తాను రాజకీయాల్లో కొనసాగాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు కాబట్టే.. వారి ఆకాంక్ష మేరకు రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ మాజీ మంత్రి, మైదుకూరు శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డి వెల్లడించారు. మైదుకూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పుట్టా సుధాకర్యాదవ్, తెదేపా కడప పార్లమెంట్ అభ్యర్థిగా తాను ఎన్నికల గోదాలోకి దిగనున్నట్లు ఆయన ప్రకటించారు.
బుధవారం సాయంత్రం తన స్వగ్రామమైన సుంకేశులలో అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో తనను ఆదరించిన నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉంటానని చెప్పారు. రాజకీయాలు అంటేనే అసహ్యమేసేలా ఉన్నాయని నిర్వేదం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ చచ్చిపోయిందని, పూర్తిగా కనుమరుగయిపోతుందన్నారు.
రైతులు – వ్యవసాయ రుణాలు, మహిళలు – డ్వాక్రా రుణాలు ఎవరూ చెల్లించవద్దని ఆయన సూచించారు. తెదేపా అధికారంలోకి వస్తే అవన్నీ రద్దవుతాయని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే మండల, జిల్లా పరిషత్, శాసనసభ ఎన్నికల్లోనూ తెదేపాకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే రౌడీల రాజ్యం ఉంటుందని విమర్శలు గుప్పించారు.
మొత్తానికి డిఎల్ కడప జిల్లా రాజకీయాలలోనే ఉండబోతున్నారన్నమాట!!