కడప జిల్లాలో బృహత్ శిలాయుగంనాటి ఆనవాళ్లు

కడప: వైఎస్సార్ కడప జిల్లాలో బృహత్ శిలాయుగం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. జిల్లాలోని సుండుపల్లె మండలం రాయవరం పంచాయతీ పరిధిలోని దేవాండ్లపల్లికి ఉత్తరాన మూడు కిలోమీటర్ల దూరంలో బృహత్ శిలాయుగం నాటి సమాధులు బయటపడ్డాయి.

ఇవి క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాటివని భావిస్తున్నారు. దాదాపు 20 బృహత్ శిలాయుగం సమాధులను దేవాండ్లపల్లి వద్ద యోగివేమన విశ్వవిద్యాలయం అధ్యాపక బృందం గుర్తించింది. యోగివేమన విశ్వవిద్యాలయానికి చెందిన చరిత్ర, పురావస్తు, భూగర్భశాస్త్ర శాఖల ప్రొఫెసర్లు చాలా కాలంగా బృహత్ శిలాయుగం ఆనవాళ్లకై జిల్లాలో అనే్వషణ సాగిస్తున్నారు. జిల్లాలో మొట్టమొదట బృహత్ శిలాయుగం అవశేషాలను రాబర్ట్ బ్రూస్‌ఫుట్ 1914లో కనుగొన్నారు. పెండ్లిమర్రి మండలం ఎల్లటూరు గ్రామం వద్ద బృహత్ శిలాయుగంలో వాడిన కుండపెంకులను గుర్తించి వాటి వివరాలను ‘ద ఫుట్ కలెక్షన్ ఆఫ్ ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్ యాంటిక్విటీస్ క్యాటలాగ్ రేయిసన్’ అన్న గ్రంథంలో ముద్రించారు.

చదవండి :  పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నది ఎవరు?

అప్పట్లో మద్రాసు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ వివరాలను ముద్రించారు. రాబర్డ్ బ్రూస్‌ఫుట్‌ను ఆదర్శంగా తీసుకుని వైవియు అధ్యాపకుల బృందం దేవాండ్లపల్లి పరిసరాల్లో సుమారు 20 బృహత్ శిలాయుగం సమాధులను గుర్తించింది. వీటిలో కొన్నింటిని డాల్మెన్లుగా గుర్తించారు. డాల్మెన్లకు మూడు చుట్లతో కూడిన రాతి పలకలను అమర్చారు. వాటికి స్లాబ్ సర్కిల్స్ అని పేరు.

ఈ సమాధులను గుప్తనిధుల కోసం ఇటీవల కొంత మంది పగులగొట్టారు. అధ్యాపకుల బృందం వాటిని పరిశీలించగా బ్లాక్ అండ్ రెడ్ వేర్, రెడ్ వేర్ అనబడే కుండపెంకులు లభ్యమయ్యాయి. రెండు డాల్మెన్లకు అమర్చిన నాలుగు పలకల్లో వాయువ్య పలకకు లోపలి భాగంలో బృహత్ శిలాయుగం నాటి మానవుడు చిత్రించిన చిత్రాలు కనిపించాయి. తాబేలు, ఆకు బొమ్మ, మనిషి బల్లెం విసురుతున్నట్లు, సూర్యుడు మొదలైన ఎరుపు, తెలుపు వర్ణం చిత్రాలు ఇక్కడ కనిపించాయి. మరో డాల్మెన్‌పై రెండు ఏనుగులు, వాటిపైన మనుషుల చిత్రం తెలుపువర్ణంలో కనిపించింది.

చదవండి :  కక్షతో జిల్లా అభివృద్ధిని పట్టించుకోవడం లేదు

రాయలసీమలోని బృహత్ శిలాయుగం నాటి సమాధులను క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాటివిగా అక్కడ లభించిన కుండపెంకుల ఆధారంగా సి-14 పద్దతి ప్రకారం శాస్ర్తియంగా వైవియూ అధ్యాపక బృందం నిర్ధారించింది.

ఈ పరిశోధనలను యోగివేమన విశ్వవిద్యాలయంలోని చరిత్ర, పురావస్తుశాస్త్ర విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.సాంబశివారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.రామబ్రహ్మం, భూగర్భశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.రఘుబాబు సంయుక్తంగా నిర్వహించారు. సుండుపల్లె మండలంలో బృహత్ శిలాయుగం నాటి ఆనవాళ్లను కనుగొన్న యోగివేమన విశ్వవిద్యాలయం అధ్యాపకులను వర్శిటీ ఉపకులపతి ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి, కులసచివులు ఆచార్య ఎం.రామకృష్ణారెడ్డి అభినందించారు. (చిత్రం) క్రీస్తుపూర్వం 500 ఏళ్ల నాటి సమాధులు

చదవండి :  చెన్నయ్ భవిష్యం చెప్పిన ఆ రెండు పద్యాలు

ఇదీ చదవండి!

ప్రభుత్వ ఉత్తర్వు

కడప జిల్లా పేరు మార్పు

1974 నాటి ‘ఆంద్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం’ లో పేర్కొన్న  సెక్షన్ 3, సబ్ సెక్షన్2లోని  క్లాజు (e) ద్వారా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: