కడప జిల్లాపై ముఖ్యమంత్రి తీవ్ర వివక్ష చూపిస్తున్నారు
రెండు జిల్లా వాళ్ళ మూడో పంట కోసమే పట్టిసీమ
ఇంకుడు గుంతల పేరు చెప్పి ప్రాజెక్టులు అటకెక్కిస్తున్నారు
ప్రొద్దుటూరు: కోస్తా ప్రాంతంలోని రెండు జిల్లాలకు కృష్ణా గోదారి నీళ్ళు రాయలసీమకు ఇంకుడు గుంతలా అని సిపియం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
స్థానిక సిపియం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకించి కడప జిల్లాపై చంద్రబాబునాయుడు తీవ్ర వివక్ష చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. సీమలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఇంకుడు గుంతలు అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో బాబు సియంగా ఉన్నప్పుడు ఇంకుడు గుంతల చుట్టు ప్రదక్షిణలు చేశారని, ప్రాజెక్టు నిర్మాణాలు వదిలి మళ్ళీ రాయలసీమలో ఇంకుడు గుంతల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి జిల్లాలోని తెదేపా నాయకులు వత్తిడి తీసుకరావాలన్నారు. జిల్లాలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. ప్రతిసారి ఎండలకాలంలో ఇది ఒక ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వకంగా మంచి నీటిఎద్దడి పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు.
జిల్లాలోని రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లో వర్షపాతం నమోదైనప్పటికీ భూగర్భజలాలు అడుగంటి పోయాయన్నారు. జిల్లాలో 900గ్రామాలలో నీటి ఎద్దడి ఉందని కలెక్టర్ నివేదించారని, మరి జిల్లాను ముఖ్యమంత్రి ఏవిధంగా సశ్యశ్యామలం చేస్తారో సెలవియ్యాలన్నారు.
జిల్లా ప్రజలను ముఖ్యమంత్రి మోసగిస్తున్నారన్నారు. ఆ రెండు జిల్లాల వాళ్ళ మూడవ పంటకు, వాళ్ళ చేపల చెరువులను నీళ్ళతో నింపడానికే పట్టిసీమ అన్నారు. కోస్తా ప్రాంత చేపల విలువ కూడా కడప జిల్లా ప్రజలకు లేకపోవడం దౌర్భాగ్యం అన్నారు.
అన్ని మున్సిపాల్టిల్లో నీటి మీటర్లు బిగించేందుకే సియం ప్రణాళిక రూపొందించినట్లు కనిపిస్తోందన్నారు.మంచి నీటి డిమాండ్ పెరిగితే ప్రజల అవసరాల కోసం మీటర్లు బిగించుకుంటారనే ముఖ్యమంత్రి ఎత్తుగడ అన్నారు. జిల్లాలో మంచి నీటి మీటర్లు ఎక్కడ బిగించినా తాము తీవ్రంగా ప్రతిఘటించి మీటర్లను పగులగొడతామన్నారు.
రాజధాని నిర్మాణం కోసం కృష్ణా జిల్లాలో 30వేల అటవీ భూములు ప్రభుత్వం తీసుకొని వీటికి బదులుగా జిల్లాలోని 56 వేల ఎకరాలను అటవీశాఖకు కేటాయింపుకు ప్రయత్నం జరుగుతున్నా జిల్లాలోని శాసనసభ్యులు, ఇతర పార్టీల నాయకులు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. ఈ విధానంపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
ప్రతిపక్ష నాయకుడు జగన్ శాసనమండలి ప్రతిపక్షనేత రామచంద్రయ్య మౌనం వహించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. భవిష్యత్తులో జిల్లాలోని అటవీ భూములు ఇవ్వకుండా ఉండేందుకు కలిసొచ్చే పార్టీలతో ప్రజా ఉద్యమం నిర్వహిస్తామన్నారు.