కడుపాత్రం

కడుపాత్రం (కథ) – తవ్వా ఓబుల్‌రెడ్డి

”కేబుల్‌టీవీలు, గ్రాఫిక్‌సినిమాలతో హోరెత్తిపోతున్న ఈ కాలంలో ఇంకా బొమ్మలాటలు ఎవరు జూచ్చారు? మీకు ఎర్రిగాని… ఊళ్ళోకి వచ్చినందుకు అంతో ఇంతో లెక్క అడుక్కోని దోవ బట్టుకోని పోర్రి… ఎందుకింత సెమ!”

నిన్నరాత్రి పొరుగూర్లో గ్రామపెద్దలు అన్నమాటలు, రోడ్డు గతుకుల్లా బండిలోని వెంకటరావును కుదిపివేస్తున్నాయి. ఆ రాత్రికి ఆ వూర్లోనే గడిపి, ఆటాడకుండా తెల్లవారుజామున్నే బృందాన్ని తట్టిలేపి, బండ్లు కట్టించి, చక్రాలపల్లెకు దారిపట్టించినాడు వెంకటరావు.

చక్రాలపల్లె సమీపిస్తున్నకొద్దీ వెంకటరావులో తల్లి ఒడిలోకి చేరుకుంటున్న ఆనందం చోటు చేసుకోసాగింది. ఎనిమిదేళ్ళ తర్వాత తిరిగి ఆ వూరికి రావడం; రెండు బండ్లలోని బృందానికి కూడా సంతోషం కలిగించింది. బొమ్మలాటలు ఆడుతూ దేశాటనం చేయడం అనేది వెంకటరావు బృందానికి వంశపారంపర్యంగా సంక్రమించిన వృత్తి. ఆటలో విగ్రహాలను కదం తొక్కించి వీక్షకులను ఉర్రూతలూగించడం వెంకటరావుకు వెన్నతోపెట్టిన విద్య. దేశాటనంలో అన్ని మజిలీలూ ఒక ఎత్తు… చక్రాలపల్లెలో సేదతీరిన జ్ఞాపకాలు మరొక ఎత్తు! ఊరి చింతవనంలో తాము దిగిన సమాచారం అందిన వెంటనే రామగోవిందరెడ్డి స్వయంగా, సాదరంగా ఆహ్వానిస్తాడు. రెండుమూడు వారాలు సాగే మజిలీ మొత్తానికి తిండిగింజెలు ఇచ్చి పోషణ భారాన్ని వహిస్తాడు. అవసరమైన విగ్రహాలు గీయించడానికి ఖర్చులు భరిస్తాడు. కోరిన ఆటను ఆడించుకుంటాడు. అవసరమైన పాటలను, పద్యాలను మళ్ళీ మళ్ళీ పాడించుకుంటాడు. ఇదిలా వుంటే… ఊరి వాతావరణం మరొక అద్భుతం. విశాలమైన చింతవనం, ఊరిచుట్టూ పచ్చని పొలాలూ… ఊరికి దగ్గరలో నల్లమల కొండలూ… ఇసుక తిన్నెలూ… నీటి మడుగులతో ఊరిని చుడుతూ మెలికలు తిరిగి ప్రవహించే ఏరూ… ఏటి మడుగుల్లో చేపల వేట, చింత చిగురూ…రాగి సంకటి వంటకాలూ ఇలా… ఆ ఊరి జ్ఞాపకాలన్నీ ఆ బృందం మస్తిష్కాల్లో తెరతెరలుగా బయటికి వస్తున్నాయి.

ఊరు ముందరగా ఏరు సమీపించింది. బండ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇసుక దారిలో వెళ్ళి బండ్లు ఊరు చేరుకోవాలి. ఏటిలో ఇసుక, రాళ్ళూ తప్ప నీటి చెమ్మ ఉన్నట్టు లేదు.

”విశ్వరూప” ముందు బండిని తోలుతున్నాడు. వెంకటరావు తర్వాత బృందానికి విశ్వరూప ఉపనాయకునిలా వ్యవహరిస్తూ ఉంటాడు. వెంకటరావుకు నమ్మిన బంటు. చిన్నతనంలో అనాధగా దారిలో తారసపడితే వెంకటరావు చేరదీశాడు. బొమ్మలాటలో నైపుణ్యాన్ని సాధించిపెట్టాడు. తమ కళ విశిష్టతను, కుల చరిత్రను ఔపోసన పట్టించాడు. ‘సురభి’ నాటక సంఘాల స్థాపకుడైన గోవిందరావు కూడా తొలుత గంపా పకీరప్ప పేరుతో మశూచివ్యాధి బారినపడి అనాధగా తిరుగుతూ పనారస సంజీవరాయుని ధర్మపత్ని చెన్నమ్మకు దేశాటనలో తారసపడగా, చెన్నమ్మ చేరదీసిందని, ఆమె కుమారుడు వెంకోజీ పకీరప్పను దత్తత స్వీకరించి గోవిందరావుగా పేరు మార్చాడని వెంకటరావు విశ్వరూపకు పదేపదే గుర్తుచేస్తూ ఉంటాడు. నాటి గోవిందరావును మించి పేరు ప్రఖ్యాతులు సాధించాలని ప్రోత్సహిస్తూ ఉంటాడు.

