జిల్లాలో తెదేపా తరపున రాజంపేట శాసనసభ్యుడిగా గెలుపొందిన మేడా మల్లికార్జునరెడ్డికి అసెంబ్లీ విప్గా పదవి లభించింది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లా నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి చంద్రబాబునాయుడు కొలువులో మంత్రిపదవి దక్కుతుందని అందరూ ఊహించారు. కానీ నారా వారు కడప జిల్లాను పక్కన పెట్టేయ్యడంతో మొదటి విడతలో మేడా వారికి మంత్రిగిరీ దక్కలేదు.
కనీసం మలివిడతలో మంత్రిపదవి లభిస్తుందని మేడా వారు ఆశపడ్డారు. శుక్రవారం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మల్లికార్జునరెడ్డిని విప్గా నియమించారు. విప్ పదవి లభించినందున మేడాకు మంత్రిపదవి దక్కే అవకాశం లేదు. దీంతో మలివిడతలో మంత్రిపదవి లభిస్తుందని ఆశిస్తూ వచ్చిన మేడా వారి ఆశలు ఇక ఆవిరి అయినట్లే!
విప్గా మల్లిఖార్జునరెడ్డి చీఫ్ విప్ కు శాసనసభ నిర్వహణలో సహకరించాల్సి ఉంటుంది. విప్ పదవి వలన లభించే అధికారాలు స్వల్పమే. కేవలం చీఫ్ విప్ కు మాత్రమే కేబినేట్ హోదా ఉంటుంది.
ఒక పేద్ద దినపత్రిక మాత్రం ఇవాల్టి టాబ్లాయిడ్లో మేడాకు కేబినేట్ హోదా దక్కిందనీ, ముఖ్యమంత్రి జిల్లాకు సువర్ణావకాశం కల్పించారనీ, తెదేపా వర్గాలు ఆనందంలో మునిగి తేలాయనీ పేర్కొనడం విశేషం.