ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ నియంతలా వ్యవహరించారని కడప కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. నిబంధనలను పట్టుకొని వాటికనుగుణంగా వ్యవహరించారు తప్పితే తాము చెప్పింది ఎంతమాత్రం వినిపించుకోలేదని, చివరకు రిగ్గింగ్ ఆరోపణలను సైతం పట్టించుకోలేదని ఆయన తన హోదాకు తగినట్లుగా ఆయన వ్యవహరించి ఉండాల్సిందని, ఆయన తీరు సరైంది కాదని దుయ్యబట్టారు.
మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరోపణలకు ఆధారాలు చెప్పమంటున్న భన్వర్లాల్… తాము చెబుతున్నది సరైందో, కాదో తెలుసుకునేందుకు గత ఎన్నికల రికార్డులను పరిశీలించాలన్నారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన వారు ఈ తీరున వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నించారు. జిల్లా రిటర్నింగ్ అధికారి కడప కలెక్టర్పైనా డీఎల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కలెక్టర్ను ఒకప్పటి చెంచాగా ఆయన అభివర్ణించారు. జిల్లాకు భారీ స్థాయిలో కేంద్ర బలగాలను అడిగిన కలెక్టర్, వచ్చినవి చాలా తక్కువ బలగాలు అయినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. తాను ఎవరినీ బదిలీ చేయాలని కోరనని, అయితే ఎన్నికల్లో జరిగిన తప్పులను వారు గుర్తించాలన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.
మీడియాపై దౌర్జన్యం చేయలేదు
తనకు మీడియా పట్ల గౌరవం ఉందని, మీడియాపై దౌర్జన్యం చేశారని కొందరు చేస్తున్న ఆరోపణలు సరికాదన్ని డీఎల్ చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికల్లో తాను, తన కార్యకర్తలు గానీ దాడులకు దిగలేదన్నారు. ‘సాక్షి’ ఎన్నికల్లో తమను నీడలా వెంటాడిందని, రాష్ట్రంలో ఉన్న సాక్షి వాహనాలన్నింటినీ ఉప ఎన్నికల ప్రాంతాల్లోనే మోహరించారని చెప్పారు. విచ్చలవిడిగా సాక్షి వాహనాలకు ఎలా అనుమతి ఇచ్చారని కలెక్టర్ను నిలదీసినా సరైన సమాధానం చెప్పలేదన్నారు. రాజకీయ నేతలపై నియంత్రణ విధించిన ఈసీ.. మీడియాపై నియంత్రణ విధించకుంటే ఎలా అని ప్రశ్నించారు.
జగన్ చెప్పినట్టల్లా కాంగ్రెస్ చేయాలా?
యువనేత జగన్మోహన్రెడ్డిపై తన అక్కసును డీఎల్ మరోసారి వెళ్లగక్కారు. ‘‘నిన్నగాక మొన్న వచ్చిన జగన్ చెప్పినట్టల్లా కాంగ్రెస్ చేయాలా? ఆయన సీఎం పదవి అడిగితే ఇచ్చేయాలా? రాష్ట్ర ప్రభుత్వం ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి లేదు’’ అని అంటూనే దుర్భాషలాడారు. ఓ మంత్రిగా మీరు ఇలాంటి పదజాలం వాడవచ్చా అని ప్రశ్నించిన విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు పత్రికల్లో ఇష్టం వచ్చినట్లుగా రాయొచ్చు కానీ, నేను మాట్లాడితే తప్పా?’ అంటూ తాను వాడిన భాషను సమర్ధించుకున్నారు. అధికారం అడ్డుపెట్టుకొని జగన్ చేసిన అక్రమాలపై నిరంతరం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో తనకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. సీఎం జిల్లాలో పర్యటించేనాటికి కాంగ్రెస్కు మంచి స్పందన ఉందని, అనంతరం ప్రత్యర్థి వర్గం ఎక్కువగా డబ్బులు వెదజల్లడంతో ఇబ్బంది తలెత్తిందని తెలిపారు.
ఫలితాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ మాత్రం ఉప ఎన్నికల్లో తన ప్రభావాన్ని చాటుకుందని, సంప్రదాయిక ఓటు పూర్తిగా కాంగ్రెస్తోనే ఉందని వెల్లడించారు. వైఎస్ బొమ్మ లేకుండా పోటీ చేస్తామని చెప్పి మీరు ఆయన ఫోటో పెట్టుకొనే ఎందుకు ప్రచారం నిర్వహించారని ప్రశ్నించగా… అధిష్టానం ఎవరి ఫోటోలతో ప్రచారం చేయమంటే వారి ఫోటోతోనే పోటీలకు దిగుతామని చెప్పారు.