విశ్వరూప వెంకటరావును ‘వెంకోజీ’ అని పిలుస్తూ ఉంటాడు.

జర్నలిజం, సాహిత్యం ప్రవృత్తిగా రచనలు చేస్తున్న తవ్వా ఓబుల్ రెడ్డి కడప జిల్లా ఖాజీపేట మండలం బక్కాయపల్లె గ్రామంలో జన్మించారు. వీరి సంపాదకత్వంలో వెలువడిన ” కడప కథ, రాయలసీమ వైభవం” సంకలనాలు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి.

‘రేయ్‌… విశ్వరూపా… ఇసుకలో బండ్లు నెమ్మదిగా పోనీ… చెమ్మ ఉంటుందేమో… దిగబడతాయి జాగ్రత్త” వెనుక బండిలోనుండి కేకేసినాడు వెంకటరావు.

అలాగేనన్నట్లు తలూపుతూ బండిని ఊరి దిశగా నడిపించాడు విశ్వరూప.

బండ్లు ఊర్లోకి ప్రవేశించాయి. ఎద్దులగంటల శబ్దాలకు కుక్కలు మొరగసాగినాయి. బండ్లను చింతవనంలో విడిచిన వెంటనే రామగోవిందరెడ్డిని కలుసుకోవాలనుకున్నాడు వెంకటరావు.

అయితే వెంకటరావు ఆలోచనకు ప్రతిబంధకం ఎదురైంది.

రామగోవిందరెడ్డి నాలుగేళ్ళ కిందటే కాలం చేశాడని దారిలోనే గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న వెంకటరావు నిశ్చేష్టుడైనాడు. ఈతపుల్ల విరిగిన తోలుబొమ్మలా కూలబడిపోయాడు.

విశ్వరూపతోపాటు బృందంలోని వారంతా కూడా లాభపడినారు.

బండ్లు ఊరిమీదుగా చింతవనానికి దారితీస్తున్నాయి. చింతవనం చాటుగా ఊరికి తూర్పున ఉన్న ఏరు, కొండలూ ఊళ్ళోకి నేరుగా కనిపించడంతో బృందంలోని వారంతా ఉలిక్కిపడ్డారు.

నిటారైన చింతవృక్షాలతో, మూడెకరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న వనం అదృశ్యమైంది.

రామగోవిందరెడ్డి కొడుకు చిన్నారెడ్డి చింతవనాన్ని నరికించాడని, ఆ స్థలంలో కోత మిషను ప్రారంభించి కలప వ్యాపారం చేస్తున్నాడని బండ్లకు ఎదురుగా వచ్చిన ఒక గ్రామస్థుడు చెప్పడంతో విశ్వరూప పగ్గాలను బిగపట్టి బండిని ఒక్కసారిగా ఆపాడు.

విషయం తెలుసుకున్న వెంకటరావు బండ్లను అక్కడికి దగ్గరలో ఒక పాత సత్రం వద్ద విడిది చేయాలని చెప్పాడు.

”చూశావా వెంకోజీ చెక్రాలపల్లె… చెక్రాలపల్లె అంటూ కలవరిస్తూ వచ్చినాం. తీరా చూస్తే ఇక్కడ తలదాచుకునేందుకు నీడే కరువైపోయింది” నిరాశగా అన్నాడు విశ్వరూప.

సత్రం వద్ద బండ్లను ఆపారు. ఆటసామగ్రిని సత్రం వసారాలోకి చేరవేశారు.

వెంకటరావు ఊరి పరిసరాలను నిశితంగా పరిశీలించసాగాడు. చింతవనంలో కోత మిషన్‌రొద చేస్తూ కలప మొద్దులను నిలువునా చీరేస్తూ వున్నట్లు… అక్కడినుండి వినిపించే శబ్దాన్నిబట్టి అంచనావేశాడు వెంకటరావు.

