ఇంటి యాలి విడిచి యెట్లుండవచ్చురా..

తుంట వింటి వాని తూపుల ఘాతకు

మింటి మంటి నడుమ మిడుక తరమె?

ఇంటి యాలి విడిచి యెట్లుండవచ్చురా

విశ్వదాభిరామ వినురవేమ

 

కుటుంబ వ్యవస్థ లోపల గాని, బయటగాని విరహం విరహమే. ఈ భూమ్యాకాశాల మధ్య విరహమంతటి దుస్తర బాధ లేదని అంటున్నాడు వేమన. వేమన జీవితంలోని పరిణామాన్ని ఈ పద్యం సూచిస్తుందేమో తెలియదు. గతంలో భర్తతో సయోధ్య లేని భార్య గురించి అనేక పద్యాలు చెప్పాడు. వేశ్యా జీవితాలను గురించి చెప్పాడు.

 

కాని వేశ్యరికాన్ని వాచ్యంగా ఎక్కడా సమర్థించినట్టు లేదు. స్ర్తీ, పురుష సంబంధాలను గురించి వేమన్న అభిప్రాయాలను ఒకచోట పరచుకొని చూస్తే అవి మానవ జీవన ప్రయాణంలోని కొన్ని దశలుగా గుర్తించవచ్చు. అయితే వేమన తన వ్యక్తిగత విషయాల గురించి స్పష్టంగా చెప్పలేదు కాబట్టి వాడుక కథలే ఒక ఆధారం.

 

ఇది వేమన గృహస్థాశ్రమంలో చెప్పిన పద్యంగా కనిపిస్తుంది. చెరుకు విల్లులోంచి మన్మథుడు వదిలే బాణాల దెబ్బకు కలిగే మోహం ఇంతింత కాదు. ఆ విరహ వేదనకు పైన ఆకాశం, కింద భూమి సాక్ష్యం. ఎవరికోసమీ బాధ? ఇంకెవరికోసం ఇల్లాలి కోసం. ఆమె ఇంట్లో లేదు. బహుశా తల్లిగారింటికి వెళ్లి ఉంటుంది. ఇటువంటివి సంసారులందరికీ అనుభవంలో ఉండేవే.

చదవండి :  వేమన వెలుగులు

 

దీనిని ఒక్క పురుషులకే కాకుండా స్ర్తీలకు కూడా వర్తింపజేయవచ్చు. తుంట వింటివాడు అంటే మన్మథుడు. తుంట అంటే తునక, ముక్క. ఇక్కడ చెరకు గడ. అందుకే తుంట విల్కాడు అంటారు. తూపు అంటే బాణం. మిడుకతరమె – మిడుకుట అంటే దుఃఖపడటం. గుర్తుందా సుమతి పద్యం?

‘‘అడిగిన జీతం బియ్యని

మిడి మేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్

వడిగల యెద్దుల గట్టుక

మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ’’

ఘాత అంటే దెబ్బ. ఇంటియాలు అంటే గృహిణి. ఈ మాట ఉమ్మడి కుటుంబ చిహ్నం. ఆలుమగల మధ్య విరహముందంటే వారిది అన్యోన్య దాంపత్యం కిందే లెక్క. అది మూడు విరహాలు ఆరు సంయోగాలుగా వర్ధిల్లితే ఈ లోకం ఇంతకన్నా అందంగా ఉండే అవకాశం ఉంది.

 

అల్ప సుఖములెల్ల నాశించి మనుజుండు

బహుళ దుఃఖములను బాధపడును

పరసుఖంబునొంది బ్రతుకంగ నేరడు

విశ్వదాభిరామ వినురవేమ

 

స్వల్పమైన ఇంద్రియ సుఖాలను ఆశించిన మానవుడు అవి తీరక అనేక రకాలైన దుఃఖాలను కొని తెచ్చుకొని అవస్థలు పడుతుంటాడు. మోక్షం వంటి ఉదాత్తమైన సుఖాలతో జీవించవచ్చు కదా! దానికోసం ప్రయత్నమే చెయ్యడు అని జాలిపడుతున్నాడు వేమన.

చదవండి :  హిమధాముడు లేని రాత్రి హీనములు సుమతీ

అల్ప సుఖాలు అంటే చిన్న చిన్న ఆనందాలు. సుఖం అంటే ఆనందాన్ని చేకూర్చేది. నిజంగా అది ఆనందాన్ని చేకూరుస్తుందా? ఏమో! ఒకవేళ అది నిజమే అయితే ఆ క్షణం వరకే. జిహ్వ చాపల్యం లాంటివి అల్పసుఖాలు. అలాంటివెన్నో! అవి తీరకపోతే ఆశాభంగం, బాధ; దుఃఖం అంటే బాధే. దుఃఖం రెండు రకాలు ఒకటి ప్రాప్త దుఃఖం, రెండోది స్వీయ దుఃఖం. రెండోది కొని తెచ్చుకునేది. మొదటిది భాగ్యవశాన ప్రాప్తించేది.

ఇంతకూ దుఃఖమంటే ఏమిటి? వేదాంత పరంగా ఇది చాలా పెద్దమాట. శోకం దానికి మాధ్యమం మాత్రమే. దుఃఖాన్ని గురించి బుద్ధుడు ఎంతో ఆలోచించాడు. దాని పునాదులపైన తన 36వ యేట బుద్ధి పొందాడు. మరో 44సంవత్సరాల పాటు బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. ఇంతకూ దుఃఖాన్ని గురించి ఏమన్నాడు బుద్ధుడు? దుఃఖానికి హేతువు కోరిక అన్నాడు. కోరిక ఎలా పుడుతుంది? ఎలాగంటే ఇంద్రియాలకు ఇష్టమైన విషయాలతో ఉండే సంపర్కం నుండి కోరిక పుడుతుంది.

చదవండి :  ముక్క వంకజూచి ముకురంబు దూరుట

దుఃఖం అంటే ఒక మానసిక స్థితి. జన్మం, మృత్యువు, వార్థక్యం, మనస్సు విచలితమై పోవడం, ఇష్టం లేని వారితో కలయిక, ఇష్టమైన వారితో ఎడబాటు, కోరింది రాకపోవడం ఇవన్నీ దుఃఖాలే. వేమన చెప్తున్న బహుళ దుఃఖాలంటే ఇవే. మరి దుఃఖమెలా పోతుంది? అదేం ప్రశ్న కోరిక నశిస్తే దుఃఖాన్ని నిరోధించవచ్చు. బౌద్ధంలో దుఃఖాంతాన్ని నిర్వాణం అంటారు.

 

నిర్వాణమంటే ఆరిపోవటం అని అర్థం. నిర్వాణమంటే దుఃఖ నాశం, విరాగం, రాగక్షయం అని అర్థాలు. వేదన యొక్క అభావమే నిర్వాణం. వేమన్నపైన బౌద్ధ మత ప్రభావం ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు గాని, అక్కడక్కడ ఆ ఛాయలు కనపడతాయి. శూన్య వాద ఛాయలు కూడా అంతే.

ఈ పద్యం చిన్నదే గాని పరమ గంభీరమైంది. దీనివల్ల సుఖ దుఃఖాలు అనే రెండు భావాలే మానవాళిని పాలిస్తున్నాయని అర్థమౌతుంది. వీటికి లోబడి మాత్రమే మనుషులు జీవిస్తున్నారు. సుఖమంటే భౌతిక సుఖమే అనుకుంటారు. ఒక రకంగా ఇది ఆభాసం. నిజానికి చిన్న సుఖాల్లో దుఃఖమెక్కువగా ఉంటుందని సారాంశం.

డా॥ఎన్.గోపి

(సాక్షి తెలుగు దినపత్రిక)

ఇదీ చదవండి!

మనమింతే

కడపలో రాజధానితోనే రాయలసీమ సమగ్రాభివృద్ధి

రాయలసీమ ప్రాంతంలో కడప లాంటి నగరంలో రాజధాని నెలకొల్పకుంటే, సమీప భవిష్యత్తులోనే ప్రత్యేక తెలంగాణా తరహా మరో వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి అటు అభివృద్ధి పరంగాను, ఇటు శాంతిభద్రతల పరంగాను ఈ ప్రాంతాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిరక్షించదలచుకుంటే కడప నగరంలో రాజధాని ఏర్పాటు ప్రభుత్వపరంగా ఒక చారిత్రక బాధ్యత.

