పులివెందుల ఉప ఎన్నికలలో పరాజయం పాలైన వివేకానందరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవికి రాజనామా చేసిన అనంతరం తనకు పదవి ముఖ్యంకాదని, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాతనే పదవి చేపడతానని, తన సేవలు అవసరం అనుకుంటే ప్రజలు గెలుపించుకుంటారని వివేకా ప్రకటించిన సంగతి తెలిసిందే.
తన అన్న అడుగుజాడల్లో నడుస్తానని, ఆయన ఆశయసాధనకు కట్టుబడి ఉంటానని, నియోజకవర్గంలో అర్ధంతరంగా నిలిచిన అభివృద్ధి పనులను భుజాలపై వేసుకుని వైఎస్ కలల సాకారం చేస్తానని చెప్పినా, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వివేకానందరెడ్డికి కేవలం 28,725 ఓట్లే వచ్చాయి.
వివేకా భారీ ఓట్ల తేడాతో ఓటమిపాలైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నరు కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసి, మంత్రి పదవిని ఇస్తారని ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి కూడా ఇదే విషయం వివేకాకు చెప్పారని సమాచారం.
పులివెందుల ఓటమిని సాకుగా చూపి వివేకాను క్యాబినెట్ లోకి తీసుకోని పక్షంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. పులివెందులలో కాంగ్రెస్కు బలమైన నాయకుడు కూడా వివేకానే.
ఉప ఎన్నికల్లో పరాజయం అనంతరం వివేకానందరెడ్డి తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందన్న అంశంపై జిల్లా వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రిపదవితో పులివెందుల అభివృద్ధికి కంకణబద్ధుడవుతారని ఆయన వర్గీయులు గట్టిగా చెబుతున్నారు.
మరికొందరైతే కాంగ్రెస్ను వీడి తిరిగి అబ్బాయితో చేయి కలుపుతారని భావిస్తున్నారు. బాబాయి రాకను జగన్ ఇప్పటికీ స్వాగతిస్తున్నారు. ఇదే విషయాన్ని జగన్ కుటుంబ సభ్యులకు చెప్పినట్టు సమాచారం.
కడప ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత బాబాయ్ ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని, కాంగ్రెస్ వారి మాయమాటలను నమ్మకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తన చిన్నాన్న వివేకాకు సూచించారు. అయితే దీనిపై మంగళవారం వివేకా హైదరాబాద్లో మాట్లాడుతూ … నన్ను వాళ్ల పార్టీలోకి కాకుండా జగనే కాంగ్రెస్లోకి వస్తే స్వాగతిస్తానని చెప్పారు. అంతేకాకుండా వైఎస్సార్ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తేనని ఆయన మరో సారి స్పష్టం చేశారు.
అంటే బాబాయ్- అబ్బాయ్లు ఎవరు ఎటు వైపు వెళ్తారో మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు వేచిచూడాల్సిందే!