చదవండి :  యంగముని వ్యవసాయం (కథ) - ఎన్. రామచంద్ర

వెంకటరావు అంచనాకు తార్కాణంగా రాళ్ళూరప్పలతో ఊరి సమీపంలోని కొండలు కనిపిస్తున్నాయి. కొండ సెలల్లోని నిటారైన వృక్షాల జాడ ఇప్పుడు కనిపించలేదు. ప్రతికూలంగా ఉన్న పరిస్థితులకు వెంకటరావు ఏమాత్రం తొణకలేదు.

”ఏమైనా సరే చక్రాలపల్లెలో మజిలీ చేయాల్సిందే…! ఆట ఆడాల్సిందే” మనసులో అనుకున్నాడు.

ఆ రోజు రాత్రికే ఆటకు ఏర్పాట్లు చేయాల్సిందిగా విశ్వరూపను పురమాయించాడు. బృందంలోని మరో ముగ్గురు పురుషులూ, ముగ్గురు స్త్రీలూ ఆట ఏర్పాట్లలో భాగంగా విగ్రహాలను సరిచూడటం ప్రారంభించారు. బృందంలో వెంకటరావు చెల్లెలు శారదమ్మ, ఆమె భర్త రాజారావులతోపాటు తమ్ముడు శివాజీరావు, మరదలు రాధమ్మ, మేనల్లుడు కృష్ణాజీ, మేనకోడలు సత్యవతీ ఉన్నారు.

తన కొడుకులతోపాటు కూతురు దూరమైన సంఘటనలు అరవై ఏళ్ళప్రాయంలో వెంకటరావు మనసును తొలుస్తూ ఉంటాయి. జ్ఞాపకాలు అప్పుడప్పుడూ నిరుత్సాహానికి గురిచేస్తూ వున్నా… కళపట్ల అంకితభావం వెంకటరావులో పట్టుదలను పెంపొందిస్తూ ఉంటుంది.

అలా… ఊరు చుట్టి వద్దామని బయలుదేరాడు వెంకటరావు.

ఊరి స్వరూపం పూర్తిగా మారిపోయింది.

ఎనిమిదేళ్ళ కిందట కరెంటు తీగలు కూడా లేని ఊరి వీధుల్లో కేబుల్‌టీవీ, టెలిఫోన్ల వైర్లు బారులు తీరి వేలాడుతున్నాయి. అడుగడుగునా మిద్దెలపై ఏర్పాటు చేసుకున్న డిష్‌యాంటెన్నాలు, ప్రాచీన కళారీతులను మట్టుపెట్టేందుకు ప్రయోగించిన బోనుల్లా కనిపించాయి వెంకటరావుకు.

తూర్పువీధి వైపునకు నడిచాడు.

ఒక వేపచెట్టు కింద అరుగుపై కూర్చుని వున్న గ్రామస్తులు వెంకటరావును గుర్తుపట్టి పిలిచారు. పేపర్లు చూస్తూ జిల్లారాజకీయాలను చర్చిస్తున్నట్లు కనపడుతోంది అక్కడి వాతావరణం.

”ఏటామాదిరి కాకుండా ఈసారి ఆట మా వీధిలో శివాలయం ముందర వేయాలి” ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు పేపరు మడిచి పక్కన వేస్తున్న ఒక యువకుడు

”రామగోవిందరెడ్డి కాలం పోయింది” మరో యువకుడు ఆక్రోశంతో కేకేసినట్లుగా మాట్లాడాడు.

వెంకటరావు తల వూపుతూ ఏమీ మాట్లాడకుండా అక్కడినుండి గొల్లవీధికి వెళ్ళాడు. తర్వాత రెడ్లవీధి, బలిజవీధి, ఉప్పరవీధి, కమ్మవీధుల్లో తిరిగాడు. చివరగా ఊరికి దక్షిణంగా ఉన్న మాదిగవాడకు కూడా వెళ్ళాడు.

ఎక్కడికి వెళ్ళినా, తమ వీధుల్లోనే ఆటాడాలని, తమ వీధుల్లోనే మొదటిరోజు ఆట ప్రారంభించాలని పట్టుబట్టడం వెంకటరావుకు ఆశ్చర్యం కలిగించింది.
కులసంఘాలు, పార్టీల ప్రస్తావన, పంతాలూ పట్టింపులూ ఊరిలో బాగా నాటుకుంటున్నాయని వెంకటరావు అర్థం చేసుకున్నాడు.

ఏటా మాదిరిగా ఈసారి కూడా రామాలయం వద్దనే ఆట ఆడతామని, మరోసారి వచ్చినప్పుడు వేదిక స్థలాన్ని మార్పు చేస్తామని అందరికీ సర్ది చెప్పడానికి వెంకటరావు తలప్రాణం తోకకు వచ్చింది.

