‘పులివెందులకు తాగునీటి ఇక్కట్లు తప్పవు’

జలాశయాలను పరిశీలించిన జగన్

16 టిఎంసిల నీళ్ళు ఇవ్వాల్సి ఉంటే 2.55 టిఎంసీలే ఇచ్చారు

పులివెందుల: విపక్ష నేత, పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్ శుక్రవారం మాయిటాల పులివెందులకు నీరందించే పెంచికల బసిరెడ్డి జలాశయం, పైడిపాలెం జలాశయాలను సందర్శించారు. అలాగే పార్నపల్లె తాగునీటి పథకాన్ని, అలాగే వెలిదండ్లలోని నీటికుంటను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. జగన్ ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ…

‘‘పెంచికల బసిరెడ్డి జాలశయం (చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) సామర్థ్యం 10 టీఎంసీలు. పైడిపాలెం జలాశయం సామర్థ్యం ఆరు టీఎంసీలు. పులివెందుల ప్రాంతంలో అవసరమైన 16 టీఎంసీలకుగాను చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది 2.55 టీఎంసీలు మాత్రమే. ఈ నీటిలో కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పులివెందుల మున్సిపాలిటీలకు తాగునీరు, యూసీఐఎల్‌కు కేటాయింపులకుగాను 1.5 టీఎంసీలు అవసరం అవుతాయి.

చదవండి :  7న కడపకు బాబు

మిగిలిన ఒక టీఎంసీలో 0.55 టీఎంసీల నీరు పులివెందుల బ్రాంచి కాలువ ఆయకట్టుదారులకు విడుదల చేశారు. దాదాపుగా 1.52 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఏడాది కాలంలో కేవలం 12 వేల ఎకరాలకు ఒక తడి మాత్రమే నీరందించారు.

మరోవైపు 1 టీఎంసీ సామర్థ్యమున్న నక్కలపల్లి సమ్మర్ స్టోరేజి ట్యాంకులో ప్రస్తుతం 0.1 టీఎంసీ మాత్రమే నిల్వ ఉంది. అంటే ప్రస్తుతం పది శాతం మాత్రమే నీరు చేరింది. ఇంకా 90 శాతం నీరు చేరాల్సి ఉంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.55 టీఎంసీ నీరు ఉంది. అయితే ఇందులో కనీస నీటిమట్టంగా 0.95 టీఎంసీల నీరు నిల్వ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన మరో 0.63 టీఎంసీలు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ నీటి ద్వారా సమ్మర్ స్టోరేజీ ట్యాంకును 30 శాతం నింపవచ్చు.

చదవండి :  నగరంలో ట్రాఫిక్‌పై ఆంక్షలు... పోలీసు బలగాల పహారా

ఎటుచూసినా పులివెందుల ప్రాంత ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పనిసరి. ఇంతటి దారుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటే, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి చంద్రబాబులకు పులివెందుల రైతులు శాలువాలు కప్పి సన్మానం చేశారని అసెంబ్లీలో చెప్పారు.

పిబిఆర్ జలాశయంలో ప్రస్తుతం నీరు ఉందంటే, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా 0.5 టీఎంసీల నీరు డ్రా చేసుకుని రాగలిగామంటే ఆ ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే సాధ్యమైందని తెలిపారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పథకానికి సీఎంగా తొమ్మిదేళ్ల హయాంలో చంద్రబాబు కేవలం రూ.13 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు కోసం రూ. 6,500 కోట్లకుగాను 5,800 కోట్లు వెచ్చించి పనులు చేపట్టారన్నారు. కాబట్టే చిత్రావతిలో ఈ నీరైనా సాధ్యమైందన్నారు.” అన్నారు.

చదవండి :  పులివెందులలో ఎవరికెన్ని ఓట్లు?

బ్రహ్మంసాగర్‌కు చుక్క నీరు ఇవ్వలేదు

‘పది సంవత్సరాలుగా బ్రహ్మంసాగర్ నీటితో కళకళలాడింది. 10 నుంచి 12 టీఎంసీల నీరు నిల్వ చేసిన చరిత్ర ఉంది. సీఎం చంద్రబాబు హయాంలో ఒక చుక్క నీరు ఇవ్వలేద’ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. ఇదే విషయాన్ని శుక్రవారం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాకు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కలసి స్వయంగా వివరించారని చెప్పారు.

మొత్తానికి ఎన్నికలైన చాలా కాలానికి విపక్ష నేత జగన్ సొంత నియోజకవర్గంలోని సమస్యల గురించి పరిశీలనలు చేసి వివరాలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనుకోవాలి. ఇలాగే జిల్లాలోని సమస్యలన్నిటిపైనా స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తే బాగుంటుంది. ఇంతకీ జగన్ ఆ పని చేస్తారా?

ఇదీ చదవండి!

సదానంద గౌడ

ఈ పొద్దు జిల్లాలో కేంద్ర న్యాయశాఖ మంత్రి పర్యటన

కడప : కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానందగౌడ ఈరోజు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఫ్యాక్స్‌ ద్వారా సమాచారం అందిందని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: