కడప : నగర శివారులోని మామిళ్లపల్లి దగ్గర ఏర్పాటు చేసిన నగరవనం సుందరంగా ముస్తాబై జిల్లావాసులకు ఆహ్లాదాన్ని పంచడానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కడప నగరానికి కూతవేటు దుపంలో మామిళ్లపల్లి వద్ద 428 హెక్టార్లలో రూ.342.78 లక్షల వ్యయంతో నగరవనాన్ని తయారు చేసింది. త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి రానున్న కడప నగరవనం విశేషాలు..
ప్రజలకు స్వచ్ఛమైన గాలితో పాటు ఆహ్లాదాన్ని అందించడానికి పాలకొండ రిజర్వు ఫారెస్టు పరిధిలోని మామిళ్లపల్లి ప్రాంతాన్ని నగరవన ఏర్పాటు కోసం అటవీశాఖ ఎంచుకుంది. పచ్చదనం విశిష్టతను తెలియజెప్పడంతో పాటు చెట్ల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయడానికి ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర అటవీశాఖ ఆదేశాల మేరకు కడప అటవీశాఖ అధికారి నేతృత్వంలోని సిబ్బంది కడప నగరవనాన్ని ఆహ్లాదకరంగా ఉండే రీతిలో తీర్చిదిద్దారు. ఈ నగరవనంలో వన్య ప్రాణులు వల్ల ఉపయోగాలు, వాటి సంరక్షణ గురించి ప్రత్యేక సెంటర్ను ఏర్పాటు చేశారు. అదేవిధ:గా నక్షత్రవనం, రాశివనం, నవగ్రహవనం, వినాయక పత్రి వనాలను తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చే చిన్నారుల కోసం ప్రత్యేకంగా చిల్డ్రన్స్ పార్కును కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు వాచ్టవర్, యోగా సెంటర్, సైక్లింగ్, వాకింగ్ పాత్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా నీటి నిల్వకోసం నీటి కుంటలను కూడా తవ్వారు.
ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి పాలకొండ రిజర్వు ఫారెస్టులో లభించే అరుదైన మొక్కలను కూడా ఇక్కడ పెంచడంతో పాటు సందర్శకులకు అందుబాటులో ఉంచారు. అడవులలో లభించే ఔషధ మొక్కలు, వాటి విశిష్టతను వివరించడానికి ఈ నగర వనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఔషధ మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రజలు కూడా వాటని విరివిగా పెంచే విధంగా అటవీశాఖ అధికారులు మొక్కలను కూడా సరఫరా చేయడానికి నిర్ణయించుకున్నారు. ఖాళీ ప్రదేశాల్లో విత్తనాల చెల్లడమే కాకుండా అక్కడక్కడ సీడ్ బాల్స్ను కూడా చల్లడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ నగర వనంలో ప్రత్యేకంగా కలువపువ్వు, తామరపువ్వు, వనాలను కనులవిందుగా తీర్చిదిద్దారు. శేషాచలం అడవులలో అరుదుగా లభించే మొక్కలను నగర వననాలలో పెంచడంతో పాటు రహదారుల పక్కన వాటిని పెంచడానికి కూడా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కడప చుట్టుపక్కల ప్రాంతాల వాసులు ఎప్పుడూ ఈ ప్రాంతానికి వచ్చినా నగర వనాన్ని ఒక్క సారైనా చూడాలనే విధంగా మామిళ్ళ పల్లె నగరవనాన్ని తీర్చిదిద్దుతామని కడప అటవీశాఖ అధికారులు తెలిపారు.