయన్నారు.

చంద్రబాబు ఎన్నికలప్పుడు ఎన్నెన్నో హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా ఒక్క హమీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి ఇస్తామని, రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా జిల్లాకు ఉక్కు పరిశ్రమ, ఉర్దూ యూనివర్సిటీ, ఫుడ్‌పార్కు, టూరిజం హబ్, ఖనిజాధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని ప్రకటించిన సీఎం ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా.. వాటిని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుండటం దారుణమన్నారు.

ఒకే ప్రాంతానికి, ఒకే వర్గానికి మేలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని దుయ్యబట్టారు. ఈ విషయాలపై జిల్లాలోని టీడీపీ నేతలు సీఎంను నిలదీయాలన్నారు. చేతకాకపోతే రాజీనామా చేయాలని చెప్పారు. అంతకు ముందు ఆయన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి హెడ్ పోస్టాఫీసు సమీపంలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సాయంత్రం ఆరు గంటలకు నగర మేయర్ కె. సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

చదవండి :  శ్రీశైలం నుంచి 150 టిఎంసిలున్న సాగర్‌కు నీటిని తరలించడం దుర్మార్గం: సిపిఎం

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకులు నారాయణ, జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బండి జకరయ్య, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి, బీజేపీ నాయకులు కందుల చంద్రఓబుల్‌రెడ్డి(నాని), లయన్ పి. ఖాసిం ఖాన్, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్రారెడ్డి, ఉమా రాష్ట్ర అధ్యక్షులు షంషుద్దీన్, ఇన్సాఫ్ నాయకులు కేసీ బాదుల్లా, అవాజ్ కమిటీ నాయకులు మస్తాన్‌వలీ, మగ్బూల్‌బాషా తదితరులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు.

దోచుకునేందుకే ముఖ్యమంత్రి

దోచుకొని దాచుకునేందుకే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. నీరు-చెట్టు, ఇసుక క్వారీల్లో అంతులేని అవినీతి జరుగుతోంది. తోటపల్లి రిజర్వాయర్‌కు అవసరమైన నిధులన్నీ వైఎస్‌ఆర్ హయాంలో కేటాయించి ఖర్చు చేస్తే చంద్రబాబు కేవలం మిగిలిపోయిన ప్యాచ్ వర్కులకు డబ్బులిచ్చి తానే చేశానని చెప్పుకుంటున్నాడు. గారడీ చేస్తూ అన్ని వర్గాల వారిని మోసం చేశారు.

– పి. రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే

పోరాటాలకు సిద్ధం కావాలి

కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు రూ.23,500 కోట్లు ఇస్తామని చెప్పింది. కానీ ముఖ్యమంత్రి రాయలసీమకు అన్యాయం చేసి అభివృద్ధినంతా ఇంకో ప్రాంతానికి తరలిస్తున్నారు. విభజన చట్టంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అతీగతీ లేదు. పోరాటాలతోనే హామీలు అమలు చేయించుకోవాలి.

చదవండి :  కమలాపురంలో ఎవరికెన్ని ఓట్లు?

– జి. ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి

పుట్టిన గడ్డను మరిచారు

చంద్రబాబు కోస్తాలో పెళ్లి చేసుకొని ఇల్లరికపు అల్లుడిలా ఆ ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తూ పుట్టిన గడ్డకు అన్యాయం చేస్తున్నారు. వైఎస్ నాడు చొరవ చూపడం వల్లే ప్రాజెక్టులకు ఈమాత్రమైనా నీళ్లు వస్తున్నాయి. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు.

– కె. సురేష్‌బాబు, నగర మేయర్

అన్నీ గాలి మాటలే

చంద్రబాబు చెప్పేవన్నీ గాలి మాటలు, శుష్క వాగ్దానాలే. ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన లేనిపోని హామీల వల్లే అధికారంలోకి వచ్చారు. గద్దెనెక్కిన తర్వాత కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం మన దౌర్భాగ్యం. ఇలా ఎంతో కాలం ప్రజలను మభ్యపెట్టలేరు.

– జయరాములు, బద్వేల్ ఎమ్మెల్యే

హమీలు నెరవేర్చే వరకూ ఉద్యమం

విభజన వల్ల రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గురైంది. టీడీపీ అధికారంలోకి రావడం వల్ల వైఎస్‌ఆర్ జిల్లా మరింత అన్యాయానికి గురవుతోంది. ఉర్దూ యూనివర్సిటీ, హజ్‌హౌస్ ఇస్తామని ఆశలు కల్పించి చివరకు వాటిని వేరే ప్రాంతాలకు తరలించడం అన్యాయం. జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు నెరవేర్చే వర కూ ఉద్యమం కొనసాగుతుంది.

చదవండి :  రాయలసీమకు తరతరాలుగా అన్యాయం: బి.వి.రాఘవులు

– ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

వివక్ష చూపడం దారుణం

తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగదనే అనుమానం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అన్ని ప్రాంతాలను సమానంగా చూడకుండా వివక్ష చూపడం దారుణం. ఏదో ఒక రూపంలో ఉద్యమాలను కొనసాగిస్తూ హమీలను అమలు చేయించుకోవాలి.

– సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షక సేవాసమితి, అధ్యక్షుడు

రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ముఖ్యమంత్రి

రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాపై తీవ్ర వివక్ష చూపిస్తోంది. జిల్లాకు ప్రకటించిన అనేక ప్రాజెక్టులు, పరిశ్రమలను ఇతర జిల్లాలకు తరలిస్తూ జిల్లా ప్రజలను అవమానిస్తున్నారు. అన్ని ప్రాంతాలను, మతాలను సమానంగా చూస్తానని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి దాన్ని ఉల్లంఘిస్తున్నారు.

– ఎన్. రవిశంకర్‌రెడ్డి, సీపీఎం నగర అధ్యక్షుడు

వెన్నుపోటు పొడవడంలో ఆయన దిట్ట

నేను మారానంటేనే ప్రజలు చంద్రబాబుకు ఓట్లు వేశారు. ఆయన మారలేదని అధికారంలోకి వచ్చాక అందరికీ అర్థమైంది. వైఎస్‌ఆర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఈ సీఎం తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గు చేటు. శాసన సభ సాక్షిగా ఉర్దూ యూనివర్సిటీ ఇస్తానని చెప్పి.. మరో ప్రాంతానికి తరలించి గొడవలు పెడుతున్నారు. వెన్నుపోటు పొడవడంలో ఆయన దిట్ట.

– నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: