కడప: స్థానిక సీపీ బ్రౌన్ బాషా పరిశోధన కేంద్రం వేదికగా ఆదివారం మల్లెమాల సాహిత్య పురస్కార ప్రధానోత్సవం, పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. సాహితీ రంగంలో చేసిన సేవకు గుర్తింపుగా ఆచార్య మధురాంతకం నరేంద్ర మల్లెమాల సాహితీ పురస్కారం అందుకున్నారు. ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాధరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమమంలో సామాజిక ప్రయోజనంగా మధురాంతకం నరేంద్ర సాహిత్యం ఉంటుందని వక్తలు కొనియాడారు.
ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాధరెడ్డి మాట్లాడుతూ… మనుషు ల వ్యక్తిత్వంలో ఉన్న తేడాను నరేంద్ర సాహిత్యం నిరూపిస్తుందన్నారు. యోవేవి ఉపకులపతి ఆచార్య డాక్టర్ భేతనభట్ల శ్యాంసుందర్ మాట్లాడుతూ డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్రెడ్డితో తనకున్న పరిచయాన్ని నెమరువేసుకున్నారు. పురస్కార గ్రహీత మధురాంతకం నరేంద్రను అభినందించారు.
కథా రచయిత సింగమనేని నారాయణ మాట్లాడుతూ లోకోత్తమ పరిశీలకుడు నరేంద్రకు మల్లెమాల పురస్కారం లభించడం ముదావహమన్నారు.
రచయిత్రి ప్రతిమ మాట్లాడుతూ మానవ సంబంధాలపై తనరచనలతో పాఠకులను ఆకట్టుకునే ప్రతిభా శాలి నరేంద్ర అన్నారు. నందలూరు కథానిలయం వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్బిగారి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నరేంద్ర కథా సాహిత్యానికి ఆణిముత్యం లాంటివారన్నారు.
పురస్కార ప్రదాత డాక్టర్ మల్లెమాల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ సాహిత్య రంగంలో విశేష సేవలు అందించిన లబ్ధప్రతిష్టలకు మల్లెమాల పురస్కారం అందిస్తున్నామన్నారు.
మధురాంతకం నరేంద్ర స్పందిస్తూ మల్లెమాల పురస్కారం ద్వారా తన బాధ్యతలు మరింత పెరిగాయన్నారు. సాహిత్యంసామాజిక ప్రయోజనానికికేనన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా జిల్లా సాహితీ సంస్కృతిని వారసత్వ సంపదగా భావితరాలకు అందించేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. మల్లెమాల పుస్తకావిష్కరణ రెండో సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జనం విడిపోతున్నారని తెలుగు వారి మధ్యే విద్వేషాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో అందరినీ కూడగట్టేలా మల్లెమాల సభను నిర్వహించడం ద్వారా మానవత్వాన్ని పరిమళింపజేస్తున్నారన్నారు.
అనంతరం మల్లెమాల రచించిన చీకటి దారి, చింతన పుస్తకావిష్కరణ జరిగింది. ‘చీకటి దారి’ని పాలగిరి విశ్వప్రసాద్ సమీక్షించారు. ‘చింతన’ను సుబ్బారాయుడు సమీక్షించారు.
తరువాత పలు సాహితీ సంస్థల నిర్వాహకులు పాలాది లక్ష్మీకాంతం, రామసుబ్బారెడ్డి, డాక్టర్ భూతపురి సురేంద్ర శర్మ, జానమద్ది విజయభాస్కర్, అలపర్తి చౌదరి, డాక్టర్ మూల మల్లికార్జునను సత్కరించారు.
కార్యక్రమంలో బాషా పరిశోధకులు కట్టా నరసింహులు, రచయితలు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, తవ్వా ఓబులరెడ్డి, వేంపల్లి గంగాధర్, ప్రకాశం, కొత్తపాట మధుసూదన్, గోపాలకృష్ణ, పెన్నెటి పబ్లికేషన్స్ అధిపతి నూకా రాంప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.