కడప: జిల్లాలో జగన్గ్రూపును దెబ్బతీసేందుకు మంత్రుల బృందం ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ముఖ్యంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టుకోసం ప్రాకులాడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో మ్యాచ్ ఫిక్స్ంగుకు సిద్దపడుతున్నారు. జిల్లాలో రెండు రోజుల నుంచి నలుగురు మంత్రులు కన్నాలక్ష్మినారాయణ, డిఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, వివేకానందరెడ్డి తిష్టవేశారు.
సాధ్యమైనంత మేరకు జగన్ గ్రూపుపై పట్టు సాధించేందుకు ప్రతిపక్షాలతో సైతం దోస్తీకి కాంగ్రెస్ సిద్దపడుతోంది. లోపాయికారి ఒప్పందాలతో ఎంపిటిసి, జడ్పిటిసిలను దక్కించుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. జగన్ ప్రభావం కాంగ్రెస్పై తీవ్రంగా ఉండడంతో ఓట్లు భారీగా చీలిపోయే అవకాశం ఉంది. దీన్ని ఎలాగైనా కాపాడుకునేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారు. మండలి ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై సుదీర్ఘంగా మంతనాలు చేయడంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.
మండలి ఎన్నికలతో పాటు ఒకటి రెండు రోజుల్లో కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పట్టును నిలుపుకునే ప్రయత్నాల్లో మంత్రులు జిల్లాలో తిష్టవేశారు. మండలికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధికారికంగా ఖరారు కాలేదు. ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు ఎన్.వరదరాజులరెడ్డికే టికెట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన మంత్రులతో పలుమార్లు భేటీ అయ్యారు. జిల్లా అంతా ప్రచారం మొదలుపెట్టారు. 488 మంది కాంగ్రెస్కు, 122మంది తెలుగుదేశానికి ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్కు చెందిన వారిలో అత్యధిక మంది జగన్గ్రూపులో కొనసాగుతున్నారు.
వారంరోజుల నుంచి క్యాంపు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. కిడ్నాపులు కూడా ఊపందుకున్నాయి. ఇదే తరుణంలో కేసులు కూడా నమోదువుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికార బలాన్ని ప్రయోగిస్తోంది. ఎలాగైనా స్థానిక సంస్థల శాసనమండలి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు మంత్రులు పావులు కదుపుతున్నారు.
జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మినారాయణ జిల్లాలోని తెలుగుదేశం నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. రాయచోటి మాజీ శాసనసభ్యుడు పాలకొండ్రాయుడును మంగళవారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. తమకు మద్దతు తెలిపి సహకరించాలని రాయచోటి పరిధిలోని తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులనుకోరినట్లు తెలిసింది. కన్నా, పాలకొండ్రాయుడు ఒకే సామాజిక వర్గం కావడంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మండలి ఎన్నికల్లో సహకరించేందుకు పాలకొండ్రాయుడు ఒప్పుకున్నట్లు తెలిసింది.
బుధవారం కూడా మంత్రి కన్నా రాజంపేటకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే మదన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. రాజంపేట ప్రాంతంలోని తెలుగుదేశంపార్టీ సభ్యులను కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేలా సహకరిం చాలని కోరినట్లు తెలిసింది. కన్నా సామాజికవర్గం రాజంపేట ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో అధిష్టానం ఈ ప్రయోగం చేసింది.
వీరే కాకుండా తెలుగుదేశం నాయకులు పోట్లదుర్తి సురేష్నాయుడుతోనూ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి సురేష్నాయుడు వేంపల్లెకు వెళ్లి 20సూత్రాల అమలు కార్యక్రమం ఛైర్మన్ తులసిరెడ్డితో భేటీ ఆయిన విషయం తెలిసిందే. కమలాపురం, మైదుకూరు ప్రాంతంలోని తెలుగుదేశం సభ్యుల మద్దతు ఇప్పించేందుకు సహకరించాలని కోరినట్లు తెలిసింది.
వీరే కాకుండా ప్రజారాజ్యానికి చెందిన గునిపాటి రామయ్య, కాంగ్రెస్లో చేరేందుకు సిద్దంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రమేష్రెడ్డి, లక్ష్మిరెడ్డి, కోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్లను కడపకే పిలిపించి వారితో సుధీర్ఘంగా చర్చించారు. మంత్రులు తమ అభ్యర్థి విజయం కోసం వ్యూహాలు పన్నుతుంటే జగన్ గ్రూపు మాత్రం గెలుపుపై ధీమా ఉంది. విజయం తమదేనంటున్నారు. ఎలాగైనా జగన్ను నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తున్న ఎత్తులు రాబోయే మండలి, ఉపఎన్నికల్లో ఏమేరకు పని చేస్తాయే వేచి చూడాల్సిందే.
(ప్రజాశక్తి)