తెలుగు సినిమాకు ప్రపంచ ఖ్యాతి తీసుకురావడమే కాకుండా ఎన్టీఆర్ ,ఏయన్నార్ లాంటి సినీ నటులను ఆదరించి విజయా సంస్థ ద్వారా అవకాశాలు కల్పించి దారి చూపిన న బి.ఎన్. రెడ్డి, బి.నాగిరెడ్డి లాంటి మహనీయులు రాయలసీమలో పుట్టారు. కరువు ప్రాంతమైన కడప జిల్లాకు వన్నె తెచ్చారు. వారు సినీ నిర్మాణ రంగంలో విజయం సాధించారు. “చందమామ” లాంటి బాలల పత్రికను దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో ప్రచురించి సాహిత్య సేవ కూడా చేసారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను బి.ఎన్.రెడ్డి, బి.నాగి రెడ్డి సోదరులు సాధించారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో, తెలుగు సినిమాచరిత్రలో ఇద్దరు సోదరులు వేరు వేరుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను అందుకోవడం అరుదైన, అపూర్వమైన విషయం. వీరు సాధించిన విజయాల పట్ల రాయలసీమ గర్వ పడుతూనే ఉంటుంది. తెలుగు వారంతా వారిని ఎప్పుడూ స్మరించు కుంటూనే ఉంటారు.ఇక కే.వి.రెడ్డి, హెచ్.ఎం.రెడ్డి లాంటి పూర్వీకులు పద్మనాభం, శాంతకుమారి,చిత్తూరు నాగయ్య, టిజి కమలాదేవి ఆ తర్వాత నటుడు మోహన్ బాబుల విజయాలు కూడా చెప్పుకోతగ్గవే. ఇది నాణేనికి ఒకవైపు చరిత్ర.
అయితే సినిమాలు తీయాలని నలభై, యాభై ఏళ్ల కిందట మద్రాసు బాట పట్టి అప్పట్లోనే లక్షలాది రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకుని వట్టి చేతులతో తిరిగొచ్చిన మరికొందరు రాయలసీమ వాసులు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ తో విజయవంతమైన సినిమా తీసిన “లవకుశ” నిర్మాత శంకరరెడ్డి ఆ తర్వాత అదే ఎన్టీఆర్ తో “సతీసావిత్రి “ సినిమా తీసి చేతులు కాల్చుకుని తెరమరుగై పోయారు.
***********************
అలాగే కడప జిల్లా ఆలంఖాన్ పల్లెకు చెందినా సోషలిస్ట్ నాయకుడు ఎం.వెంకటసుబ్బారెడ్డి 1970 లో ‘యమలోకపు గూడచారి” అనే సిమాను ప్రముఖ నటీనటులైన జగ్గయ్య, కృష్ణకుమారి , రేలంగి, సూర్యకాంతం, చాయాదేవి, అల్లురామలింగయ్య , నాగభూషణం, హరనాథ్, జ్యోతిలక్ష్మి, విజయలలితలతో , రచయితలైన డాక్టర్ సి.నారాయణ రెడ్డి, ఆరుద్ర, దాశరథి, రాజశ్రీ లాంటి వారితో శివారెడ్డి సంగీత దర్శకుడిగా , శ్రీనివాస్ దర్శకుడిగా సినిమా తీసారు. భారీగానే డబ్బులు ఖర్చు చేసారు. సినిమా బాగానే తీసినా తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వెంకట సుబ్బారెడ్డి మరో సినిమా తీసే సాహసం చేయలేదు.
*************************
నటుడిగా లెక్కల వెంకటరెడ్డి
**************************
యమలోక గూడచారి లో పలువురు రాయలసీమ ప్రాంతపు ఔత్సాహికులు నటులుగా పరిచయం అయ్యారు. మైదుకూరు మండలం లెక్కలవారి పల్లెకు చెందిన కవి, సోషలిస్ట్ అభియాన్ కన్వీనర్ గా ఇప్పుడు ఉంటున్న లెక్కల వెంకటరెడ్డి ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో రెండు సార్లు కనిపించారు. జగ్గయ్య-కృష్ణకుమారి పెళ్లి సన్నివేశంలో రేలంగి, చాయాదేవి లతో కలిసి లెక్కల వెంకట రెడ్డి నటించారు. పెళ్ళికూతుర్ని ఉద్దేశించి “ అమ్మాయి అదృష్టవంతురాలు “ అంటూ అక్షింతలు వేస్తారు. ఆ సినిమా తర్వాత , రైతుగా, కవిగా గ్రామంలో ఉంటూ రైతునాయకుడిగా ఉద్యమాలకు పరిమితమయ్యారు.
కరువు పరిస్థితులు, ఆర్ధిక స్థితులు సహకరించకున్నా రాయలసీమ వాసుల్లో రసజ్ఞత కు కోరతలేదనడానికి సినిమారంగంలో కూడా అనేక తార్కాణాలు మనకు కనిపిస్తాయి. ఈ సందర్భంగా ప్రముఖ కవి నండూరి రామకృష్ణమాచార్య చెప్పిన పద్యం ఈ సందర్భంలో మనకు గుర్తు రాక మానదు.
***************************
“క్షామము దాపురించి పలుమారులు చచ్చెను జంతుసంతతుల్
వేమురు జచ్చినారు ప్రజలు వేనకువేలు చరిత్ర లోపలన్
క్షామము లెన్ని వచ్చినా రసజ్ఞత మాత్రము చావలేదు జ్ఞా
నామృత పుష్టికిన్ కొరత నందని రాయలసీమ లోపలన్*