కడప: నగరంలో ఈ నెల 12న జరుగనున్న హిందూ శంఖారావం సభలో వీహెచ్పీ నేత ముస్లిం, మైనార్టీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా చూఒడాలని కోరుతూ ముస్లిం మైనార్టీల ప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించినారు.
ఈ సందర్భంగా వారు హిందూ శంఖారావం పేరుతో జరుగు సమావేశానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ముస్లింలను వ్యతిరేకించే విధంగా తొగాడియా వ్యాఖ్యలు చేయకుండా ఆపాలని వారు విజ్ఞప్తి చేశారు.
భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ పెద్దలు ముస్లిం- మైనార్టీలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా బహిరంగ సభల్లో మాట్లాడడం విచారకరమన్నారు.
ఎవరి మత విశ్వాసాలను దెబ్బతినని విధంగా వీహెచ్పీ నేత ప్రవీణ్ తొగాడియా సమావేశం ద్వారా ప్రచారం చేసుకోవాలని వారు కలెక్టర్కు విన్నవించారు.
ఏ మతానికి చెందిన వారైనా ఇతర మతాలనూ, వారి విశ్వాసాలనూ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేయదలిస్తే ముందుగానే ఆపడం సాధ్యమవుతుందా అన్నది అనుమానమే! కాకపొతే ఇతర మాతాలను కించపరిచే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. గతంలో అక్బరుద్దీన్ ఓవైసి ఇలాంటి వివాదంలో చిక్కుకుని అరెస్టైన సంగతి తెలిసిందే!