ప్రొద్దుటూరు మున్సిపాలిటికీ 96 వసంతాలు !

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పురపాలక సంఘాన్ని  ఏర్పాటు చేసి 96 సంవత్సరాలు గడిచాయి. 1915వ సంవత్సరంలో రామేశ్వరం, మోడంపల్లె, నడింపల్లె, బొల్లవరం గ్రామాలను కలిపి ప్రొద్దుటూరు మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు.  2014 సంవత్సరంతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ శత వసంతాలు పూర్తి చేసుకోనుంది. తృతీయ శ్రేణి పురపాలక సంఘం నుంచి ప్రత్యేక స్థాయి మున్సిపాలిటీకి ఎదిగింది . ఐదారు గ్రామ పంచాయితీలను వీలినం చేసి అప్పట్లో ప్రొద్దుటూరు పురపాలక  సంఘాన్ని ఏర్పాటు చేశారు. . ఎందరో  మహానుభావులు ఛైర్మెన్‌లుగా వ్యవహరించి ప్రొద్దుటూరు పురపాలక సంఘాన్ని ప్రగతి పథంలో నడిపించారు.

ప్రొద్దుటూరు పురపాలక సంఘ చరిత్ర!

1915వ సంవత్సరంలో రామేశ్వరం, మోడంపల్లె, నడింపల్లె, బొల్లవరం గ్రామాలను కలిపి బ్రిటిష్‌ పాలకులు ప్రొద్దుటూరు తృతీయ శ్రేణి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. 15వేల జనాభాతో 2.75 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వుండగా కాలక్రమంలో 1956లో ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ స్థాయికి ఎదిగింది. 1980లో ప్రథమ శ్రేణి మున్సిపాలిటీ స్థాయికి చేరుకుంది. ప్రస్తుత మున్సిపాలిటీ 7.12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి వుంది. అన్ని వ్యాపారాలకు ప్రొద్దుటూరు ప్రసిద్ది గాంచడంతో చుట్టూ వున్న ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ జరగడం, అన్ని వసతులు కలిగి వున్న ప్రొద్దుటూరులో ఎక్కువ మంది నివాసం వుండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో జిల్లాలో కడప తర్వాత ప్రొద్దుటూరు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 1920లో 6 రెవిన్యూ వార్డులు మున్సిపాలిటీలో వుండేవి. 1947లో 22 ఎన్నికల వార్డులుగా విభజించారు. 1952లో రెవిన్యూ వార్డులు 6 నుంచి 20కి పెరగడంతో 22గా ఉన్న ఎన్నికల వార్డులు 20కి కుదించబడ్డాయి. తర్వాత జరిగిన పరిణామాలలో రెవిన్యూ వార్డుల సంఖ్య 28కి పెరిగింది. అంతేకాక 36 ఎన్నికల వార్డులు ఏర్పాటయ్యాయి. 2005 నాటి మున్సిపల్‌ ఎన్నికల్లో ఎన్నికల వార్డులు 36 నుంచి 40కి పెరిగాయి. ప్రస్తుతం 40 వార్డులు కొనసాగుతున్నాయి. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు 1935లో మంచినీటి సౌకర్యం కల్పించేందుకు రామేశ్వరంలో మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంచినీటి వ్యవస్థ నేటికీ ప్రజల దాహార్థిని తీరుస్తోంది.

చదవండి :  అన్నమయ్య దర్శించిన ఆలయాలు

వన్‌టౌన్‌ సర్కిల్‌ నుండి గాంధీరోడ్డు మీదుగా అనిబిసెంట్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ పాఠశాల ఆవరణంలోని ప్రధాన ట్యాంకు వరకు ఉన్న పాత పైపులైన్‌ మార్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పేదల సదుపాయాల పథకం క్రింద అధికారులు పెద్ద ఎత్తున అభివృద్ది పెద్దఎత్తున మురికివాడల్లో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు.

1960లో కోనేటికాల్వవీధిలో వెంపల్లి బాలిరెడ్డి స్మారక డిస్పెన్సరీ ఏర్పాటైంది. అలాగే శ్రీరాములపేటలో ప్రసూతి కేంద్రం కూడా మునిసిపాలిటీ ఆధ్వర్యంలో నడుస్తోంది. సేవలకు ఆదాయ వనరులు అవసరం కావడంతో ఆ చర్యల్లో భాగంగా 1963లో శివాలయం వీధిలో 37, 1983లో జమ్మలమడుగు రోడ్డులో 11 కమర్షియల్‌ దుకాణాలను నిర్మించారు. వీటి నుంచి ఏడాదికి 60 లక్షల ఆధాయాన్ని పొందాలని వీటిని నిర్మించారు.

