ఇంట గెలవని వారు రచ్చగెలుస్తారా అనేది సామెత. ఇక్కడ డీఎల్, మైసూరా మాత్రం సొంతింట్లో చీదరింపునకు గురయ్యారు. ఓటర్లు వారికి వ్యతిరేకంగా ఓట్లు వేసి తిరస్కరించారు. వారిద్దరూ తమ సొంత నియోజక వర్గాల్లో మెజారిటీ తెచ్చుకోకపోవటం అటుంచి కనీసం జగన్కు వచ్చిన ఓట్లకు దరిదాపుల్లో కూడా లేరు.
మైదుకూరు నియోజకవర్గంలో డీఎల్కు 25,432 ఓట్లు వస్తే అదే నియోజక వర్గంలో జగన్కు 95,579 దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ కంటే 71,147 ఓట్లు ఆధిక్యం! తెదేపా అభ్యర్థి మైసూరాకు సొంత సెగ్మెంట్ కమలాపురంలో 17,850 ఓట్లు వచ్చాయి. జగన్కు 87,810 ఓట్లు వచ్చాయి.
మైసూరారెడ్డికంటే జగన్కు 69,960 ఓట్లు అధికంగా నమోదయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్కు 21,928 ఓట్లు వచ్చి రెండో స్థానంలో ఉంటే తెలుగుదేశం అభ్యర్థి మాత్రం మూడోస్థానానికి దిగజారింది. తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు, శాసన సభ్యుడు ప్రాతినిధ్యం వహించే ప్రొద్దుటూరులో కూడా 20,743 ఓట్లు సంపాదించి మూడో స్థానంలో నిలిచారు. జమ్మలమడుగు నియోజక వర్గంలో 41,521 ఓట్లు వచ్చాయి.
మిగిలిన నియోజక వర్గాల్లో మూడో స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీరారెడ్డి ఉన్నన్ని రోజులూ తెదేపా అగ్రస్థానంలో ఉన్న బద్వేలులో ఈసారి దక్కింది 13,603 ఓట్లే. మెజారిటీ వస్తుందని భావించిన కడపలో 13,866తోనే సరిపెట్టుకొన్నారు. కమలాపురంలో మైసూరారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి ఇద్దరు ఉన్నా 17,850 ఓట్లు రావటం తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకున్నారు.