కడప: బిజెపి కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ రామ్మోహన్ పిలుపునిచ్చారు. 2015-16 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పెట్టుబడిదారులకు, ధనవంతులకు, విదేశీ బహుళజాతి కంపెనీలకు వత్తాసుగా ఉందన్నారు. ఈ దేశాన్ని మరింతగా దోచుకోవడానికి అవసరమైన రాయితీలన్నింటిని అడ్డుగోలుగా అప్పచెప్పుతూ, సాధారణ ప్రజలపై మాత్రం మోయలేనిభారాన్నివేస్తూ బడ్జెట్ ప్రతిపాదనలుండడం యాదృచ్ఛికం కాదన్నారు.
ఓట్లేసిన ప్రజల కంటే ఎన్నికల నిధులను సమకూర్చిన పెట్టుబడిదారులకు సేవ చేయడమే లక్ష్యంగా బిజెపికి కలిగి ఉందన్నారు. బిజెపి బడ్జెట్ వల్ల ధనవంతులకు మంచి రోజులు, ప్రజలకు గడ్డు రోజులు రానున్నాయన్నారు. కాబట్టి ఈ తిరోగమన బడ్జెట్ను వ్యతిరేకంగా కదం తొక్కాలని, బడ్జెట్ ప్రతిపాదనకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు.
కడపలో ఈ నెల 5వ తేదీ సాయంత్రం ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియచేస్తామన్నారు.