రాష్ట్రస్థాయి పోటీల్లో 17 బంగారు, 15 రజత, 2 కాంస్య పతకాలు
కడప: ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు కేరళలో జరగనున్న జాతీయస్థాయి ఈత పోటీలకు 11మంది కడప జిల్లా ఈతగాళ్ళు అర్హత సాధించడం విశేషంగా ఉంది. కర్నూలులో ఇటీవల జరిగిన సబ్జూనియర్, జూనియర్, వింటర్ అక్వాటెక్ ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి పోటీల్లో కడప ఈతగాళ్ళు పతకాల పంట పండించారు. ఇందులో 17 బంగారు, 15 రజత, 2 కాంస్య పతకాలతో మొత్తం 34 పతకాలు సాధించి కడప జిల్లా సత్తా చాటారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీల్లో 16 మంది పాల్గొన్నారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన హరిబాబు, మునిశేఖర్, యోగీశ్వర్రెడ్డి, సాయిప్రశాంత్, జితేంద్ర, వెంకటయ్య, వెంకటేష్, రామిరెడ్డి, నాగేశ్వరి, లక్ష్మినిర్మల, శ్రావణి, కార్యదర్శి రాజశేఖర్ గురువారం నగరమేయర్ సురేష్బాబును నగరపాలక సంస్థలో కలిశారు. ఈ సందర్భంగా మేయర్, స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు మాట్లాడుతూ కడప క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో చక్కటి ప్రతిభ కనబరచి 34 పతకాలు సాధించడం గొప్ప విషయమన్నారు. జాతీయస్థాయి పోటీల్లో కూడా పతకాలు సాధించి కడప కీర్తిని చాటాలన్నారు.
డీఎస్డీవో బాషామొహిద్దీన్ మాట్లాడతూ కడపలో హాకీ, వాలీబాల్ క్రీడలో ఎక్కువగా పతకాలు వచ్చేవని ప్రస్తుతం స్విమ్మింగ్లో ఎక్కువ పతకాలు రావడం అభినందనీయమన్నారు. కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో ఈతకొలనులు తక్కువగా ఉన్నా.. ఉన్నవాటినే సద్వినియోగం చేసుకుంటూ ఎక్కువ పతకాలు సాధిస్తూ జిల్లాకీర్తిని చాటుతున్నారన్నారు. నగరపాలక కమిషనరు చల్లా ఓబులేసు, వైఎస్సార్ క్రీడాపాఠశాల స్విమ్మింగ్ కోచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.