మొదటి  అధ్యక్షులుగా వసంతరావు

1915లో ఏర్పాటైన పురపాలక సంఘానికి మొదటి అధ్యక్షులుగా వసంతరావు 1917లో నియమితులయ్యారు. ఆయన 1939 వరకు సుదీర్గకాలం ఛైర్మెన్‌గా పనిచేశారు. ఆయన చేసిన సేవలకు గానూ ప్రస్తుతం వసంతపేట ఆయన పేరుతో పిలవబడుతోంది. అటు తర్వాత 1939 నుండి 1945 వరకు కొప్పరపు సుబ్బయ్య శ్రేష్టి, 1945 -47 మధ్యకాలంలో ఆనందరావు, 1947 -52 ఎర్రమునిరెడ్డి, జూటూరు వెంకటసుబ్బయ్య శ్రేష్ఠి, 1952 -56 వరకు మల్ళీ పాణ్యం ఎర్రమునిరెడ్డి, 1959-64 వరకు సోమిశెట్టి చిన్నసుబ్బరాయుడు, 1967-72 మధ్యకాలంలోతిరిగి పాణ్యం ఎర్రమునిరెడ్డి, పురపాలక సంఘం ఛైర్మెన్‌గా సేవలందించారు. 1972 -81లో ప్రత్యేక అధికారుల నేతృత్వంలో పరిపాలన సాగింది. 1981 లో ఐ.సుబ్బారెజ్జి ఛైర్మెన్‌ గా ఎన్నికయ్యారు. ఆయన 83 వరకు మాత్రమే పనిచేశారు. 1983-85 వరకు నరాల బాలిరెడ్డి ఛైర్మెన్‌లుగా పనిచేశారు. 1986-87 మధ్య కాలంలో ఐఎఎస్‌ రామానంద్‌ ప్రత్యేక అధికారిగా ఉన్నారు. 1987-90 వరకు చెన్నా వెంక టసుబ్బయ్య, 1990-91 దొంతు భాగ్య లక్షుమ్మ, 1991-92లో ఆర్‌ వెంకటసుబ్బయ్య పరిపాలన నిర్వహించారు. అటు తర్వాత మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. 1992-93 వరకు ఐఎఎస్‌ అధికారి ఉమామహేశ్వర్‌రావు, 1993-94 వరకు బి.ఆర్‌.మీనా, అటు తర్వాత కొద్ది రోజులు వెంకట రమణాచారి ప్రత్యేకాధికారులుగా వున్నారు. 1–6-1994 నుండి 24-03-1995 వరకు బి.ఆర్‌.మీనా, 24-03-1995 నుండి 29-03-1995 వరకు సుబ్రమణ్యంలు ప్రత్యేకాధికారులుగా వున్నారు. తర్వాత జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో కామిశెట్టి సుబ్బారావు ఛైర్మెన్‌గా ఎన్నికయ్యారు. 1995 నుండి 2000వరకు పనిచేశారు. 2005లో ఏర్పడ్డ నూతన కౌన్సిల్‌లో రెండు సంవత్సరాలు ఇఱగం మల్లిశ్వరీ, మరో మూడు సంవత్సరాలు వి.యస్‌ ముక్తియార్ ‌లు పాలన చేపట్టారు.

చదవండి :  కడపజిల్లా పోలింగ్ విశేషాలు

డాక్టర్ వై.ఎస్. చొరవ అభివృద్ధి పథంలో..

2004లో జిల్లా వాసి డాక్టర్ వై.ఎస్.  రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో నిధులను భారీ స్థాయిలో కేటాయించి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. వైఎస్సార్‌ ఆశయాలలో ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఎంతో అభివృద్ది సాధించింది. ఇందులో భాగంగా కొన్ని పనులను పూర్తి చేసుపకోగలిగినా మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని పనుల్లో రాజకీయ జోక్యంతో మరుగున పడ్డాయి. 2005లో ఏర్పడ్డ నూతన కౌన్సిల్‌లో రెండు సంవత్సరాలు ఇఱగం మల్లిశ్వరీ, మరో మూడు సంవత్సరాలు వి.యస్‌ ముక్తియార్ ‌లు పాలన చేపట్టారు. వీరి హయాంలో ప్రొద్దుటూరు ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పన విషయంలో గట్టి ప్రయత్నమే జరిగింది. రాష్ట్రంలోనే వాణిజ్య కేంద్రంగా ప్రొద్దుటూరుకు ప్రముఖ స్థానం వుంది. ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పురపాలక సంఘం అభివృద్ది పథంలో విజయాన్ని సాధించింది.

