ప్రొద్దుటూరు: నగరంలో దొంగతనాలు కొనసాగుతూనే ఉన్నాయి. దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని మరీ దొంగతనం చేస్తుండడంతో నగర వాసులు ఇల్లు విడిచి పోవాలంటే భయపడుతున్నారు. ఒకటి రెండు రోజుల పాటు ఆ ఇంటిని గమనిస్తూ, ఇంట్లో వారు ఎక్కడికి వెళ్లారో తెలుసుకొని దొంగలు రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం మోడంపల్లె, జిన్నారోడ్డులోని నాలుగు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన మరువక ముందే మోడంపల్లెలోని శారదా ప్రేమవాణి అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది.
ఇంటి తాళాలు పగులగొట్టిన దుండగులు బీరువాలో ఉన్న నగదు, విలువైన చీరెలను దోచుకెళ్లారు. డీబీసీఎస్ మున్సిపల్ పాఠశాలలో టీచర్గా పని చేస్తున్న శారద డీఈఓ కార్యాలయంలో పని ఉండటంతో రెండు మూడు రోజుల నుంచి ఆమె కడపకు వెళ్తున్నారు. బుధవారం మధ్యాహ్నం తిరిగి ఇంటికి తిరిగొచ్చిన శారదకు తాళాలు పగులకొట్టి ఉండటం కనిపించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి విలువైన 20 చీరెలతోపాటు కొంత నగదు, వెండి వస్తువులు,సెల్ఫోన్ చోరీకీ గురిఅయినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఆవిడ పోలీసులకు పిర్యాదు చేశారు.