ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలో అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు శుక్రవారం హైదరాబాదులో తెలిపారు. ఆ రోజు స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. 11వ శతాబ్దంలోనే ఈ దేవాలయం నిర్మించినట్లు ఆధారాలున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
కోదండరామాలయాన్నిపరిశీలించిన ప్రిన్పిపల్ సెక్రటరీ
స్థానిక కోదండరామాలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్పిపల్ కార్యదర్శి ఏవీఎస్ ప్రసాద్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ కేవీ రమణలతో కలిసి శుక్రవారం పరిశీలించారు.
వీరు ముందుగా కోదండరామున్ని దర్శించుకున్నారు. వీరి రాక సందర్భంగా పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కోదండరామాలయ పరిసర ప్రాంతాలను, నూతనంగా ఏర్పాటు చేసిన భవనాలను, ఆలయసమీపంలోని హరితా రెస్టారెంట్ను, కోదండరామాలయ భూములను, రామలక్ష్మణ తీర్థాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రాచీన ఆలయమైన ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఎలాంటి నూతన కట్టడాలకు తావులేదన్నారు. ఆలయ స్థితిని యధావిధిగానే కొనసాగించాలన్నారు. దేవాలయంలో ఒక పద్ధతి ప్రకారం పూజలు నిర్వహించాలని సూచించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో కట్టే కట్టడాలను ఎక్కడికక్కడ ఆపాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ద్వారా ఒంటిమిట్ట కోదండరామాలయం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆలయంలో పాడుబడ్డ శిల్పాలను మద్రాసులోని ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలచే మరమ్మతులు చేయిస్తామన్నారు. భావి తరాలు పురాతన ఆలయాల చరిత్ర తెలుసుకునే విధంగా ఆలయాలను యధాస్థితిలో కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఘనంగా బ్రహ్మోత్సవాలు
నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్లో జరిగే బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందు కోసం ఘనంగా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారులు, ప్రజలతో ఆయన చర్చించారు.
పర్యాటకరంగంపై ప్రత్యేక దృష్టి
కోదండరామాలయానికి వచ్చే యాత్రికులకు ప్రత్యేక వసతి కల్పించడం ద్వారా, కోదండరామాలయానికి ఆనుకుని ఉన్న ఒంటిమిట్ట చెరువుకు నీరు తెప్పించడం వలన ఒంటిమిట్టలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఒంటిమిట్టతో పాటు జిల్లాను మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్, వీఐపీలకు ఏర్పాట్లు, భక్తుల ఏర్పాట్లపై చర్చించారు. వీటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. స్థానిక ప్రజలు, భక్తులసహకారంతో అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు.