మన కలమళ్ళ శాసనం (తొలి తెలుగు శాసనం) ఎక్కడుంది?

కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం.

పోగొట్టుకున్నాం!

kalamalla sesanamఈసారి పోయింది అట్లాటి ఇట్లాటి వస్తువు కాదు. తెలుగు భాషకు వెలుగు పూలు పూయించిన తొలి తెలుగు శాసనం…

తెలుగు భాషకు రాజ భాష హోదాను, శాసన భాషగా ఒక అధికార ప్రతిపత్తి కల్గించి, తెలుగు భాషకు అక్షర రూపం యిచ్చి చారిత్రకంగా, సాహిత్యపరంగా ఘన వారసత్వ కీర్తిని అందించిన ‘కలమళ్ళ శాసనం’ -తొలి తెలుగు శాసనం ఎక్కడుందో యిప్పుడెవరికీ తెలియడం లేదు. అందరూ నిస్సహాయంగా చేతులెత్తేస్తున్నారు. దీంతో దాదాపుగా మనం తొలి తెలుగు శాసనాన్ని కోల్పోయినట్లేనని భావించాల్సి వస్తోంది.

కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. ఆ తర్వాత వారితో పాటూ ఆ శాసనాన్ని మద్రాసు మ్యూజియానికి తరలించారని అందరూ భావిస్తూ వచ్చారు. ఇదే నేపథ్యంలో నేను సమాచార హక్కు చట్టం ద్వారా 07 జనవరి 2013 నాడు శాసనం నమూనా ప్రతిని, స్క్రిప్ట్‌ను జతపర్చుతూ సమగ్ర వివరాలతో చెన్నై ‘ఎగ్మోర్’ ప్రభుత్వ మ్యూజియం వారిని ప్రశ్నించడం జరిగింది.

తొలి తెలుగు శాసనం, రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనంకు సంబంధించిన వివరాలు, మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారా? దానిని తగిన విధంగా సంరక్షిస్తున్నారా? వంటి ప్రశ్నలను వారి ముందుంచినప్పుడు- అలాంటి శాసనమేదీ తమ వద్ద లేదని- చెన్నై ప్రభుత్వ మ్యూజియం అసిస్టెంట్ డైరక్టర్ తిరు ఎస్. సెల్వ అరసు, అధికారికంగా లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

దీంతో యింతకాలంగా ఎగ్మో ర్ మ్యూజియంలో వుందని భ్రమపడుతూ వచ్చిన శాసనం అక్కడ లేదని తేలిపోయింది. అంతకు మునుపే శాసన నిర్దేశకుల కార్యాలయం, భారతీయ పురాతత్వశాఖ, మైసూరు వారి వద్ద కూడా ఈ శాసనం లేదని వెల్లడైంది. ఈ మైసూర్ శాఖ ఎపిగ్రాఫియా ఇండియా, ఏన్యువల్ రిపోర్ట్ ఆన్ ఇండియన్ ఎపిగ్రఫీ అనే శాసన పత్రికలను కూడా ప్రచురిస్తోంది. ఈ మైసూర్ కార్యాలయానికి 125 సంవత్సరాల చరిత్ర కూడా వుంది. వీరి వద్ద రేనాటి చోళుల శాసనాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం వుంది. కానీ ‘తొలి తెలుగు శాసనాన్ని’ సేకరించకపోయినందుకు, సంరక్షించక పోయినందుకు మనం విచారించాల్సిందే!

చదవండి :  పోట్లదుర్తి - యాట కుక్కపైన కుందేళ్లు తిరగబడిన చోటు

ఇదే విధంగా భారతీయ పురాతత్వ సర్వేక్షణ, ఉప పురాతత్వ అధీక్షకులు- హైదరాబాదు వారిని కూడా 30 అక్టోబర్ 2012 నాడు రెండు లేఖల ద్వారా ప్రశ్నించడం జరిగింది. వారి నుంచి కూడా అసంతృప్తిని మిగిల్చే సమాధానాలే లభించాయి. తొలి తెలుగు శాసనం ఆచూకీ తమకు కూడా తెలియదని చేతులెత్తేయడం దిగ్భ్రాంతిని కల్గిస్తోంది.

సమాచార హక్కు చట్టం ద్వారా భారతీయ పురాతత్వ శాఖ, హైద్రా బాదు మండలం వారిని ఈ అంశంపై అడిగిన కొన్ని ప్రశ్నలు- వాటికి వారిచ్చిన సమాధానాలు ఇవి:

కడప జిల్లాలో బయల్పడిన ‘కలమళ్ళ శాసనం’ ప్రస్తుతం ఎక్కడ వుంది?

 కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో 1904లో మద్రాసు నందలి శాసన పరిశోధన విభాగం వారు ఈ శాసనాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఎక్కడ వుందో తెలియదు. ?

కలమళ్ళ శాసనం పొడవు, వెడల్పు, ఆకారం, బరువు వంటి సాంకేతిక వివరాలు తెలపగలరు?

