సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎన్ సంపత్ ప్రకటించారు. మన కడప జిల్లాలో మే 7వ తేదీన 10 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్ 19. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21న ఉంటుంది. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది.
మార్చి 9వ తేదీన బూత్ లెవెల్ అధికారులు సమావేశం అవుతారని, ఆరోజున ఎన్నికల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చు పరిమితిని 70 లక్షలుగా నిర్ణయించారు. సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లు హెచ్.ఎస్.బ్రహ్మ, ఎస్.ఎన్.ఎ.జైదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షెడ్యూలు ప్రకటనతో బుధవారం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలోనే జరుగుతుంది. కానీ ఈసారి వేదికను కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞాన్భవన్కు మార్చింది.
మొత్తం అన్ని రాష్ట్రాలలోనూ లోక్సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరిగిన తర్వాత మే 16వ తేదీ శుక్రవారం నాడు ఓట్ల లెక్కింపు ఉంటుంది.
తొలిసారి నోటా ….
మొదటిసారిగా తిరస్కరణ ఓటు నోటాను ప్రవేశపెట్టారు. ఈవీఎంలతోనే ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఎన్నికల ఖర్చు మదింపునకు ఒక పరిశీలకుడిని ఏర్పాటు చేశారు. తప్పులకు పాల్పడే ప్రభుత్వాధికారులపై కఠిన చర్యలుంటాయని ఈసీ హెచ్చరించారు. రుతుపవనాలు, విద్యార్థుల పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఎన్నికల తేదీలను నిర్ణయించామన్నారు. ఓటర్ల నమోదుకు మరో అవకాశాన్ని ఇచ్చింది.