అధికార యంత్రాంగం మొత్తం వైకాపాకు అనుకూలంగా పనిచేశారని కడప జిల్లా కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు అనిల్ కుమార్ కు ఫిర్యాదు చేయడం విశేషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున డి.సి.సి అధ్యక్షుడు మాకం అశోక కుమార్ దీనికి సంబంధించి కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించడం ఆసక్తికరంగా ఉంది.
జిల్లాలో మంగళవారం జరిగిన రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల ఉపఎన్నికల పోలింగ్లో పలువురు అధికారులు, ఉద్యోగులు ఏకపక్షంగా వ్యవహరించారని, ఆ మూడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలను, కార్యకర్తలను పోలీసు యంత్రాంగంతో పాటు ఎన్నికల నిర్వాహకుల్లో పలువురు అధికారులు, సిబ్బంది వేధింపులకు గురిచేశారని ఆయన ఆరోపించారు.
ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని కూడా ఆయన తెలిపారు. అలాగే పులివెందులకు సంబంధించిన అధికారులు, సిబ్బంది ఉపఎన్నికల విధుల్లో పాల్గొన్నారని వారు ప్రత్యక్షంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతిచ్చారని ఆయన ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం పలువురు అధికారులు, సిబ్బంది పనిచేయలేదని, తమ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్కుమార్రెడ్డిను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారని ఆయన అన్నారు.
అలాగే కాంగ్రెస్ ప్రాభల్యమున్న ప్రాంతాల్లో తమ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలింగ్ కేంద్రాల వద్ద చితకబాదారని ఆయన ఆరోపించారు. అదే విధంగా పలు పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని, సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు చేపట్టకపోతే ఆందోళన చేపడతామని ఆయన పేర్కొన్నారు.
అయితే ఈసీ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను చివరి నిమిషంలో బదిలీ చేయటంతో వారి వ్యూహం నెరవేరలేదని అందుకే వారు అధికారులపై ఇటువంటి ఫిర్యాదులు చేస్తున్నారని వైకాపా నేతలు చెప్తున్నారు.