ఇటీవల తిరుపతి నగరంలో భూమన్ అధ్యక్షతన ‘రాయలసీమ సమాలోచన’ సదస్సు జరిగింది. ఆ సదస్సుకు ‘రాయలసీమ విమోచన సమితి’ వ్యవస్థాపకులు డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి గారు పంపిన సందేశం:
డియర్ భూమన్,
సభలో చదివేందుకు సందేశం పంపమన్నావు . గుండె కోతను వెల్లి బోసుకోవడం తప్ప, నా దగ్గర సందేశాలు ఏమున్నాయని? గమ్యం చేర్చే రైలు ప్లాట్ ఫారం దాటి పోయిన తరువాత గోడున ఏడిస్తే తిరిగొచ్చేది కాదు. రేపో మాపో అలాంటి రైలు కోసం కాచుకోను౦డక రాయలసీమకు చేయగలిగి౦దేమి లేదు. సమయానికి స్టేషన్ చేరుకోకుండా మనసును ఏయే నిర్లక్ష్యాలు అడ్డుకోన్నాయో ఈ వ్యవధిలో వాటిని సమీక్షి౦చుకొని సరిదిద్దుకొ౦టే మరో సారి రైలేక్కే అవకాశ౦ దొరుకుతుంది.
మనం దిక్కులేనివాల్లమని రాష్ట్ర విభజన తరువాత గానీ రాయలసీమకు తెలిసి రాలేదు. తెలిసి ఇప్పుడు చేయగలిగిందీ లేదు. ఎ౦దుక౦టె, గోర౦త ప్రయోజనం లేని సమైక్య ఉద్యమ౦ మన సత్తనంతా పీల్చేసింది. లేచే౦దుకు నడుముల్లో బిస లేదు. జరుగుతున్న దగా ను చూస్తూ ఊరుకొనే ఓపిక లేదు. సుస్థి నుండి తేరుకొనే౦దుకు టానిక్కుల కొస౦ తారాడే దీనావస్థ రాయలసీమది.
సంపాదన మీద మోజు, పదవిమీద ఆశ రాష్ట్రం లోని రాజకీయ నాయకులు అ౦దరి లొనూ కనిపించినా, వాటి కోసం తల్లిని తాకట్టుగా పెట్టె అల్పులు నాయకులుగా ఉండేది రాయలసీమలో మాత్రమే . ఓటైనా సరే నోటైనా సరే కంటి ముందు రెపరెప లాడే దాక వాళ్ళొచ్చి ఆదుకుంటారని ఆసి౦చలే౦. ఒకవేళ వొచ్చినా, అందరికోసం వచ్చాడని ప్రజలను నమ్మి౦చనూ లేము. కానీ వాళ్ళు పాల్గొనే సభ పత్రికలవారి కంటికి గడ్డిపోచ.
ఏలాలనుకోనేవాడు విశాలమైన సామ్రాజ్యం కోరుకొంటాడే తప్ప, ముక్కతో సరిపెట్టుకోలేడు. అ౦దువల్ల , ఓటర్ల మెజారిటీ ఉన్న కోస్తా జిల్లాలను కాదని, రాయలసీమను భుజానికి ఎత్తుకొనె౦దుకు రాజకీయ పార్టీల్లో ఏ వొక్కటి సమ్మతించదు. ఉట్టికి స్వర్గానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ కి కూడా ఆస౦తా రొట్టె మీదే కానీ తునక మీద లేదు. ఈ కీకారణ్యంలో నిజయతీ పరులైన మేధావులు కొందరు రాయలసీమ కోసం పరితపించడం ఇటీవల స్పష్టంగా తెలుస్తూంది. కానీ, వాళ్ళు ప్రజలకు కొత్త. వాళ్లకు ప్రజలు కొత్త. గుర్తింపు రావాలంటే సమాచార రంగం సహకరించాలి. మీడియా మొత్తం కోస్తా గుప్పిట్లో ఇరుక్కున్నందున, ఆ రంగం నుండి మనకు దొరికేది సహకారం కాదు.. ఈసడి౦పు.
ఈ పరిస్థితుల్లో అంకిత భావం కలిగిన ప్రయత్నాలు ఏటికి ఎదురీడడ౦తో సమానమైనవి. అయినా, విరమించకుండా చేసే ప్రయత్నాలకు ఎదోవొకనాడు తప్పకుండ ఫలితం దొరుకుంతుంది. ఆ ప్రయత్నం లోని నిజాయతిని యువతరానికి ఆదర్శంగా నిలుపగిలిగితే, ఆ తరమే ఉద్యమౌతుంది….
ఇట్లు
డాక్టర్ ఎ౦.వి.రమణారెడ్డి
14-8-2015