కడప: నిన్న (శనివారం) జీవో 120కి నిరసనగా తిరుపతిలో జరిగిన ధర్నాకు సంబంధించి వివిధ పత్రికల కవరేజీ ఇలా ఉంది…ఒక్క సాక్షి, విశాలాంధ్ర, ప్రజాశక్తి పత్రికలు మాత్రం ఈ విషయానికి ప్రాధాన్యత ఇచ్చి మెయిన్ పేజీలలో వార్తలు క్యారీ చేయగా మిగతా తెలుగు పత్రికలు ఈ అంశాన్ని, వార్తలను అంతగా ప్రాధాన్యం లేని చిత్తూరు జిల్లా టాబ్లాయిడ్ లోపలి పేజీలకు పరిమితం చేశాయి. ఇంగ్లీషు పత్రికలైన The Hans India, The Hinduలు ఈ విషయానికి తెలుగు పత్రికలకన్నా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాయి. The New Indian Express దినపత్రిక తిరుపతి ఎడిషన్లో మాత్రమే వార్తను క్యారీ చేసి కొన్ని తెలుగు పత్రికలకన్నా మేలనిపించింది.
ఈనాడు: ఈ వార్తకు చిత్తూరు జిల్లా టాబ్లాయిడ్ లోని లోపలి పేజీల్లో మాత్రమే చోటు కల్పించారు. వార్తలో ఎక్కడా జీవో120 పేరు ప్రచురించకుండా సామాన్యులకు అర్థం కాని ఆర్టికల్ 371(D) గురించి మాత్రమే ప్రస్తావించారు. అదొక విషయమే కాదన్నట్లు, మొక్కుబడిగా వార్త ప్రచురించినారు.
సాక్షి: ఇంతకాలం జీవో 120 విషయంలో స్తబ్దుగా ఉన్న సాక్షి నిన్నటి ధర్నా తర్వాత ఇవాళ రాయలసీమ, బెంగుళూరు, చెన్నై మెయిన్ ఎడిషన్లలో మొదటి పేజీలో జీవో 120 గురించి ‘సీమ విద్యార్థుల గొంతుపై 120 కత్తి’ పేర విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. ఇదే కథనాన్ని ఆం.ప్రలోని అన్ని మెయిన్ ఎడిషన్లూ క్యారీ చేసింటే బాగుండేది. అలాగే ఆం.ప్ర మెయిన్లో ధర్నాకు సంబంధించిన వార్తను ప్రచురించింది.
ఆంధ్రజ్యోతి: ధర్నాకు సంబంధించి ‘స్వల్ప ఉద్రిక్తంగా స్విమ్స్ మెడికల్ సీట్ల ఆందోళన’ పేర ఆంధ్రజ్యోతి చిత్తూరు టాబ్లాయిడ్ ఆరో పేజీలో వార్తను ప్రచురించింది.
ఆంధ్రభూమి: చిత్తూరు టాబ్లాయిడ్ చివరి పేజీలో వార్తను ప్రచురించి ఆంధ్రజ్యోతి, ఈనాడుల కన్నా మెరుగ్గా ప్రాధాన్యత కల్పించారు. కాకపోతే టైటిల్ లో జీవో120కి బదులుగా జీవో102 అని పేర్కొనడం గందరగోళం కలిగించేలా ఉంది.
విశాలాంధ్ర: విశాలాంధ్ర కూడా ఈ వార్తకు బాగానే ప్రాధాన్యం ఇచ్చింది. మెయిన్ ఎడిషన్లో 5వ పేజీలో వార్తను క్యారీ చేసి సమస్య తీవ్రతను తెలియచెప్పే ప్రయత్నం చేశారు.
ప్రజాశక్తి: చిత్తూరు జిల్లా టాబ్లాయిడ్ 2వ పేజీలో, మెయిన్ 7వ పేజీలో ‘ప్రజాశక్తి’ ధర్నాకు సంబంధించిన వార్తను ప్రచురించింది. ప్రజాశక్తి ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను గురించి, విద్యార్థి సంఘాల గురించి కానీ ప్రస్తావించకపోవడం విచారకరం.
The Hans India: 5వ పేజీలో ఈ వార్తను అన్ని ఆం.ప్ర ఎడిషన్లలోనూ ప్రచురించింది.
The New Indian Express: రాయలసీమ జిల్లాల ఎడిషన్లన్నిటిలో కొన్ని తెలుగు దినపత్రికల కన్నా మెరుగ్గా వార్తను క్యారీ చేసింది.
సీమ జర్నలిస్టులు సిగ్గుపడాలి. తెలంగాణా మిత్రులను చూసి నేర్చుకోండి. జీవో 120 పై.. నమస్తే తెలంగాణా పత్రిక రెండు నెలల క్రితమే ప్రత్యేక కథనం ఇచ్చింది. మనకు జరుగుతున్న అన్యాయం ప్రశ్నించకుండా పార్టీల ప్రయోజనాలకి ప్రాధాన్యం ఇస్తున్నాం. మనకు పార్టీలు కూడు పెట్టవు. మన బిడ్డల భవితకు ఇకనైనా అండగా నిలిచే కధనాలు ఇవ్వండి. మన ఉద్యమానికి అక్షరాలతో ఊపిరి ఊదాలని విన్నవిస్తున్నా..