 కలమళ్ళ శాసనం పొడవు, వెడల్పు, ఆకారం, బరువు వంటి సాంకేతిక వివరాలు లభించుట లేదు.

 కలమళ్ళ శాసనాన్ని మొదటిసారిగా ఎవరు, ఎప్పు డు, ఎక్కడ గుర్తించారు? తర్వాత ఎక్కడికి తరలించారు? ప్రస్తుతం ఎక్క డుంది?

కలమళ్ళ శాసనాన్ని తొలిసారిగా 1904లో మద్రాసు ప్రభుత్వ శాఖ వారు కలమళ్ళ గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో వున్న ట్లు గుర్తించారు. తర్వాత 1947-48 లో ఆచార్య కె.నీలకంఠ శాస్త్రి, యమ్. వెంకట రామయ్య ఈ శాసనాన్ని పరిష్కరించి ప్రచురించారు.

ఇంతకు మించి ఏ సమాచారం అందుబాటులో లేదు.

తొలి తెలుగు శాసనంగా చెప్పబడుతున్న కడప జిల్లా లోని కలమళ్ళ శాసనంను భారతీయ పురాతత్వ శాఖ తొలి తెలుగు శాసనంగా అంగీకరిస్తోందా? అంగీకరిస్తే ఆధారాలు తెలుపగలరు? 

రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన కలమళ్ళ శిలాశాసనాన్ని తొలి తెలుగు శాసనంగా ప్రసిద్ధ శాసన పరిశోధకులు సహేతుకంగా నిర్ణయించారు. కావున మేము కూడా వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాము. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం. ఎరికల్ ముత్తురాజు వేయించిన ఎర్రగుడిపాడు శాసనం, పుణ్యకుమారుడి తిప్పలూరు శాసనాలు తర్వాత క్రమంలో వచ్చి చేరుతాయి.

చదవండి :  'నేను ఉన్నప్పుడు నా విలువ మీకు తెలియదు'..శ్రీమాన్ పుట్టపర్తి

‘తెలుగు లిపి’ నిర్మాణం…

తొలి తెలుగు శాసనం వల్ల నాటి నుంచి నేటి వరకు తెలుగు లిపి పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికి వీలు కల్గుతుంది. ప్రాకృత, ద్రావిడ భాషల నుండి విడిపోయి వేరుగా తెలుగు లిపి నిర్మితం కావడం గుర్తించవచ్చు. తెలుగు వాక్య రచనా విధానం, ఉచ్ఛారణ సౌలభ్యం కోసం చేసుకున్న ఇతర మార్పులు విశదమవుతాయి. ప్రాకృత వాక్యాల స్థానంలో తెలుగు వాక్యాలు చేరడం గమనించవచ్చు. వీటి ద్వారా తెలుగు భాషా సంప్రదాయ, స్వరూపాన్ని విశ్లేషించవచ్చు.

చరిత్ర ఆధారాల్లో…

రేనాటి చోళుల కారణంగా మనకు ఇవాళ ప్రాచీన తెలుగు వాక్య రచనా విధానం తెలుస్తోంది. రేగడినేల ఉన్న ప్రాంతం కాబట్టి ‘రేగడినాడు’ ప్రాంతం ‘రేనాడు’గా మారి ఉండవచ్చునని చరిత్ర పరిశోధకుడు పుట్టపర్తి శ్రీనివాసాచారి అభిప్రాయపడ్డారు. రేనాటి చోళులు తాము కరికాల చోళుని సంతతికి చెందినవారమని చెప్పుకున్నారు. క్రీ.శ. 484 ప్రాంతంలో రేనాడు కరికాల చోళుని పాలనలో వుండేదని చరిత్రకారుడు నేలటూరి వెంకట రమణయ్య నిరూపించారు.

తెలుగులో మొట్టమొదటి శాసనాల్లో కన్పించే రేనాటి చోళుని పేరు ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు. ఇతడు నందివర్మ కుమారుడు. ధనుంజయ వర్మ పేరుకు ముందున్న ‘ఎరికల్’ అనేది రేనాటి సీమలోని గ్రామమై వుంటుందని కూడా చరిత్రకారుల భావన.

రేనాటి చోళులు ‘చెప్పలియా’ గ్రామం రాజధానిగా రేనాటి ప్రాంతాన్ని పాలించారు. రేనాడు ప్రాంతం కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, కమలాపురం, జమ్మల మడుగు, తాలూకాలు; కర్నూలు జిల్లా కోయిలకుంట్ల తాలూకాలోని కొన్ని ప్రాంతాలతో వున్న ఏడు వేల గ్రామాలున్న ప్రాంతంగా ‘పూర్వోద్ధృతము’ రచన నందు ఎస్.వి.రమణయ్య ఆధారాలు చూపారు. రేనాటి చోళులు తమ రాజధానిగా చేసుకున్న ‘చెప్పలియా’ ప్రాంతం నేడు కమలాపురం మండలంలోని ‘పెద్ద చెప్పలి’గా తగిన ఆధారాలతో గుర్తించడం కూడా జరిగింది.

