సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి…
అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి.
సరళమైన మాటలలో ఆధ్యాత్మిక సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించినాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించినాడు. కడప గడపలో నడయాడిన ఆ భాగవతోత్తముడు దేవుని కడప రథోత్సవం వైభవాన్ని ఇలా కీర్తించాడు….
రాగం: సాళంగనాట
కీర్తన : 93, 217వ రేకు
కన్నుల పండుగలాయ గడపరాయని తేరు
మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు ||పల్లవి||
కదలె గదలె నదె గరుడధ్వజునితేరు
పొదిగి దేవదుందుభులు మ్రోయగా
పదివేలు సూర్యబింబము లుదయించినట్లు
పొదలి మెరువు వచ్చి పొడచూపినట్లు ||కన్నుల||
వచ్చె వచ్చె నంతనింత వాసుదేవునితేరు
అచ్చుగ దేవకామిను లాడిపాడగా
ముచ్చటతో గరుడడు ముందట నిలిచినట్టు
మెచ్చుల మెరుగులతో మేఘము వాలినట్టు ||కన్నుల||
తిరిగె దిరిగె నదె దేవదేవోత్తముతేరు
సరుస దేవతలెల్ల జయవెట్టగా
విరివి గడపలో శ్రీ వేంకటేశుడు తేరుపై
నిరవాయ సింహాసన మిదేయన్నట్లు ||కన్నుల||
సంకీర్తన వినడానికి కిందనున్న ప్లే బటన్ నొక్కండి…