కడప: ఇటీవల అయిదు మృతదేహాలు లభ్యమై రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి వేదికైన జియోన్ పాఠశాల గుర్తింపును జిల్లా విద్యాశాఖ రద్దు చేసింది. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వారిని సమీప పాఠశాలల్లో సర్దుబాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నష్టం కల్గించకుండా నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ సి.హెచ్.రమణకుమార్, డీఈవో అంజయ్య చర్చించి పాఠశాల విద్య సంచాలకులు ఉషారాణి దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ మేరకు పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ ఆర్జేడీ రమణకుమార్ ఉత్తర్వులిచ్చారు. తల్లిదండ్రులు వారి పిల్లలను సమీప పాఠశాలల్లో చేర్చుకోవాలి. జిల్లా విద్యాధికారి అంజయ్య, మండల విద్యాధికారి నాగమునిరెడ్డి గురువారం పాఠశాలను సందర్శించి అక్కడి స్థితిగతులను పరిశీలించారు.
నగరంలోని నబీకోటలో ఉన్న జియాన్ ఆంగ్ల మాధ్యమ పాఠశాల 1996 సంవత్సరం జిల్లా విద్యాశాఖ నుంచి గుర్తింపు పొందింది. ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలగా మార్పుచెందింది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 365 విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు.ఈ పాఠశాలలో మొత్తం 365 మంది పిల్లలు ఉన్నారు.
విద్యాహక్కుచట్టం-2009 ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలు ఏతరగతిలో అయినా ఎప్పుడైనా ప్రవేశాలు పొందవచ్చు. వీరికి వేరొక పాఠశాలల్లో చేరడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. 9, 10 తరగతుల విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోపు పాఠశాలల్లో ప్రవేశం పొందాలి. ఈ పాఠశాల ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వేరొక పాఠశాలల్లో చేరేందుకు విద్యాశాఖ అధికారులు అనుమతి ఇచ్చారు.