రేనాటి చోళుల వంశ వృక్షంలో 13 తరాల రాజుల పేర్లు శాసనాధారాల ద్వారా రూపొందించడమైంది. కశ్యప గోత్రానికి చెందిన నందివర్మ పరిపాలనా కాలం క్రీ.శ. 550 అని చెప్పుకోవచ్చు. తర్వాతి తరంలో వచ్చిన సింహ విష్ణు, సుందరనంద, ధనుంజయ వర్మలు క్రీ.శ. 575 ప్రాంతంలో వచ్చారు. పుణ్యకుమారుడు, వసంతపోరి చోళ మహరాణి భర్తగా, పోర్ముఖరామ, పురుష శార్దూల, మదన విలాస వంటి బిరుదులు ధరించి క్రీ.శ. 625లో నాల్గవ తరంలో కీర్తి పొందాడు. 11వ తరంలో నృపకామ (క్రీ.శ. 800), 12వ తరంలో దిహికర (క్రీ.శ. 825), 13వ తరంలో శ్రీకంఠ అధిరాజు (క్రీ.శ. 850) క్రమ పట్టికలో కన్పిస్తారు.

చదవండి :  కడప జిల్లా శాసనాలు 1

ఆనాటి కాలంలో యువరాజు కాకుండా మిగిలిన రాజకుమారులలో పెద్దవాడిని ముత్తురాజు అని పిలిచేవారు. అంటే యువరాజు తర్వాత రాజ్యానికి రాజుగా రావడానికి అవకాశాలున్న వారికే ఈ పట్టం యిచ్చేవారు. మహేంద్రవర్మ కొడుకైన పుణ్యకుమారుడి రెండు తామ్ర శాసనాలు, మూడు శిలాశాసనాలు లభిస్తున్నాయి. ప్రొద్దుటూరు రామేశ్వర శిలాశాసనంలో ‘పృథివీ వల్లభ’ అనే బిరుదు పేర్కొనడం జరిగింది. పుణ్య కుమారుడు హిరణ్య రాష్ట్రాన్ని పాలిస్తూ కొంత భూమిని దానం చేసినట్లు ఒక తామ్ర శాసనం చెప్తోంది. తర్వాత కాలంలో వైదుంబ రాజులు రేనాడును ఆక్రమించుకోగా వీరు పొత్తపి ప్రాంతానికి మరలిపోయినట్లు చరిత్ర కథనం.

చివరగా…

గత ఏడాది డిసెంబర్ మాసంలో 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటూ నిర్వహించిన ‘ప్రపంచ తెలుగు మహాసభల్లో’ తొలి తెలుగు శాసనాన్ని ప్రదర్శిస్తారని ఎందరో భాషాభిమానులు, చరిత్ర పరిశోధకులు ఎదురుచూశారు. కానీ వారికి నిరాశే మిగిలింది. అధికార భాషా సంఘం, రాష్ట్ర సాంస్కృతిక శాఖ గానీ దీని పట్ల శ్రద్ధ పెట్టినట్లు కూడా కన్పించదు. భారతీయ పురాతత్వ శాఖ-హైదరాబాదు శాఖ గురించి యిక చెప్పనవసరం లేదు. కనీసం యికనైనా ఈ శాసనం ఆనవాళ్ళ గురించి, ఆచూకీ గురించి విస్తృతంగా అన్వేషణ జరగాల్సిన అవసరం తప్పనిసరిగా వుంది. లేదంటే- చరిత్ర ఎప్పటికీ మనల్ని క్షమించదు.

కలమళ్ళ శిలాశాసనము

దాత : తెలుగు చోళవంశపు ధనంజయుడు
పరిపాలన కాలము:
క్రీ.శ. ఆరవ శతాబ్ది అంతము
శాసన కాలము : అనిర్దష్టము
…………………….
శాసనభాగ పాఠము:
1. ……………….
2. కల్ముతురా
3. జు ధనంజ
4. య ఱు రేనా
5. ణ్డు ఏళన్
6. చిఱుంబూరి
7. రేవణకాలు (పం)
8. పు చెనూరు కాజు
9. ఆఱికాశా ఊరి
10. ణ్డవారు ఊరి
11. న వారు ఊరిస…

రచయిత గురించి

కడపకు చెందిన వేంపల్లి గంగాధర్ సుపరిచితులైన పాత్రికేయుడు, కవి, రచయితాను. వీరు పలు కథలు, వ్యాసాలు రాశారు. నేల దిగిన వాన అనే నవల కూడా రాసారు. రాయలసీమ ఇతిహాసం అనే పేరుతో వార్తలో వచ్చే కాలమ్ వీరిదే. మొలకల పున్నమి, హిరణ్య రాజ్యం,.. మొదలైన ఐదు పుస్తకాలు రాసారు. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ నుండి యువపురస్కారాన్ని అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: