ప్రొద్దుటూరు: పుట్టపర్తి నారాయణాచార్యుల వారి 25వ వర్థంతి సందర్భంగా మంగళవారం ఉదయం స్థానిక శివాలయం కూడలిలోని ఆయన విగ్రహానికి అభిమానులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పుట్టపర్తి సాహితీపీఠం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎంఈఓ శివప్రసాద్ మాట్లాడుతూ పుట్టపర్తి భావితరాలకు మార్గదర్శి, ఆదర్శప్రాయుడని కొనియాడారు. పుట్టపర్తి వారు కొంతకాలం పాటు ప్రొద్దుటూరు పురపాలక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేయడం ఇక్కడి వాళ్ళ అదృష్టమన్నారు.
వీరపునాయునిపల్లె మండల అభివృద్ది అధికారి మొగిలిచెండు సురేష్ మాట్లాడుతూ… అసాధారణ పాండిత్యం కలిగిన పుట్టపర్తి వారిని భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదుతో గౌరవించిందన్నారు. పుట్టపర్తి వారికి కడపలో ఒక స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సాహితీపీఠం కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ… పుట్టపర్తి వారు రచించిన అగస్తీస్వర సుప్రభాతాన్ని త్వరలో సిడిల రూపంలో వెలువరించనున్నట్లు చెప్పారు. పుట్టపర్తి వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా సాహిత్యం రూపంలో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు.
కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గసభ్యులు బండేరు శ్రీనివాసులు, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ తవ్వా లతో పాటుగా అధిక సంఖ్యలో పుట్టపర్తి అభిమానులు పాల్గొన్నారు.