కలివికోడి

ప్రపంచంలోనే అరుదైన కలివికోడి లంకమలలో

సుమారు వందేళ్ళ క్రితమే అంతరించిపోయిందని భావించిన కలివికోడి ఇరవై ఏళ్ళ కిందట 1986వసంవత్సరంలో మనదేశంలోని తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల, శేషాచలం పర్వతపంక్తులలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో సిద్దవటం-బద్వేలు మధ్య అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమై పక్షిశాస్త్ర వేత్తలనూ, ప్రకృతి ప్రేమికులనూ ఆశ్చర్యానికి గురిచేసింది.

కలివికోడి రక్షణకు గత ఇరవై ఏళ్ళగా పలుచర్యలను తీసుకుంటున్నారు. ..ఆ పక్షి ఉనికికే ప్రమాదం కలిగే రీతిలో జరిగిన పరిణామాలు  ప్రపంచవ్యాప్త చర్చకు  దారితీశాయి. కలివికోడికి ఆవాస ప్రాంతమైన లంకమల పరిథిలో తెలుగుగంగ కాలువ తవ్వకాలు చేపట్టడం వల్ల ఆ పక్షి ఉనికికి ప్రమాదం ఏర్పడింది. నల్లమల అటవీ ప్రాంతంలో మొదటిసారిగా బ్రిటీషు సైనిక వైద్యాధికారి టి.ధామస్‌, సి.జెర్ధాన్‌ 1948వ సంవత్సరంలో  కలివికోడిని గుర్తించారు.

54ఏళ్ళ నిరీక్షణ

ప్రపంచ ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ  1932లో హైదరాబాదు ఆర్నిథాలాజకల్‌ సర్వే సంస్థ ద్వారా కలివికోడిపై పరిశోధన ప్రారంభించారు. కలివికోడిని చూడాలని సలీం అలీ 54ఏళ్ళ పాటు నిరీక్షించారు.

బాంబే నాచురల్‌ హిస్టరీ సొసైటి ( BNHS )ఆధ్వర్యంలో భరత్‌ భూషణ్‌ అనే శాస్త్రజ్ఞుడు  కూడా కలివికోడి ఆచూకి కోసం తమ పరిశోధనలను విస్తృతం చేశారు. బద్వేలు, సిద్దవటం అటవీ పరిసర గ్రామాలను ఆయన సందర్శించి ప్రజలను విచారించారు. ఆ పక్షి ఫోటోలు, వివరాలున్న పోస్టర్లను గ్రామాల్లో అతికించారు. కలివికోడి ఆచూకీపై దృష్టిపెట్టి, ఆపక్షి కనబడితే అటవీశాఖ అధికారుల ద్వారా తమకు  తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు.

చదవండి :  బంద్ విజయవంతం

కడప జిల్లా రెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఐతన్న అనే గొర్రెల కాపరి అడవికి వేటకు వెళ్ళేవాడు. అతనికి 1986 జనవరి 5వ తేది రాత్రి అడవిలో వేటాడుతుండగా కొత్తరకం పక్షుల జంట కనబడింది. ఐతన్నకు వెంటనే ఆలోచన తట్టింది. శాస్త్రవేత్తలు, అధికారులు వెదుకుతున్న పక్షి ఇదేనని భావించాడు. పోస్టర్లలోని పోటోతో ఈ పక్షులను పొల్చుకుని నిర్థారించుకున్నాడు. ఆ పక్షుల జంటలో ఓ పక్షిని అతి కష్టంమీద పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. తిరుపతిలో ఉన్న శాస్త్రవేత్త భరత్‌భూషణ్‌కు ఉదయమే సమాచారం అందించారు. భరత్‌ భూషణ్‌ ఆ పక్షిని కలివికోడిగా ధృవీకరించి, ఆ విషయాన్ని బొంబాయిలోని శాస్త్రవేత్త సలీం అలీకి తెలియజేశారు.

సలీం అలీ 1986 జనవరి 9వ తేదిన కడపకు చేరుకున్నారు.  ఐతన్న అటవీ అధికారులకు అప్పగించిన కోడి ఆహారం తీసుకోని కారణంగా ఆ నాలుగు రోజులకే క్షీణించింది. కొనప్రాణంతో ఉన్న కలివికోడిని సలీం అలీ అఖరి గడియలో చూడగలగడం ఒక ఉద్విగ్నమైన సన్నివేశంగా మారింది. కలివికోడి అప్పుడే ప్రాణాలు విడిచింది. దాన్ని రసాయనాల సా

కలివికోడి తపాల బిళ్ళ
1988లో విడుదలైన కలివికోడి తపాల బిళ్ళ

యంతో  సలీం అలి బాంబేలోని మ్యూజియంలో భద్రపరిచారు.

మొదట కలివికోడి ఆవాసప్రాంతాన్ని 464.5చ. కి.మీగా గుర్తించి శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరో  1,037 చ.కి.మీ. విస్తీర్ణంతో శ్రీ పెనుశిల నరసింహా వన్యప్రాణి అభయారణ్యాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం. కలివికోడిపై భారతీయ తపాలశాఖ 1988 వ సంవత్సరంలో స్టాంపును విడుదల చేసింది.

