తెలుగు సమాజం కార్యవర్గ తీర్మానం
మైదుకూరు: తెలుగు భాషా, సంస్కృతుల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలాగే విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల ఇష్టాన్ని పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని తెలుగు సమాజం కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రముఖ కవి లెక్కల వెంకట రెడ్డి అధ్యక్షతన తెలుగు సమాజం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, రచయిత తవ్వా ఓబుల్రెడ్డి మీడియాకు వెల్లడించారు.
కళాశాల విద్యార్థులకు కథ, కవితల పోటీలను నిర్వహించాలని, తెలుగు భాషను పరిరక్షించడానికి పల్లె వృత్తుల మాండలిక పదాలను సేకరించి పదిలపరచాలని, గ్రామీణ కళల ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినారు. తెలుగు భాషను సరళతరం చేసి పరీక్షలను సులభతరం చేయాలని, విద్యార్థుల పుస్తకాల్లో ఆటలకు, పాటలకు ప్రాధాన్యతనివ్వాలని, ప్రభుత్వ రికార్డులను, ఉత్తర్వులను , దరఖాస్తులను తెలుగు భాషలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా సమావేశం ప్రభుత్వాన్ని కోరింది.
కవి లెక్కల వెంకట రెడ్డి మాట్లాడుతూ… పదహారుకోట్లమంది మాట్లాడే తెలుగు భాష పట్ల ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భాషా సాంస్కృతిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపును, చేయూతను ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ తల్లిభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోలాటం , కవితాగానం, కథా పఠనం లాంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో రచయితలు డి.వి. సుబ్బానాయుడు, డాక్టర్ పొదిలి నాగరాజు, జి.వీర గురుమూర్తి కళాకారులు గురువారెడ్డి, ఎ.వీరాస్వామి, ధర్మిశెట్టి రమణ, సిపిఐ రైతుసంఘం జిల్లా నాయకుడు ఎ.వి. రమణ, సహజవ్యవసాయ కేంద్రం డైరెక్టర్ పోలు కొండారెడ్డి , దువ్వూరు రైతు సంఘం నాయకుడు చాగంరెడ్డి వీరనారాయణ రెడ్డి , తెలుగు సమాజం కార్యవర్గ సభ్యులు ఎస్.సాదక్, ఫై.బాబయ్య , కే.ప్రతాపరెడ్డి , మహానందప్ప, జి. గోపాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.