ఊర్లోనుండి సత్రం వద్దకు తిరిగివస్తుండగా వెంకటరావుకు ఎదురైన కొందరు గ్రామస్తులు మాత్రం అభిమానంగా పలుకరించారు. క్షేమసమాచారాలు, పిల్లల గురించి అడిగారు వాళ్ళు.

”ఎగిరిపోయిన పక్షుల గురించి ఏమని చెప్పాలి” అనుకుంటూనే తన ఇద్దరుకొడుకుల గురించి, కూతురి గురించి గ్రామస్తులకు చెప్పడం ప్రారంభించాడు వెంకటరావు.

”పెద్దకొడుకు సినిమా వేషాలపై మోజుతో ఐదేళ్ళకిందట చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. అంత సులభంగా వేషాలు ఎక్కడ దొరుకుతాయి? ఆ కాలంలో సురభి కళాకారులను అక్కున చేర్చుకున్న బొంబాయి ‘కృష్ణాఫిలిం కంబైన్స్‌’లాంటి కంపెనీలు ఈకాలంలో ఎక్కడున్నాయి. ఉంటే ఒక సినిమాలోనైనా వాడు ఈ పాటికి ఎవరికైనా కనిపించడా?” ఆవేదనగా గ్రామస్తులను అడిగాడు వెంకటరావు.

గ్రామస్తులు మౌనంగా వింటూ ఉన్నారు.

”రెండోవాడు… బొమ్మలాటనే అసహ్యించుకుని రికార్డు డ్యాన్సు బృందంలో కలిసిపోయినాడు. సురభి నాటకాల్లా రికార్డు డ్యాన్సులేమైనా దేశదేశాల్లో ఆదరణ పొందుతాయా? పాడా?”

వెంకటరావు చెబుతోంటే తలలు ఊపుతూ అలాగే నిలబడ్డారు గ్రామస్తులు.

”ఇక బిడ్డ శ్రీదేవి. ఏమైపోయిందో… పాపం పిచ్చితల్లి!… ఆటలో ‘ప్రమీల’పాత్రకు శ్రీదేవి కంఠం అగరొత్తుల వాసనలా సరిపోయేది. మినుకుమినుకుమంటున్న ఆటకు ‘బిడ్డ’ ఆశాదీపం అవుతుందనుకున్నాను. పడమర పల్లెలో రెండేళ్ళ క్రిందట ఒక సాయంత్రం బిడ్డ అదృశ్యమైంది. ఆ వూరి రెడ్డేరు కొడుకూ అతని స్నేహితులు కూడా ఆ రాత్రినుంచే కనిపించకుండా పోయారు. రెండు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు ఊళ్లో ప్రత్యక్షమైనారు. మద్రాసుకు గుర్రపు పందేలకు పోయొచ్చామని చెప్పినారు. బిడ్డ ఆచూకీ ఇప్పటికీ తెలియదు. పెళ్ళికి ఎదిగిన బిడ్డ ఏమైపోయిందో ఏమో?” కన్నీటిని తుడుచుకుంటూ చెప్పాడు వెంకట్రావు.

కొడుకుల సంగతిలా, కూతురి జ్ఞాపకాల్ని వెంకటరావు బలవంతంగానైనా దిగమింగుకోలేకపోతున్నాడు. సత్రానికి చేరుకున్నాడు.

ఊర్లోని పిల్లలంతా ఒక్కొక్కరే సత్రం దగ్గరికి చేరుకున్నారు. విగ్రహాలకు రంగులు గీసుకుంటున్న కళాకారులను ఆసక్తిగా గమనిస్తున్నారు వాళ్ళు.

కాలేజీల్లో చదువుకుంటూ పండుగ శెలవులకు ఇండ్లకు చేరిన కుర్రాళ్ళు కొందరు అక్కడ జమయ్యారు. రిలీజైన కొత్త సినిమాల గురించి, కుర్రతరం హీరోల గురించీ మాట్లాడుకుంటూ వచ్చారు వాళ్ళు. ఆయా హీరోలపై తమకున్న అభిమానాలను చాటుకోవడంలో పోటీలు పడుతున్నారు.

చదవండి :  కుప్పకట్లు (కథ) - బత్తుల ప్రసాద్

విగ్రహాలకు రంగులు వేయడం పూర్తిచేసిన విశ్వరూప, ఇతర కళాకారులూ బొమ్మలకు ఆభరణాలుగా కనిపించేందుకు విగ్రహాలకు రంధ్రాలతో నగిషీలు చిత్రిస్తున్నారు. వెంకటరావుతోపాటు వారంతా కాలేజీకుర్రాళ్ళ వాగ్వివాదాలను గమనిస్తున్నారు.

”ఏం… ముసిలాయనా… బొమ్మలాట ఆడటానికి వచ్చినారా? మాంచి బొమ్మలున్నాయా?” ఒక కుర్రాడు వెంకటరావును ప్రశ్నించాడు.

”ఓహో… విగ్రహాలా? అవి లేకుండా ఆటెట్లా ఆడతాం? బాబూ!… లక్షణంగా… దండిగా ఉన్నాయి. జుట్టుపోలిగాడూ… బంగారక్క… శ్రీరామచంద్రుడూ… సీతమ్మవారూ… ఆంజనేయుడూ… రావణాసురుడు… శూర్పణఖ… భారతం బొమ్మలూ… అన్నీ వున్నాయి” సోదాహరణంగా వివరించాడు వెంకటరావు.

”అహో… అలాగా… మీ దగ్గరున్న బొమ్మలతో ఏమేమి ఆటలు ఆడతారు?” మరో కుర్రాడు మళ్ళీ ప్రశ్నించాడు.

”సుందరకాండ, లక్ష్మణ మూర్ఛ, సతీసులోచన, విరాటపర్వం, ప్రమీలార్జునీయం, పద్మవ్యూహం, సైంధవవధ… ఇంకా చాలా ఆటలు ఆడతాం” ఈసారి విశ్వరూప చెప్పారు.

”తోలుబొమ్మల మాట సరేలే… ఈ బొమ్మ కథ చెప్పండి” బృందంలోని సత్యవతి వైపునకు ఓరగా చూస్తూ గుట్టుగా అడిగినట్లుగా అడిగాడు గళ్ళలుంగీని షర్టుపై బిగించుకుని ఉన్న డిస్కో కటింగ్‌యువకుడు.

ఆ కుర్రాళ్ళ వాలకం అర్థం అయింది వెంకటరావుకు.

”కడుపాత్రంతో దేశాటనం చేసే మాతో మీకు చెతుర్లు, ఎకసెక్యాలు ఎందుకు బాబూ” నెమ్మదిగా వారించాడు వెంకట్రావు.

”కంపుకొట్టే తోలుబొమ్మలతో, నలుగురు తలమాసిన వాళ్ళను జమచేసుకుని ఊర్లు తిరిగి బతికే మీతో, మాకు చెతుర్లు ఎందుకోయ్‌… నిజంగానే ఆ బొమ్మ నచ్చింది… అడుగుతున్నాం” మరో చెవిపోగు యువకుడు దురుసుగా మాట్లాడాడు.

విశ్వరూపకు కోపం వచ్చింది. శూర్పనఖకు కొత్త విగ్రహం కోసం దున్నపోతు చర్మాన్ని పారదర్శకంగా రుద్దుతున్న అతనల్లా ఆ పని ఆపి లేచి నిలబడ్డాడు.
”చూడండి… మేం తలమాసినవాళ్ళమే కావచ్చు… కానీ చెడిపోయినవాళ్ళం మాత్రం కాదు. రాత్రికి ఊర్లో ఆట ఆడ్తాం చూడండి. వెళ్ళేటప్పుడు మీకు తోచింది ఇవ్వండి. పూటగడవకపోతే మాడి చస్తాంగానీ మాటలు మీరితే పడి చచ్చేవాళ్ళం అనుకోకండి. మరొక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా వెళ్ళండి” హెచ్చరించాడు విశ్వరూప.

”రంభా… ఊర్వశి… తిలోత్తమలను వెంటబెట్టుకుని వచ్చార్రోయ్‌. పదండ్రా… బొమ్మలాటంట… బొమ్మలాట! బొమ్మలకు ప్రాణం వస్తుందా… ఆడటానికి ఇతగాళ్ళు జీవం పోస్తారా? పదండి” అక్కడినుండి ఊరివైపు విసురుగా కదిలినాడు డిస్కో కటింగ్‌యువకుడు.

 ”బ్రేకు డ్యాన్యులూ… రికార్డు డ్యాన్సులూ… ఎంటీవీ ‘వి’ చానళ్ళే బోరుకొట్టి ఛస్తుంటే, తోలుబొమ్మలాట చూడలంట” శృతి కలుపుతూ అనుసరించాడు చెవికమ్మ యువకుడు. వారిద్దరితోపాటు దాదాపు పదిమంది కుర్రాళ్ళు పకపకా నవ్వుకుంటూ ఊళ్ళోకి దారిపట్టారు.

పాతవస్త్రాలు కుట్టుకుంటున్న శారదమ్మ, పరదాలు కుడుతున్న రాధమ్మ, సత్యవతి ఏం జరుగుతుందోనని భయపడ్డారు.

