కడప: చివరి దశలో ఉన్న రాయలసీమ సాగునీటి పథకాలు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించి ఆయా పథకాలను త్వరగా పూర్తి చేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత రామచంద్రయ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన వినతిపత్రాన్ని రామచంద్రయ్య చంద్రబాబుకు పంపినారు.
రాయలసీమ ఉద్యమం నేపధ్యంలో నాటి తెదేపా ప్రభుత్వం గాలేరు-నగరి, హంద్రీ-నీవా, సుజలస్రవంతి పథకాలు ఏర్పాటు ప్రకటించినా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కమిటీలు,సర్వేల పేరుతో కాలం గడిపారుతప్ప రాయలసీమ సాగునీటి పై తగిన శ్రద్దచూపక ప్రజలపై ఆశలు చల్లారన్నారు.
2004లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులపై అత్యంత ప్రాధాన్యతపై పనులు ప్రారంభించడమేగాకుండా మొదటి దశ పనులు 80శాతం పనులు పూర్తి చేసిందన్నారు.
2010 నుంచి ప్రాధాన్యత లేక ప్రాజెక్టుల ప్రగతి నత్తనడకన నడుస్తోందని, మొదటిదశ కింద సాగునీరు అందించాలన్న లక్ష్యానికి గండిపడింది. హంద్రీ-నీవా ప్రాజెక్టు నుంచి 4వేల క్యూసెక్కులకుగాను కనీసం 1300 క్యూసెక్కుల నీటిని కూడా వాడుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
గాలేరు-నగరి మొదటి దశలో 95శాతం పనులు పూర్తి చేయగలిగినా కర్నూలు జిల్లాలోని బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి అవుకు రిజర్వాయర్కు నీటిని తీసుకొచ్చే ప్రధాన కాలువ పనులు 30శాతం అసంపూర్థిగా ఉండటం వల్ల అవుకు రిజర్వాయర్ నుంచి గండికోటకు పూర్తి సామర్థ్యంతో నీటిని తీసుకొచ్చే పరిస్థితి లేదన్నారు.
‘ఎస్ఆర్బిసి కాలువల ద్వారా అవుకు రిజర్వాయర్కు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలోని గండికోట, వామికొండ సర్వారాయసాగర్లలో మిగిలిన 5శాతం పనులు పూర్తి చేయగలిగితే ఆ ప్రాంతానికి సాగునీరు అందించే అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు.