ఉక్కు పరిశ్రమను కడపలోనే ఏర్పాటు చేయాల
ఉక్కు పరిశ్రమను తరలించడం చట్టాన్ని ఉల్లంఘించడమే!
కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప జిల్లా పట్ల రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్, శాసనమండలి సభ్యుడు డాక్టర్ గేయానంద్ ధ్వజమెత్తారు. సీమ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం 12 జాతీయ స్థాయి సంస్థలను మంజూరు చేసిందని పేర్కొన్నారు. జిల్లాకు ఒక జాతీయ సంస్థను కేటాయించి సమన్యాయం పాటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సంస్థలన్నింటినీ ఇప్పటికే అభివృద్ధి చెందిన జిల్లాల్లో ఏర్పాటు చేయడం అన్యాయమని మండిపడ్డారు. కడపకు ఒక్క జాతీయ స్థాయి సంస్థను కూడా కేటాయించకపోవడం దారుణమని విమర్శించారు.
రాష్ట్ర విభజన చట్ట ప్రకారం జిల్లాలోఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయవలసి ఉందని చెప్పారు. అయితే, దీన్ని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు పత్రికల్లో వార్తలు రావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. కడపలోనే సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి అనువైన పరిస్తితులు ఉన్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. కడప నుంచి ఉక్కు పరిశ్రమను తరలించడం అంటే విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే అన్నారు. ‘సీమ’కు రూ. 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్కు రూ. లక్షా 25 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం అధికారు దుర్వినియోగానికి పరాకాష్ట అని విమర్శించారు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమ వేదిక జిల్లా కన్వీనర్ ఎ.రఘునాథరెడ్డి మాట్లాడుతూ… విభజన హామీలు అమలుపరిచే భాద్యత ప్రజా ప్రతినిధులదేనన్నారు.