ఆ కుర్రాళ్ళ మాటలతో గుండెల్లో శూలాలు దించినట్లయింది వెంకట్రావుకు. వెంకటరావును సముదాయించాడు విశ్వరూప.

 గట్టిగా పిడికిలి బిగించాడు వెంకటరావు. ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఊపిరి పీల్చుకున్న ఛాతీ మరింత విశాలమైంది.

”బ్రిటీషు వాళ్ళకు అలవికాని దివిటి దొంగలను మట్టుబెట్టేందుకు మరాట్వాడా నుంచి దత్తమండలానికి వలస తేబడిన మరాటావీర జాతిరా ఇది! కులశ్రేయస్సు కోసం అంబా భవానీ ఎదుట ఆత్మాహుతి చేసుకున్న సంజీవరాయుని వంశంరా మనది!” చాతీ మీద అరచేతితో చరుచుకుంటూ ఆవేశంగా కేకలేసినాడు వెంకటరావు.

విశ్వరూపతోపాటు బృందంలోని వారంతా వెంకటరావును సముదాయించారు.

శివాజీ, కృష్ణారావు చేపలవేట కోసం సన్నద్దమయ్యారు. వాళ్ళ చేతుల్లో వలలు, కొడిమెలు ఉండటాన్ని చూసిన విశ్వరూప చేతిలో జింకచర్మాన్ని చుట్టి పెట్టెలో పెట్టాడు. దేవతావిగ్రహాలను గీయించడానికి వ్యయప్రయాసలకోర్చి అయినాసరే జింకచర్మమే ఉపయోగించాలంటాడు వెంకటరావు. చర్మాన్ని శుద్ధి చేసే పనిని వాయిదా వేసుకున్న విశ్వరూప కూడా శివాజీ కృష్ణారావులతోపాటు ఏటికి చేపలకోసం బయలుదేరినాడు.

ఏటిలో మడుగులన్నీ పూర్తిగా ఎండిపోయాయి.

 లారీలతో ఇసుకనంతా పట్టణాలకు తరలిస్తూ ఉండటంతో ఏటి స్వరూపమే పూర్తిగా మారిపోయింది. కొంతసేపు తిరిగి వట్టి చేతులతో తిరుగుముఖం పట్టారు ముగ్గురూ. వాళ్ళని చూసిన గ్రామస్తులు కొందరు నవ్వుకున్నారు.

 వంట చేసుకోడానికి సరుకులు ఏమీ లేవు.

వెంకటరావు గంభీరంగా… ఏదో ఆలోచిస్తూ అరుగు మీదపడుకుని ఉన్నాడు.

అన్నంకోసం ఊర్లోకి వెళ్ళాలని ఎవరికీ అనిపించలేదు.

తనవద్దనున్న కొంత డబ్బుతో పప్పులు, అటుకులు, బెల్లం అంగడినుండి తెప్పించినాడు విశ్వరూప.

వాటిని తలా ఇన్ని తిని, నీళ్ళు తాగి సరిపెట్టుకున్నారు.

పొద్దుగూకి చీకటిపడేసరికి, ఊర్లోని రామాలయం వద్ద వేదిక సిద్ధమైంది.

 ఊరంతా వచ్చి ఆట చూడాలని చాటింపు వేయించాడు వెంకటరావు. చాటింపు విని అప్పుడొకరూ, అప్పుడొకరూ వచ్చినారు. ఎనిమిదిగంటల సమయం దాటిపోతున్నా ఆట చూసేందుకు ముప్ఫయిమంది జనం కూడా రాలేదు. వేదిక వద్దకు చేరిన పిల్లలు కొందరు ఏదో సంబరంతో గెంతులు వేస్తున్నారు.

పిల్లలను వేదిక ముందువైపున కూర్చోబెట్టడం ప్రారంభించాడు విశ్వరూప. బొమ్మలాటంటే ఎట్లా ఉంటుందో చూడాలనే ఆత్రుత, ఉత్సాహం ఆ పసిపిల్లల్లోనైనా కలుగుతున్నందుకు వెంకటరావుకు కొంత ఊరట కలిగింది.

చదవండి :  సియ్యల పండగ (కథ) - తవ్వా ఓబుల్‌‌రెడ్డి

రైతు జీతగాళ్ళూ… దళితవాడ మహిళలూ, కొందరు వృద్ధులూ మాత్రం ఆట చూడాలనే కోరికతో ముందుగానే చేరుకున్నారు.

గతంలో ఎన్నోసార్లు ఆ వూర్లో ఆట జరిగిన తీరూ… తండోపతండాలుగా గుమికూడిన జనసంఖ్య గుర్తుకువచ్చింది వెంకటరావుకు. విశ్వరూప, వెంకటరావు దగ్గరికి వెళ్ళి పరిస్థితి ఆశాజనకంగా లేదన్నట్టుగా పెదవి విరిచాడు.

