పోతిరెడ్డిపాడు వివాదం

పోతిరెడ్డి పాడు వివాదం నేర్పుతున్న పాఠం

పోతిరెడ్డిపాడు వివాదం – రాయలసీమకు నికరజలాలు

రాయలసీమ గుండెచప్పుడు మిత్తకంధాల( పోతిరెడ్డిపాడు) నేడు రెండు తెలుగు రాష్ట్రాల మద్య వివాదంగా మారి అంతే త్వరగా పరిష్కారం అయింది. రెండు తెలుగు రాష్ట్రాల మద్య నీటి పంపకాలలో వివాదం వచ్చినపుడల్లా పోతిరెడ్డిపాడును వాడుకుని చివరకు తమ అసలు కోరిక తీరిన వెంటనే అందరూ సర్దుకుంటారు. నిజానికి చుక్క నీరుకూడా వాడుకోని రాయలసీమ వాసుల మీద పుష్కలంగా నీరు వాడుకుంటున్న వారు కూడా విమర్శలు చేయడం సీమ ప్రజల దుస్దితి.

పోతిరెడ్డిపాడు పూర్వరంగం…..

పోతిరెడ్డిపాడు రావడానికి పెద్ద చరిత్రే ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారిగా విడిపోవాలని నాడు సర్కారు జిల్లాల పెద్దల నుంచి ప్రతిపాదన వచ్చింది. అన్ని విదాల అబివృద్ది చెందిన సర్కారు ప్రాంతంతో కలవడానికి ఇష్టపడని సీమను ఒప్పించడానికి చేసుకున్న ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందం. అవగాహన మేరకు సీమకు రాజధానితో సహ నీటి కేటాయింపులో అదిక ప్రాదాన్యత ఇవ్వాలి. అవగాహనకు బిన్నంగా సిద్దేశ్వరం నిర్మాణాన్ని తుంగలో తొక్కి నాగార్జన సాగర్ నిర్మాణం చేసుకున్నారు. శ్రీశైలంను రాయలసీమకు ఉపయోగపడకుండా సిద్దేశ్వరం నుంచి 86 కి మీ క్రింద నిర్మించారు. దాదాపు ఆనాడే ఒక లక్ష మంది ప్రజలను, 100 గ్రామాల కర్నూలు కొంత మేరకు మహబూబ్ నగర్ కు చెందిన వారిని కాలీ చేయించి నిర్మించిన శ్రీశైలంలో రాయలసీమకు, నాటి మహబూబ్ నగర్ కు ఒక చుక్క నీరు కూడా అదికారింగా కేటాయించలేదు.

సర్కారు జిల్లా పెద్దల కుట్ర, సీమ నేతల పదవి వ్యామోహం రాయలసీమ పాలిట శాపంగా మారింది. తర్వాత కాలంలో రాయలసీమ ఉద్యమ పలితంగా సీమకు నీరు ఇవ్వకుండా ఉండలేని స్దితి వచ్చినపుడు నాటి అంజయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీశైలం వెనుకజలాలను ఉపయోగించుకుని యస్ ఆర్ బీ సీ కి నీరు ఇవ్వాలన్న ఆలోచనతో పోతిరెడ్డిపాడు నిర్మాణం ప్రారంబమైనది.

చదవండి :  "కడప దేవుని గడప" అని ఎందుకంటారో ...

శ్రీశైలం నిర్మాణానికి పూర్వం ఆంగ్లేయుల ఆలోచన ప్రకారం సిద్దేశ్వరం దగ్గర ఆనకట్ట నిర్మించి దాని ద్వారా రాయలసీమకు రెండు కాలవల ద్వారా గ్రావిటీతో నీరు ఇవ్వాలి. అన్ని అనుమతులు ఉన్నా నేటికి కూడా దాన్ని నిర్మించడానికి పాలకులకు మనసు రావడం లేదు. అదే జరిగి ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా సీమ బ్యాక్ వాటర్ మీద ఆదారపడి ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. పోతిరెడ్డి పాడు నుంచి 1.5 లక్ష్యల క్యూషెక్కుల నీటిని డ్రా చేసుకునే జీ ఓ ను అప్పటి ముఖ్యమంత్రి రామారావు జారీ చేసినారు. 25 సంవత్సరాలు పూర్తయినా ఆ జీఓ అమలు కావడం లేదు.

2004 లో అధికారంలోకి వచ్చిన వై యస్ అప్పటి వరకు 12 వేల క్యూసెక్కుల ను తీసుకునే విదంగా ఉన్న జీఓ ను మార్చి 44 వేల క్యూసెక్కులుకు పెంచి అందుకు తగిన విదంగా గేట్ల వెడల్పు చేసినారు. కాని నాడు నేటి నీటిపారుదల మంత్రి దేవినేని నాయకత్వంలో పోతిరెడ్డిపాడు వెడల్పు ప్రక్రియను అడుగడుగనా అడ్డుకున్నారు. పోలీసు బలగాల పహారాలో వెడల్పు ప్రక్రియను చేయాల్సివచ్చింది. కీలకమైన విషయం ఏమిటంటే పోతిరెడ్డిపాడు పని చేయాలంటే శ్రీశైలం జలాశయంలో 842 అడుగులలో నీరు ఉండాలి. కాని నిరంతరం అలా నీరు ఉండదు. రెండవది చంద్రబాబు కాలంలో క్రిష్ణా డెల్టా ప్రయోజనాల కోసం అప్పటివరకు 854 అడుగుల కనీస నీటిమట్టం ఉన్నదానిని ఏకంగా 834కి మార్చి (జీవో నెంబర్ 69) రాయలసీమకు మరణశాసనం విధించారు. బాబు నిర్ణయంతో రాయలసీమలోని తెలుగు గంగ, హంద్రీ నీవా, గాలేరు నగరి, యస్ ఆర్ బీ సీ లకు నీరు అందని దుస్దితి వచ్చింది. రామారావు గారు జారీ చేసిన జీఓ అమలు అయిఉంటే వరద వచ్చినపుడు బారీగా నీటిని సీమ ప్రాజెక్టులకు తరలించి ఉండవచ్చు.