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ని పీడిస్తున్న సమస్యలు ఎన్నో..!

కొర్రపాడు రోడ్డులోని మున్సిపల్‌ కాంప్లెక్సులు నిరుపయోగంగా తయారయ్యాయి. 2005కు ముందు ట్రావెల్స్‌ బంగ్లాను కూలగొట్టి అక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను గుడ్‌విల్‌ పద్దతిలో నిర్మించాలని అప్పటి మున్సిపల్‌ శాఖామంత్రి ఫరూక్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. కానీ అవి ఇప్పటి దాకా పూర్తి కాలేదు. పెరుగుతున్న పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా పద్దతి ప్రకారం ఉండే షాపింగ్‌ కాంప్లెక్సులు ప్రొద్దుటూరు పట్టణంలో తక్కువగానే వున్నాయి. డి ఎఫ్‌ఐడి నిధులలో కోట్ల రూపాయల అభివృద్ది పనులు గత రెండు కౌన్సిలులు చేపట్టాయి.

చదవండి :  మల్లెమాల పురస్కారం అందుకున్న నరేంద్ర

అలాగే ప్రభుత్వం ఇందిరమ్మ వార్డులను గుర్తించి తర్వాత కూడా మౌళిక సదుపాయాల కల్పన విషయంలో తీవ్రంగా కృషి చేశారు. సిమెంట్‌ రోడ్లు, వీధి దీపాలు, మురికి కాలువలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. మున్సిపల్‌ సాధారణ నిధులతో పాటుగా ప్రత్యేక నిధులతో ప్రొద్దుటూరులో సదుపాయాల కల్పన జరిగింది. పాత పైపులైన్ల స్థానంలో కొత్త పైపు లైన్లను పట్టణ శివార్ల వరకు ఏర్పాటు చేశారు. నీటి సరఫరాకు అనుగుణంగా పైపులైన్ల ఏర్పాటుతో అయితే కొన్ని సాంకేతిక కారణాల కారణంగా వీటన్నింటినీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేలేక పోతున్నారు. అలాగే గడిచిన మూడు నాలుగేళ్లలో మంచినీటి సమస్య తలెత్తింది. భూగర్బ జలాలు అడుగంటి పోవడం, బోర్లు ఎండిపోవడంతో నీటి కటకటలు ఏర్పడ్డాయి. దీన్ని అధిగమించడానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా మైలవరం నుంచి అర టిఎంసి నీటిని కేటాయించుకుని ప్రజల దాహార్థిని తీర్చారు. స్థానిక పాలక మండలి, ప్రభుత్లం సహకరించడంతో కొత్తగా నీటి వసతిని ఏర్పాటు చేసుకోగలిగారు. భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తితే ఈ పద్దతిలో నీటిని మైలవరం రిజర్వాయర్‌ నుండి ప్రొద్దుటూరుకు తెచ్చుకొనే వీలు ఏర్పడింది. అంతేగాక భారీ ప్రాజెక్టు తరహాలో కుందూ-పెన్నా నదుల అనుసంధానం కార్యక్రమం కూడా మొదలై కొన్ని సాంకేతిక, రాజకీయ కారణాలతో ఆగిపోయింది. శాశ్వతంగా పట్టణ ప్రజల దాహార్థిని తీర్చేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడనుంది. భారీ ప్రాజెక్టుల పరిదిలోకి వచ్చే ఈ ప్రాజెక్టు బాలారిష్టాలను తొలగించుకొని ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడే చెప్పలేము. పనులు వేగవంతంగా పూర్తయితే రెండేళ్ళలో కుందూ నీటిని ప్రొద్దుటూరు ప్రజలు తాగే వీలు కలుగుతుంది.

1915లో కేవలం 15వేల జనాభాతో తృతీయ శ్రేణి పురపాలక సంఘంగా ప్రారంభమై ప్రస్తుతం 1.50 లక్షల జనాభా కలిగివున్న ప్రొద్దుటూరు భవిష్యత్తులో కార్పోరేషన్‌ స్థాయి హోదా కూడా దక్కే అవకాశాలున్నాయి.

 

ఇదీ చదవండి!

బాబురావు నాయుడు

కడప జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్న బాబురావు నాయుడు

కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన బాబురావు నాయుడు బదిలీపై వెళుతున్న కలెక్టర్ సత్యనారాయణ నుంచి శుక్రవారం బాధ్యతలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: