-
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 11 జాతీయ స్థాయి సంస్థల్లో ఒక్కటి కూడా కడపకు ఇవ్వలేదు
-
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై మౌనమేల?
-
అరకొర నిధులతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయా?
-
ఎర్రగుంట్ల – నద్యాల రైల్వే లైను వెంటనే పూర్తి చెయ్యాలి
-
నీటి సరఫరాను ప్రయివేటు పరం చేసే ప్రయత్నం
-
డీఆర్డీవో ప్రాజెక్టును చిత్తూరుకు తరలించారు
-
మంత్రుల పర్యటనలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం
కడప: జిల్లా అభివృద్ధినపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే సహించబోమని తక్షణమే అభివృద్ది పనులు పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకోకపోతే మంత్రుల పర్యటనలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. జిల్లాపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేస్తామని కేంద్ర ప్రభుత్వం చట్టంలో ప్రకటించింది. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటివరకూ ఈ హామీపై ఏమీ మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం లేదు. సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే పాదయాత్ర, ఇతర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. ఇతర రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామ’ని ప్రకటించారు.
సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టుకు సంబంధించి గుత్తేదార్లకు రూ.600 కోట్ల మేర బకాయిలు ఉండగా.. ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.130 కోట్లు కేటాయించారని, ఇక ఆ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని ఆయన ప్రశ్నించారు. అలాగే గాలేరు నగరి ప్రాజెక్టుకు తగినన్ని నిధులు (కేవలం 55కోట్లే కేటాయించారు) కేటాయించలేదన్నారు.
డీఆర్డీవో ప్రాజెక్టును కడప జిల్లాలో ఏర్పాటుచేస్తామని ప్రకటించి చిత్తూరుకు తరలించారన్నారు. ప్రతి మండలంలో ఐటిఐ, నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు.
ముప్పై ఏళ్ల నాడు ప్రారంభమైన నంద్యాల-యర్రగుంట్ల రైల్వేలైను ఇంకా నత్తనడకన సాగుతోందనీ, దీన్ని వెంటనే పూర్తిచేయాలని డిమాండ్చేశారు. కడప నుంచి నంద్యాల మీదు గా విజయవాడకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కడప, నెల్లూరు రైల్వే నిర్మాణం చేపట్టాలన్నారు. జాతీయ రహదారులు నిర్మించాలన్నారు.
జిల్లాలో ఇప్పటికీ చాలా గ్రామాలకు తాగునీటి రవాణా జరుగుతోందని, తక్షణం కరువు సహాయక చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ సంతకాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని అటకెక్కించి రూ.2లకే 20 లీటర్ల మంచినీరు అంటూ నీటి సరఫరాను ప్రైవేట్పరం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
జిల్లాను ఏవిధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 30 సంవత్సరాల చరిత్ర, ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేశామన్నారు. తద్వారా ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలను, జిల్లాలో మండలాల మధ్య ఉన్న వ్యత్యాసాలను, సామాజిక తరగతుల స్థితిగతులను పరిశీలించినట్లు తెలిపారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి బి.నారాయణ మాట్లాడుతూ జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాలంటే పారిశ్రామికీకరణ వల్లే సాధ్యమన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. గాలేరు నగరి, తెలుగు గంగ, హంద్రీనీవాలకు బడ్జెట్లో కేవలం 188 కోట్లు మాత్రమే కేటాయిస్తే అవి ఎప్పటికీ పూర్తవుతాయని ప్రశ్నించారు.
ఆ పార్టీ నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 11 జాతీయ స్థాయి సంస్థల్లో ఒక్కటి కూడా జిల్లాలో ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. జిల్లాకు మంజూరైన డీఆర్డీఓలు చిత్తూరుకు తరలించుకుపోవడం అన్యాయమన్నారు.