వెంకటరావు అబ్బిళ్ళను కొరుకుతూ పట్టుదలగా తలను పైకీ కిందికి ఊపాడు. ఊర్లోకి దారిపట్టాడు. తానే స్వయంగా ఒకసారి అందరినీ పిలిచివస్తానని విశ్వరూపకు చెప్పి వెళ్ళాడు. ముందుగా రామగోవిందరెడ్డి ఇంటికేసి అడుగులు వేశాడు. తనలో చెలరేగుతున్న ఉద్వేగాన్ని అణుచుకుని, ప్రశాంతతను అలవర్చుకున్నాడు.

టీవీలో ఏదో ఇంగ్లీషు ఛానల్‌చూస్తూ నట్టింట్లోనే మందుకొడుతున్నాడు చిన్నారెడ్డి. వెంకటరావుకు. ఆ యింటితో గతంలో ఉన్న చనువుతో నేరుగా ఇంటిలోకి ప్రవేశించాడు. గోడకు వేలాడుతున్న రామగోవిందరెడ్డి నిలువెత్తు ఫోటోను చూశాడు. రెండు చేతులు జోడించి దండం పెట్టాడు. జలజలా రాలుతున్న కన్నీటిబొట్లను తుడుచుకుంటూ చిన్నారెడ్డికి దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు.

చిన్నారెడ్డి తలెత్తి వెంకటరావును గమనించాడు.

”రెడ్డిగారు… ధర్మప్రభువులు… తమరు దయచేస్తే ఆట మొదలుపెడతాం. మీ కోసమే ఎదురుచూపు” వెంకటరావు తల గీరుకుంటూ చిన్నారెడ్డిని ఆట చూసేందుకు ఆహ్వానించాడు.

”చూడు ముసిలానా… ఇట్లాంటివన్నీ నాకు సరిపడవుకానీ… వెళ్ళిపోయేటప్పుడు రాండి! ఎంతో కొంత లెక్క ఇస్తా” అంటూ మందు గుటిక లేసుకుని టీవీ చూడటంలో మళ్ళీ నిమగ్నమయ్యాడు చిన్నారెడ్డి.

చిన్నారెడ్డి మాటలకు హతాశుడైనాడు వెంకట్రావు. పొరుగూర్లో ముందురోజు గ్రామపెద్దల వ్యాఖ్యలు కూడా గుర్తుకు వచ్చాయి.

”తిండిగింజలకు ఇనాములకు ఇక్కడ కూడా కాలం చెల్లిందేమో” అనుకున్నాడు. అక్కడినుండి ఇంటింటికీ వెళ్ళి అందరినీ ఆహ్వానించాడు వెంకటరావు.
టీవీలకు అతుక్కుపోయి ఉన్నారు ఊరంతా కూడా!

”ఆ… ఆ… ఆట మొదలెట్టుపో… వస్తా ఉండాం” అంటున్నారేగానీ టీవీల దగ్గరనుండీ ఎవరూ లేవడం లేదు.

వెంకటరావు రామాలయం వద్దకు చేరుకున్నాడు. ఆటకోసం విగ్రహాలను సిద్ధం చేస్తున్నాడు విశ్వరూప.

‘లంకాదహనం’ ఆట ఆడబోతున్నట్లు ప్రకటించాడు వెంకటరావు. పందాలకు సరైన దిశలో నూనె దీపాలను ఏర్పాటు చేశారు. ప్రార్థన ప్రారంభించారు.
ప్రార్థన విని సమీప ఇళ్ళలోని మరికొందరు గ్రామస్తులు రామాలయం వద్దకు వచ్చారు.

ఆంజనేయుని విగ్రహం చేతికి తీసుకున్నాడు వెంకటరావు. ఆట ప్రారంభమైంది. తెరపై విగ్రహాలు ప్రత్యక్షమైనాయి. జుట్టు పోలిగాడు… బంగారక్కలాంటి హాస్యవిగ్రహాలు తెరపైకి రాలేదు.

”ఆంజనేయుడు సముద్ర తలంపై లంకానగరం వైపునకు పయనిస్తున్నాడు. రామలక్ష్మణులు, వానరులు సముద్రపు ఒడ్డున చేరారు” నూనె దీపాల వెలుతురులో తెరపై విగ్రహాలు రంగురంగుల్లో మెరుస్తూ స్వర్ణకాంతులను వెదజల్లుతున్నాయి.

గంభీరంగా ప్రారంభమైన ఆట ఊపందుకుంది. తక్కువ సంఖ్యలో ఉన్నా జనం కథలో లీనమైపోయారు.

