కడప: కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నవంబరు 30లోగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 23-07-2014 తేదీన కేంద్ర ఉక్కు, గనులశాఖమంత్రి తోమార్కు లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన కేంద్రమంత్రి 21-08-2014న ప్రతి లేఖ రాస్తూ, నవంబర్ 30లోగా సెయిల్ తన నివేదికను సమర్పిస్తుందని తెలియచేశారు.
ఇవాళ డిసెంబర్ 20. అంటే బిల్లులో పేర్కొన్న ఆరు నెలల గడువు ముగిసి ఇప్పటికి ఇరవై రోజులైంది. ఇంతవరకూ సెయిల్ నివేదిక గురించి అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటీ ప్రకటనా చేయలేదు. ఇంకా సెయిల్ నివేదిక సమర్పించిందా లేదా అన్నది ప్రభుత్వాలు వెల్లడించడం లేదు.
ఇదే విషయమై ఉక్కు మంత్రిత్వ శాఖను సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరితే ఇది సెయిల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి వారినే సంప్రదించాలని సమాదానమిచ్చింది. కానీ 21-08-2014న ముఖ్యమంత్రి గారికి రాసిన రాసిన లేఖలో ఉక్కుశాఖామాత్యులు నవంబరు 30లోగా సెయిల్ నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. అంటే సెయిల్ ఒక సంస్థ మాత్రమే. నివేదికను తయారు చెయ్యమని ఆదేశించిందీ యజమాని అయిన ప్రభుత్వం, ఆ ఆదేశాలను అమలు చేస్తున్నది సెయిల్. యజమాని తయారు చెయ్యమని అడిగిన నివేదికను సెయిల్ యజమాని అనుమతి లేకుండా బయటి వ్యక్తులకు ఎలా ఇస్తుంది? అంతేకాకుండా సెయిల్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవలసినదీ, అందుకు సంబంధించిన అనుమతులు ఇవ్వవలసినదీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఉక్కు శాఖే.
ఈ విషయం తెలిసీ కూడా ఉక్కు మంత్రిత్వ శాఖ నివేదిక, ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన పురోగతి గురించి తెలుసుకోవటానికి సెయిల్ ను అడగమని ఎలా చెపుతోందో అర్థం కాదు.
నివేదిక నకలు ప్రతిని ఇవ్వమని సెయిల్ వారిని సమాచార హక్కు చట్టం కింద కోరితే వారి సమాధానం ఇలా ఉంది…
You have sought the information which is of commercial confidence in nature, which falls under section 8(1)(d) of the RTI Act 2005 and hence cannot be provided.
అం.ప్ర విభజన చట్టంలో భాగంగా ఉన్న ఒక అంశం, అందుకు సంబంధించి ఒక ప్రభుత్వ రంగ సంస్థ దాని అధిపతి అయిన ప్రభుత్వానికి సమర్పించిన లేదా సమర్పించబోయే నివేదిక (అదీ కర్మాగారం ఏర్పాటు సాధ్యాసాధ్యాల పైన) వ్యాపార గోప్యత పరిధిలోకి ఎలా వస్తుందో అర్థం కాదు. ఇక్కడ ఏవైనా పరిశ్రమలు పోటీలో ఉన్నాయా? లేక ఈ సమాచారాన్ని వెల్లడించడం సెయిల్ యొక్క వ్యాపార ప్రయోజనాలను దెబ్బ తీస్తుందా?
కనీసం మన జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులైనా ఈ విషయమై (ఉక్కు కర్మాగార ఏర్పాటు పురోగతి) వచ్చే చట్టసభ సమావేశాలలో ప్రశ్నలు అడగవలసిన అవసరం ఉంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో నాటి యూపీఏ కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. అపాయింటెడ్ డే (జూన్ 2 నుంచి) ఆరు నెలల లోపు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని సెయిల్కు సూచించింది.