తాళ్లపాక: తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడూ అయిన తాళ్ళపాక అన్నమాచార్యుల 512వ వర్థంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలి తాళ్లపాకలో తితిదే ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమయ్యాయి.
ఉదయం 8 గంటలకు బహుళ ద్వాదశి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సప్తగిరుల గోష్టిగానం కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. చివరిగా అన్నమయ్య చిత్రపటాన్ని తాళ్లపాక మాడవీధుల్లో వూరేగించారు. తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం తాళ్లపాక ధ్యానమందిర ప్రాంగణం, అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద తిరుపతి కళానీరాజనానికి చెందిన ఎస్.అనూష బృందం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి ఆర్.బుల్లెమ్మ బృందం ఆలపించిన అన్నమయ్య కీర్తనలు, తిరుపతికి చెందిన వై.వెంకటేశ్వర్లు, టీఎం నాగమణి బృందం చెప్పిన హరికథలు భక్తులను అలరించాయి.