”ఆంజనేయుడు లంకానగరంలో ప్రవేశించాడు. రాక్షసభటులు ఆంజనేయుడిని బంధించి, తోకకు నిప్పుపెట్టారు. మంటలు ఎగిసిపడుతున్న తోకను చేత్తో పట్టుకుని లంకానగర దహనానికి ఉద్యుక్తుడైనాడు ఆంజనేయుడు. మంటలబారినపడి, రాక్షసమూక చేస్తున్న ఆర్తనాదాలు, ఏడుపులు… పెడబొబ్బలూ మిన్నంటుతున్నాయి. పొగలు మేఘాలను కమ్ముకుంటున్నాయి.”

వెంకటరావు గొంతు ఉద్వేగపు జీరతో కూడిన పాటతో సాగుతోంది. కంఠస్వరాన్ని పాత్రలకు అనుగుణంగా మారుస్తూ, ఆలాపన చేస్తున్నాడు. విశ్వరూపతోపాటు బృందంలో సభ్యులు చెక్కలను, పాదాలతో తొక్కుతూ శబ్దాలు సృష్టించి రాగాలాపన చేస్తున్నారు.

వెంకటరావును గమనించిన విశ్వరూప నిశ్చేష్టుడైనాడు.

మంటలు అంటుకుంటున్న చేతిని విదుల్చుకుంటూ రాక్షస మూకల ఆర్తనాదాలను ఆలపిస్తున్నాడు వెంకటరావు. ఆయన చేతి మంటలు పరదాలకు ప్రాకాయి. వేదిక అంటుకుంది.

కథలో లీనమైన ప్రేక్షకులు ఉలిక్కిపడి వాస్తవదృశ్యాన్ని గమనించి కేకలు వేయసాగారు.

విశ్వరూపను, తోటి కళాకారులను అందరినీ మరో చేత్తో కిందికి తోశాడు వెంకటరావు. వెంకటరావును ఆపాదమస్తకం మంటలు అంటుకున్నాయి. నిలువెల్లా దహించుకుపోతున్నా రాగాలాపన మాత్రం ఆపలేదు.

చెల్లాచెదురైన జనం మంటలను ఆర్పేందుకు నీళ్ళకోసం పరుగులు తీస్తున్నారు. ఈ బీభత్సానికి బృందంలోని మహిళలు కొందరు స్పృహతప్పి కూలబడిపోయారు.

చేతులాడని స్థితిలో స్థాణువై నిలబడినాడు విశ్వరూప.

లంకాదహనపు సన్నివేశంలోని పాటే… వెంకటరావు సజీవ దహనపు ఆర్తనాదమైంది.

ఏ అఘాయిత్యం చేస్తాడోనని గ్రామస్తులు విశ్వరూపను పట్టుకున్నారు. కణకణజ్వాలలతో మండిన వేదిక, క్షణాల్లోనే కుప్పకూలిపోయింది.

ఈ సంఘటనతో చలించిన గ్రామస్తులు కన్నీరు కార్చారు. ఊరంతా స్మశాన ప్రశాంతత అలుముకుంది.

స్పృహలోకి వచ్చిన కళాకారులు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు.

”దీపపు సమ్మెలోని నూనెను చేతిపై గుమ్మరించుకుని నిప్పు అంటించుకున్నాడు. ఆటలో జీవిస్తున్నాను. ఆటకు ప్రాణం పోస్తున్నాను. మీరు కిందికి దిగిపోండ్రా అంటూ మంటల్లో కాలుతూ మమ్మల్ని కిందికి తోశాడయ్యా” వెంకటరావు చెల్లెలు శారదమ్మ వేదికపై ఏం జరిగిందో చెబుతోంది.

గ్రామంలో నెలకొన్న ప్రశాంతతను భగ్నపరిచేందుకు ఇక ఆ రాత్రి ఏ టీవీ శబ్దమూ వినపడలేదు!

(08.12.2002, ఆదివారం వార్త)

ఇదీ చదవండి!

సూర్య విగ్రహం

నిడుజువ్విలో సుందర సూర్య విగ్రహం!

భారతీయ సంస్కృతిలో సూర్యారాధనకు ఉన్న ప్రాధాన్యత అమితమైనది. కోణార్క్ లోని సూర్యదేవాలయాన్ని ఇందుకు ప్రతీకగా చెప్పుకుంటాం. మన రాష్ట్రంలో ‘అరసవెల్లి’ …

ఒక వ్యాఖ్య

  1. Mee katha Chala Bagundi. Induloni patralu chaduvutunnanta sepoo sajeevamgaa kanpinchinay. Manchi katha!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: