రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం కడప జిల్లాలోని చారిత్రక పర్యాటక ప్రదేశమైన గండికోట లో పర్యటించి ఇక్కడి చారిత్రక విశేషాలను తిలకించారు. ఇక్కడికి సమీపంలోని గండికోట నీటిపారుదల ప్రాజెక్ట్ ను సందర్శించేందుకు సోమవారమే జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి నిన్న రాత్రి గండికోటలోని హరిత టూరిజం హోటల్ లో బస చేసారు. మంగళవారం ఉదయమే కోట ను సందర్శించారు. కోటలోని దేవాలయాలను , జుమ్మ మస్జిద్ , ధాన్యాగారం , పెన్నానది గండిని ఆయన తిలకించారు. ఈ సందర్భంగా సి.ఎం . మాట్లాడుతూ గండికోటను ప్రపంచంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అమెరికా చైనా తర్వాత గండికోటలోని grand canyan అద్భుతమైన ప్రదేశమని అయన అభివర్ణించారు. గండికోట కు సరైన రహదారిని నిర్మిస్తామని, పర్యాటకులను ఆకర్షించే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి పర్యటనలో మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి , గండికోట రాజ వంశీకుడు పెమ్మసాని ప్రభాకర్ నాయుడు , జిల్లా కలెక్టర్ కే.వి.రమణ, పర్యాటక అధికారి జి.గోపాల్, ఇతర అధికార, అనధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి , గండికోట రాజ వంశీకుడు పెమ్మసాని ప్రభాకర్ నాయుడు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.పెమ్మసాని రాజవంశీకుల వివరాల గురించి పెమ్మసాని ప్రభాకర్ నాయుడి ద్వారా ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. గండికోట చరిత్రపై తవ్వా ఓబుల్ రెడ్డి రచించిన ‘గండికోట” గ్రంధాన్ని ప్రభాకర్ నాయుడు ముఖ్య మంత్రికి అందచేసారు.
ఇదీ చదవండి!
కడపలో రాజధానితోనే రాయలసీమ సమగ్రాభివృద్ధి
రాయలసీమ ప్రాంతంలో కడప లాంటి నగరంలో రాజధాని నెలకొల్పకుంటే, సమీప భవిష్యత్తులోనే ప్రత్యేక తెలంగాణా తరహా మరో వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి అటు అభివృద్ధి పరంగాను, ఇటు శాంతిభద్రతల పరంగాను ఈ ప్రాంతాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిరక్షించదలచుకుంటే కడప నగరంలో రాజధాని ఏర్పాటు ప్రభుత్వపరంగా ఒక చారిత్రక బాధ్యత.