చదవండి :  హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? - రెండో భాగం

దాదాపు 12 వేల క్యూసెక్కుల నీటిని ఒక రోజు తోడితే ఒక TMC తో సమానం. అదే 1.5 లక్షల క్యూసెక్యులు ఒకరోజు తోడితే దాదాపు 12 TMC ల నీరు అవుతుంది. శ్రీశైలంకు బారీగా వరదలు వచ్చినపుడు కనీసం వారం రోజులు నిబంధనలతో సంబంధం లేకుండా నీరు డ్రా చేసుకోవచ్చు 1.5 లక్షల నీరు వారం రోజులు తోడితే కనీసం 80- 100 TMC లు నీరు సీమ ప్రాజెక్టులకు అందుతుంది అసాదారణ రోజులలోనైనా సీమకు నీరు దక్కేది. పదవులపై మోజుతో సర్కారు పెద్దలకు పాలేరులు గా మారిన సీమ నేతలు ఆ వైపుగా ఆలోచించడంలేదు. నేడు పోతిరెడ్డిపాడు రాయలసీమ గుండెచప్పుడు. గాలేరు నగరి, తెలుగు గంగ, యస్ ఆర్ బీ సీ లకు నీరు అందాలంటే అందుకు పోతిరెడ్డిపాడు ఒక్కటే ఆదారం. ఒక్క యస్ ఆర్ బీ సీ కి మాత్రమే 19 TMC ల నీటి హక్కు ఉంది మిగిలిన వాటికి చుక్క నీరు కూడా హక్కుగా లేదు. అప్పుడప్పుడు సీమ ఉద్యమకారులను యగతాలి చేస్తూ బాబు మాట్లాడే మాటలు మీకు హక్కులు కావాలా నీరు కావాల అని. కాని నేడు 5 వేల క్యూసెక్కులు నీటిని పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేసినారో లేదో అపుడే తెలంగాణ నుంచి అభ్యంతరం రావడం ఆ వెనువెంటనే రివర్ బోర్డు సమావేశం కావడం క్రిందకు నీటి కేటాయింపు చక చక జరిగిపోయినాయి. కారణం పోతిరెడ్డిపాడు నుంచి నీరు తోడుకునే హక్కు లేదు కాబట్టి. ఇపుడు నిందించాల్సింది రాయలసీమ నేతలు మరియు ఏపి ప్రభుత్వాన్నా లేక తెలంగాణ ప్రభుత్వాన్నా.

చదవండి :  కమలాపురం శాసనసభ్యుడి నిరాహారదీక్ష

సీమ, తెలంగాణ వైరం క్రిష్ణా డెల్టా పాలిట వరం…. గతంలో తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తుంది అన్న పేరుతో వై యస్ జగన్ కర్నూలు కేంద్రంగా ఆందోళన చేసినపుడు సీమ ఉద్యమం తప్పుపట్టింది కారణం పైన ఉన్న తెలంగాణ, రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులకు అదికారిక కేటాయింపులు లేవు. అది పాలకులు చేసిన దుర్మార్గం. పరస్పరం రెండు ప్రాంతాలు ఒకరిపై ఒకరు పిర్యాదులు చేసుకుంటే రాయలసీమ, తెలంగాణలోని ప్రాజెక్టులకు నీరు అందదు. ఇదే డెల్టాప్రాంతం కోరుకునేది. నేటి వివాదం పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వాలని ఏపి సర్కారు ప్రయత్నాన్ని తెలంగాణ, తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతానికి నీరు ఇవ్వడాన్ని ఏపి సర్కారు పరస్పరం పిర్యాదు చేసుకున్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏ ప్రభుత్వం అయిన లోపాలు ఉంటేనే పిర్యాదులు చేసుకుంటాయి.

క్రిష్ణాడెల్టాకు హక్కుతో కూడిన నీటి కేటాయింపు ఉంది కనుక ఎవరూ ఏమీ చేయలేరు. (తెలంగాణ ప్రభుత్వం ఏపి ప్రభుత్వం పై చిన్న పిర్యాదు చేసినా సర్కారు పెద్దలు వెంటనే స్పందిస్తారు. నీటి కేటాయింపుపై తెలంగాణ, సీమ వివాదం జరుగుతుంటే నోరు మెదపలేదు. కారణం పైన ఉన్న తెలంగాణ రాయలసీమలో క్రిష్ణ నీటిని వాడుకోకపోతే అది తమకు లాభం కాబట్టి.) అదే సీమ, తెలంగాణ ప్రాజెక్టులకు సాంకేతికంగా హక్కులేదు కాబట్టి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటారు. కనుక రాయలసీమ ప్రజలు దీన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చూడకుండా ఏపి ప్రభుత్వం రాయలసీమ పట్ల, సీమ ప్రాజెక్టుల పట్ల అనుసరిస్తున్న వివక్షగా గుర్తించి, అందుకు వ్యతిరేకంగా పోరాడాలి.

– ఎం పురుషోత్తం రెడ్డి,

తిరుపతి

ఇదీ చదవండి!

Gandikota

గాలేరు నగరి సుజల స్రవంతి

పథకం పేరు : శ్రీ కృష్ణదేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి సాగునీటి పథకము (ఆం.ప్ర ప్రభుత్వం 2 జులై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: