వేంపల్లె: స్థానిక లిటిల్ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం వేంపల్లె షరీఫ్ రచించి ప్రచురించిన ‘తలుగు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి, మాజీ శాసనమండలి సభ్యుడు షేక్హుసేన్, మాజీ ఎంపీ తులసిరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి, అతిధులకు ప్రతులను అందించారు. సమాజంలోని కథా వస్తువులు తీసుకుని పాఠకుల హృదయాలను కదిలించేలా రచయితలు కథలు రాయాలని ఈ సందర్భంగా వక్తలు అభిభాషించారు.
షేక్హుసేన్ మాట్లాడుతూ ‘ముస్లింల జీవన స్థితిగతులపై గతంలో ఎన్నో కథలు రాశా. వేంపల్లెకు చెందిన యువకుడు షరీఫ్ హైదరాబాదు బాంబు పేలుళ్ల నేపధ్యంలో ముస్లింల ఘటనకు సంబంధించి జుమ్మా పేరిట కథ రాసి విమర్శకుల ప్రశంసలు పొందారు. తాను పుట్టినచోటే బోరేవాలాల జీవన చిత్రం అణచివేతకు గురవుతున్న అంశంపై తలుగు పేరిట మంచి కథ రాశార’ని కితాబునిచ్చారు. బోరేవాలాల గురించి పుస్తకం రాయడం, దాన్ని వారికే అంకితం చేయడం గొప్ప సాహసం అన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ షరీఫ్ ఎదుగుతున్న కథకుడు అన్నారు. ఈయన కథలు నేటి యువ రచయితలకు స్ఫూర్తిదాయకం అన్నారు.
మాజీ ఎంపీ తులసిరెడ్డి మాట్లాడుతూ సమాజానికి సాహిత్యం దిక్సూచి అన్నారు. సీమ గ్రామీణంలో అంతరించి పోతున్న తెలుగు పదాలను షరీఫ్ తలుగు పుస్తకం ద్వారా ప్రజలకు తెలియజేయడం హర్షణీయమన్నారు.
ప్రముఖ కథారచయితలు ఇనయతుల్లా, వెంకట కృష్ణలు మాట్లాడుతూ పేదరికంలో పుట్టిన వేంపల్లె షరీఫ్ చిన్నతనంలోనే సాహితీ రంగంలో అడుగుపెట్టి మంచి కథలు రాశారన్నారు.
ప్రముఖ కథా రచయితలు తవ్వా ఓబుళరెడ్డి, విమర్శకుడు తవ్వా వెంకటయ్య తదితరులు సాహితీరంగంలో షరీఫ్ ఎదుగుతున్న తీరును కొనియాడారు.
చివరగా పుస్తక రచయిత షరీఫ్ మాట్లాడుతూ పేదరికంలో పుట్టిన తాను పాత్రికేయునిగా జీవితం ప్రారంభించి పెద్దల ఆశీస్సులతో ఈ స్థానానికి చేరుకున్నానన్నారు. చింతలమడుగుపల్లెలో నివసించేటప్పుడు బోరేవాలాలు ఎదుర్కొంటున్న కష్టాలను చూశానని, హైదరాబాదు బాంబుపేలుళ్ల సందర్భంగా ముస్లింలు పడ్డ ఇబ్బందులను చూసి వాటికి అక్షర రూపం ఇచ్చానన్నారు. అనంతరం షరీఫ్ను ఆహుతులు ఘనంగా సత్కరించారు.
సాహితీ స్రవంతి జిల్లా కన్వీనరు మస్తాన్వల్లి, ఉషాకిరణ్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ రమణారెడ్డి, మండల కోఆప్షన్ మాజీ సభ్యుడు బాబా ఫకృద్ధీన్, ఎంపీటీసీ సభ్యుడు టోపీవల్లి తదితరులు పాల్గొన్నారు.