కడప: దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్పాండ్ ప్రాజెక్టును కేంద్రం తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాయలసీమ మహాసభ తీర్మానించింది. స్థానిక సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో సీమ జిల్లాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ సమగ్రాభివృద్ధి సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాయలసీమ మహాసభ కేంద్రకమిటీ అధ్యక్షులు డా.శాంతినారాయణ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు.
పోలవరం వల్ల ప్రయోజనం స్వల్పమేనన్నారు. దుమ్ముగూడెం వల్ల 160 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లించడం ద్వారా ఆదా అయ్యే నీటిని శ్రీశైలం నుంచి సీమ ప్రాజెక్టులకు ఉపయోగించుకోవచ్చన్నారు.
తుంగభద్ర నుంచి కృష్ణా నదిలో కలుస్తున్న 150 టిఎంసీల నీటిని రాయలసీమ అవసరాలకు ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే దిశగా ఉద్యమించాలని, ఖనిజ, సహజ వనరుల ఆధారంగా పరిశ్రమల స్థాపనకు కృషిచేస్తూనే ప్రత్యేక రాయలసీమ సాధనకు అభ్యంతరం లేకుండా ముందుకెళ్లాలని నిర్ణయించారు.
కార్యక్రమంలో రాయలసీమ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కుళ్లాయి స్వామి, రచయితలు బండినారాయణ, రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి, వి.ఆర్.రాసాని, పాలగిరి విశ్వప్రసాద్, తవ్వా ఓబుల్రెడ్డి, నూకా రాంప్రసాద్ రెడ్డి, ఓబులేశు, హరినాథ్రెడ్డి, డా.గోవిందు, బాలసుందరం రాయలసీమ కార్యాచరణ కమిటీ నేత చంద్రశేఖర్రెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ అరుణ్, రాయలసీమ రైతు సంఘం నేతలు లెక్కల వెంకటరెడ్డి, దేవగుడి చంద్రమౌళీశ్వర్రెడ్డి, పోలు కొండారెడ్డి, డీఎన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాయలసీమ మహాసభ(రచయితల,కళాకారుల సమావేశం) తొలి అడుగు అనంతపురం జిల్లాలో మొదలైంది. కడప సి.పి.బ్రౌన్ లైబ్రరీ లో రెండవ సమావేశం జరిగింది. త్వరలో కర్నూల్,చిత్తూర్ జిల్లాల్లో సమావేశం,తదనంతరం 4 జిల్లాల భారీ సమావేశం, ఆ తర్వాత కార్యాచరణ మొదలవుతుంది.