చదవండి :  కడప జిల్లాలో భారీగా తహశీల్దార్ల బదిలీ

బైనామియల్‌నేమ్‌ – ”రినోప్టిలస్‌ బిటోర్‌ క్వేటస్‌”గా వ్యవహరిస్తున్నారు. 1849లో  C.Jerdon కనుగొన్నందున కలివికోడికి Jerdon’s Courser పేరు పెడుతున్నట్లు 1988లో ప్రకటించారు. కలివికోడి ఏక్కువగా ముళ్ళపొడలు గల అటవీ ప్రాంతంలో నివసిస్తుంది. ఎక్కువగా నడక ద్వారానే ఈ పక్షి సంచరిస్తూ ఉంటుంది. ఈ పక్షుల సంఖ్య 25 నుండి 200 మధ్య ఉండవచ్చునని భావిస్తున్నారు. కలివికోడి ”ట్విక్‌-టూ, ట్విక్‌ – టూ” అంటూ అరుస్తుందని, ఈ పక్షి అరుపును రికార్డు చేసిన  పంచ ప్రకాశన్‌ జగన్నాథన్‌ (BNHS  సీనియర్‌ రీసెర్చ్‌ఫెలో) ప్రపంచానికి చాటాడు.

శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం పరిధిలో చేపట్టిన తెలుగుగంగ కాలువ నిర్మాణ పనుల వల్ల అరుదైన కలివికోడి ఉనికి ప్రమాదం ఉత్పన్నమైంది. 1995 అక్టోబర్‌లో కాలువ తవ్వకాలను చేపట్టిన విషయాన్నిBNHS ప్రతినిధులు గుర్తించి, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అభయారణ్యం ప్రాంతంలో అక్రమంగా తవ్వకాలు చేపట్టిన నేరానికి అటవీశాఖ సంబంధిత కాంట్రాక్టు సంస్థకు 15 వేల రూపాయల జరిమానా విధించింది.

అయినప్పటికి 2005 నవంబర్‌లో ఆ కాంట్రాక్టు సంస్థ తిరగి తవ్వకాలు ప్రారంభించడంతో ‘సాంక్చ్యురీ ఏసియా’ జర్నల్‌ ఎడిటర్‌ బిట్టో సెహగల్‌ సుప్రీం కోర్టు నెలకొల్పిన సెంట్రల్‌ ఎంపవర్‌ కమిటి సమక్షంలో కేసు దఖాలు చేశారు.  అటవీ పరిరక్షణ చట్టాలకు ఈ తవ్వకాలు విరుద్దమని ఆయన వాదించారు.  కాలువ పూర్తిగా తవ్వితే 50 హెక్టార్ల అవాసం విధ్వంసం అవుతుందని ఆందోళనన వ్యక్తం చేశారు.

చదవండి :  కడప జిల్లాలో 15 చిరుతపులులు...

కలివికోడిని అంతరిస్తున్న జాతిగా ప్రపంచ కన్‌జర్వేషన్‌ యూనియన్‌ గుర్తించి తన ‘రెడ్‌లిస్ట్‌’లో చేర్చిందని, భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972)లోని షెడ్యూల్‌ లోని  అంతరిస్తున్న పక్షుల జాబితాలో  కలివికోడిని చేర్చారనీ, వణ్య ప్రాణి సంరక్షణ కార్యాచరణ ప్రణాళిక (2002 – 2016)లో కూడా  భారత ప్రభుత్వం కలివికోడిని చేర్పించడాన్ని కూడా సేహగల్‌ తన పిటీషన్‌లో ఉటంకించడంతో సి.ఐ.సి. వెంటనే సృందించింది.

కలివికోడికి ఆవాసమైన శ్రీ లంకమల్లేశ్వర, శ్రీ పెనుశిల నరసింహస్వామి వన్యప్రాణి అభయారణ్యాల పరిధిలో తవ్వకాలను నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కలివికోడి ఆవాసానికి ఏర్పడిన ముప్పు పై  ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతిఘటన ఎదురైంది. జాతీయ అంతర్జాతీయ పత్రికలలో, టి.విలు, వెబ్‌సైట్లు కలివికోడికి ఏర్పడిన ముప్పును ముక్త కంఠంతో నిరసించాయి.

దీంతో ప్రభుత్వం కలివికోడి సంచరించేందుకు భూసేకరణ జరపాల్సి వచ్చింది. ఇంత అరుదైన కలివికోడని కాపాడేందుకు, ఆ పక్షుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది.

కలివికోడి, ఎర్ర చందనం స్మారక తపాలా కవర్
2005లో విడుదలైన కలివికోడి, ఎర్ర చందనం స్మారక తపాలా కవర్

ఇదీ చదవండి!

శెట్టిగుంట

కడప జిల్లా ప్రజలు ఎలాంటివారంటే?

కడప జిల్లా ప్రజలు ఎలాంటివారో చెబుతూ ఆయా సందర్భాలలో ఈ ప్రాంతంతో అనుబంధం కలిగిన అధికారులూ, అనధికారులూ వెలిబుచ్చిన కొన్ని …

2 వ్యాఖ్యలు

  1. ఇది ఒక మంచి ప్రయత్నం. నా కడప గురించి ప్రపంచంలోని అందరు నెట్టింట్లో తెలుసుకోగలరు. నిర్వాహకులకు అభినందనలు!

    – భరత్ కుమార్, జంతుశాస్త్ర అధ్యాపకుడు, కడప

  2. లేబాక హరి

    కలివికోడి గురించి మంచి విషయాలు తెల్పినారు… దన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: