వేంపల్లె : గవర్నర్ కోటా కింద తనకు ఎమ్మెల్సీ ఇవ్వనందుకు ఎలాంటి బాధ లేదని మాజీ మంత్రి వివేకానందరెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లెలో 20సూత్రాల ఆర్థిక అమలు కమిటి ఛైర్మన్ తులసిరెడ్డి, కాంగ్రెస్ నేత కందుల రాజమోహన్రెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఓటమిచెందితే ఎమ్మెల్సీ, మంత్రి పదవి తీసుకోకుండా సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని నేను అన్న మాటను కాంగ్రెస్ అధిష్ఠానం గౌరవించిందన్నారు.
ఎన్నికల్లో ఓడినందున అన్నమాట ప్రకారం ఎలాంటి పదవి తీసుకోకుండా కాంగ్రెస్లో కొనసాగుతానన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారన్న విషయమై వివేకా స్పందిస్తూ అసెంబ్లీలో ఒక సభ్యుడు ఉన్నా తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చని, అయితే మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు సమస్యపై ఓటింగ్ ఉంటుందన్నారు.
రైతులకు నాసిరకం విత్తనాలు సరఫరా చేస్తే రైతులు అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. రాయితీ విత్తనాల పంపిణీని ఎత్తివేసి రైతుల అర్హతను బట్టి ప్రభుత్వం వారికి నేరుగా నగదు చెల్లిస్తే మంచి విత్తనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉందన్నారు. 20స్రూతాల ఆర్థిక అమలు కమిటి చైర్మన్ తులసిరెడ్డి మాట్లాడుతూ వివేకాకు ఎమ్మెల్సీ కంటే పెద్ద పదవే రావచ్చన్నారు. శాసనసభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తనవద్ద తగినంత బలం లేదని జగన్ ఒప్పుకోవడం అభినందనీయమన్నారు. తన కనుసన్నల్లోనే ప్రభుత్వం నడుస్తోందని, తలచుకుంటే ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ ఎన్నికల ముందు.. ఎన్నికల తరువాత ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. అయితే బలం లేకపోవడంతో వాస్తవాలు తెలుసుకుని వెనుకంజ వేస్తున్నాడన్నారు.
రాష్ట్ర ప్రజలు 2014వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని తీర్పు ఇచ్చారని, అలాంటి ప్రభుత్వాన్ని మధ్యలోనే కూలుస్తామనడం ప్రజాస్వామ్య వాదులెవరో హర్షించరన్నారు. కాంగ్రెస్నేత కందుల రాజమోహన్రెడ్డి మాట్లాడుతూ 125ఏళ్ల కాంగ్రెస్ దేశ శ్రేయస్సు కోసం కొన్ని సిద్ధాంతాలపై పనిచేస్తూ ముందుకు వెళుతోందన్నారు. తెదేపాలో వారసత్వపోరు అధికం అవుతోందని, భాజపాలో అవినీతి పరులైన గాలి సోదరుల వ్యవహారమై జోరుగా చర్చ సాగుతోందన్నారు. ఎంపీటీసీ సభ్యుడు జి.వి.రమణ, ఉపసర్పంచి రెడ్డెయ్య, ఫాస్టర్ రవి, చలమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.