తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఖాజీపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో తీవ్ర ఉద్వేగానికి లోనైన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కన్నీరు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 ఏళ్ల రాజకీయ జీవితంలో తన వెంట ఉన్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసమే తపించానని అన్నారు.
తన భవిష్యత్ రాజకీయ జీవితంపై ప్రజా బ్యాలెట్ నిర్వహించానని, ప్రజలు ఇచ్చే తీర్పుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనేది తేలుతుందని రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రమంతా ఎన్టీఆర్ గాలి వీస్తున్న సమయంలో తాను, వైఎస్ రాజశేఖర్రెడ్డి గెలిచామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సీడబ్ల్యుసీ నిర్ణయం వచ్చిన రోజే కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ తమ పదవులకు రాజీనామా చేసి ఉంటే విభజన జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు. ఇంతకుముందు తెలుగు మాట్లాడే వాళ్లకు రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి అన్న బొత్స, ఇప్పుడు మాత్రం సమైక్యాంద్ర అంటూ కబుర్లు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.