2 వ్యాఖ్యలు

  1. మనసు నిలిపి మనసు నిర్మలంగా, నిమ్మళంగా వుండాలని కోరుకుంటాడేగానీ మదిని నిగ్రహించుట మిక్కిలి సాహసవంతమైన పని అని చెబుతాడు! తన సాధనాబలం చేత దాటిన జ్ఞాని మనసునిలిపి నిశ్చల స్థితిని పొంది భగవంతునిపై లగ్నమై ఉంటుంది. మనసు నిలిపి శరణాగతినే కోరుకుంటుంది ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఆత్మ )సాక్షాత్కారం తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం. తానని గ్రహించటం సూక్ష్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ఆత్మా సాక్షాత్కారం .’ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. అతీతమైన సూక్ష్మచైతన్య స్థితి ఒక క్షణంలోమనసు నిలిచి అమనస్కమైన ఉండాలి ఆత్మ సాక్షాత్కారం అని చెప్పారు.క్షణంలోగురువు ద్వారానే దర్శనం చేసుకోవాలి . ఉన్నది ఒకే ఆత్మ .. నేను, నీవు, ఈ బ్రహ్మ.. భవిష్యత్తులో ఆవిర్భవించనున్న వేమన ఇవన్నీ ఏకస్వరూపాలే.ఆత్మఏకస్వరూపా ము ఆత్మలో ఏ బేధం లేదని” అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు గురువు చెబుతున్నారు. జీవనముక్తి మార్గంలో సూక్ష్మసాధన ద్వారా “తత్వమసి” అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, “అది” వున్నది. ఆత్మసూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అని కూడా అంటారు. అమరత్వము సాధించి పెట్టడం అనే విషయాన్ని మానవ జాతికి అందించడానికి గురువుద్వారా నూతన పరిణామము తీసుకొని వచ్చింది. మనసు నిలుపకున్న ముక్తి లేదయా చూపు నిలుపకున్న సుఖము లేదుబ్రహ్మ మనగ వేరె పరదేశమున లేడు బ్రహ్మ మనగ జూడు బట్ట బయలు, తనకు తానె బ్రహ్మ తారక మౌనయా గురువు మీద నమ్మకం ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. చీకటిలో నడవడానికి దీపం మీద ఎంత నమ్మకంగా ఆధారపడతామో అదేవిధంగా మనలోని అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి గురువు మీద అంతగా ఆధారపడాలి. మనం భ్రమతో చీకటిలోకి వెళ్తున్నాం. ఈ జీవితం అంతా మాయ. ఈ పుట్టుక, మరణం కూడా మాయనే. ఈ శరీరం వీడిన తరువాత ఏదీ మనవెంట రాదు. అన్నింటికి మనం దూరం అవుతాం. శరీరం నశించిన తరువాత అసలు మనము ఉండం. అందుకే నాది, నావి, నావారు అనే భ్రమలు వదులుకోవాలి. ఈ జీవన నాటక రంగంపై నటించాలి. నాటకంలో పాత్రధారి పూర్తిగా లీనం కానట్లే జీవితంలో కూడా మీరు పూర్తిగా లీనం కావద్దు.

  2. 1 .ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని వస్తువు లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని జగము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యంలేని జీవము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం లేని దైవం లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని ఏ నేనే సమస్త ఆత్మ లో ఎరుక చైతన్యం నేనే సర్వాధారం. అట్టి నన్ను తెలుసుకొనుటయే సమస్త మత ధర్మముల, సమస్త వేదాంత యోగసూత్రముల, సమస్త జ్ఞాన యజ్ఞముల ఫలితం. నన్ను మరిచి ఎన్ని గ్రహించినా సర్వం అధోగతియే. నాతో ఈ సమస్తం ఆత్మ లో ఎరుక చైతన్యం ఏకీభవించి ఆత్మ లో ఎరుక చైతన్యం నాయందే లీనమైయున్నది నేనే సర్వమునకు మూలం. మనో జగత్తులకు తేడాలేదు. జగము మనోకల్పితము శరీరము భ్రమ – భ్రాంతి – అజ్ఞానంసంసారమనే భ్రమ కేవలం బుద్ధిభ్రాంతి మూలకమే కాని పరమార్థ సత్యం కాదు. శరీరం ఎన్నో అవయువాలు కలిగినది. కాని జనం ఈ రెండిటినీ ఒకటే అని భావిస్తారు. ఇంతకన్న అజ్ఞానం ఇంకొకటి ఉంటుందాధర్మమన్న వినరు తను నమ్మి

    దాన ధర్మాలు చెయ్యండి అంటే వినిపించుకోరు. ఎందుకంటే తమ దేహాలు శాశ్వతమనుకొని విర్రవీగుతారు. ఎవరు? భూలోకంలో జీవించే మనుష్యులు. మూర్ఖత్వం కాకపోతే అవసాన దశలో యమకింకరులు వచ్చి భయపెట్టి వెంటబడి తరుముతుంటే ఎక్కడికని పారిపోతారు? అప్పుడెవరు రక్షిస్తారు? అని ప్రశ్నిస్తున్నాడు వేమన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: