Vidya Sagar Rao

సీమ పై విషం కక్కిన తెలంగాణా మేధావి – 1

తెలంగాణకు చెందిన ఆర్ విద్యా సాగర్ రావు కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ గా పని చేసి పదవీ విరమణ పొందారు. వారు మంచి మేధావి, వక్త కూడా. వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడంలోనూ సిద్ధహస్తులు. వారు ఈ మధ్య సినిమాలలో నటిస్తున్నారు కూడా. తెరాసకు సలహాదారుగా కూడా వారు వ్యవహరిస్తున్నారు.

రావు గారు ‘నమస్తే తెలంగాణా’ దిన పత్రికలో నీళ్ళు నిజాలు అని ఒక శీర్షిక నిర్వహిస్తున్నారు. ఈ శీర్షికలో వారు రాసిన వ్యాసాలలో సీమపై తనకున్న అక్కసును వెళ్ళగక్కారు. గందరగోలమైన వాదన ద్వారా ప్రజల మెదళ్ళలో విషం నింపడానికి వారు ఎలా ప్రయత్నించారో చూడండి. సీమ నాయకులారా, మేదావులారా గమనిస్తున్నారా!

మచ్చుకు  ఒక వ్యాసం (తేదీ: 08/22/2011)

శ్రీశైలం ఎవరిది ?

హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్భాగం కనుక హైదరాబాద్ లేకుండా తెలంగాణ అంగీకరించే ప్రసక్తే లేదు అని తెలంగాణ వాదులు కరా ఖండిగా కేంద్రానికి చెప్పిన సందర్భంగా కౌంటర్‌గా మంత్రి వెంక హైదరాబాద్ తెలంగాణకు ఇస్తే మాకు శ్రీశైలం ఇవ్వవలసి ఉంటుందన్న వాదన తెరమీదకు తెచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం వాదనకోసమే అలా మాట్లాడి ఉండొచ్చు. లేదా మంత్రి గారికి ఆ కోరిక ఉండొచ్చు. ఏదేమైనా శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ప్రాజెక్టు-భారతదేశపు ప్రాజెక్టు- దానిపైన ఎవరికీ పేటెంట్ హక్కు లేదు. అది జాతిసొత్తు ప్రజల సొత్తు ఆ ప్రాజెక్టును కృష్ణా నదిపైన నిర్మించారు. డ్యాంకు కుడిపక్క కర్నూలు జిల్లా ఎడమ పక్క మహబూబ్‌నగర్ జిల్లా ఉన్నాయి.

ఈ ప్రాజెక్టు మూలంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ పరిధిలో 27, అలంపూర్ పరిధిలో 29 గ్రామాలు, వనపర్తి పరిధిలో 11 గ్రామాలు, మొత్తం 67 గ్రామాలు, కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు పరిధిలో 32 గ్రామాలు, ఆత్మకూరు పరిధిలో 14 గ్రామాలు, కర్నూలు పరిధిలో 4 గ్రామాలు, మొత్తం 50 గ్రామాలు వెరసి 117 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఇక ముంపుకు గురయిన భూమి విషయానికి వస్తే మహబూబ్‌నగ ర్ జిల్లాలోని 1546 ఎకరాల మాగాణి, 429 29 ఎకరాల మెట్ట, 7952 ఎకరాల బంజరు పోరంబోకు భూమి ఇలా మొత్తం 54 807 ఎకరాల భూమి కాగా కర్నూలు జిల్లాలోని 2028 ఎకరాల మాగాణి, 47029 ఎకరాల మెట్ట, 5294 ఎకరాల బంజరు పోరంబోకు భూమి వగైరా మొత్తం 52541 ఎకరాల వెరసి ఒక లక్షా ఏడు వేల 348 ఎకరాలు నీట మునగడం జరిగింది.ఈ వివరాలను బట్టి ఏం తెలుస్తోంది.

చదవండి :  వైఎస్ స్వతంత్రుడు... అందుకే దాడి! - ఎ.బి.కె ప్రసాద్

ఒకటి- మహబూబ్‌నగర్, కర్నూలు, జిల్లాలు శ్రీశైలంకు ఇరు పక్కలా ఉన్నాయని, రెండు -కర్నూలు జిల్లా కన్న మహబూబ్‌నగర్ జిల్లాలోనే అటు గ్రామాలు కానీ భూములు కానీ ఎక్కువగా ముంపునకు గురయ్యాయని. ఈ నేపథ్యంలో శ్రీశైలం రాయలసీమకే చెందుతుందనడంలో ఏ మాత్రం ఔచిత్యం ఉందో పాఠకులే అర్థం చేసుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టులో రెండు విద్యుత్ కేంద్రాలున్నాయి. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం 900 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రం 700 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. మొత్తం విద్యుత్ సామర్థ్యం 1670 మెగావాట్లు- ఇక నీటి వినియోగానికి వస్తే కొన్ని విచివూతమైన విషయాలు బయటపడతాయి.

శ్రీశైలం ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం విద్యుదుత్పాదన. విద్యుత్తు ఉత్పత్తి చేసి నీటిని దిగువ ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేయడం. అంటే నాగార్జునసాగర్‌కు ఇది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉపయోగపడుతుందన్న మాట. ఈ ప్రాజెక్టు నుండి నేరుగా సాగు కోసం నీటిని తరలించ కూడదని, కృష్ణానదీ జలాలను మూడు రాష్ట్రాలకు అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్‌కు పంచిన బచావత్ ట్రిబ్యునల్ తమ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. శ్రీశైలంలో నిలువ చేసిన నీరు శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి చేసాక నాగార్జునసాగర్‌లో విద్యుత్తు ఉత్పత్తి చేసిన అనంతరం అంతిమంగా సాగర్ ఆయకట్టు కృష్ణాడెల్టా ఆయకట్టుకు ఉపయోగపడుతుంది. కాబట్టి శ్రీశైలంలో ఆవిరి నష్టానికి 33 టి.ఎం.సి ల నీటిని ట్రిబ్యునల్ ప్రత్యేకంగా కేటాయించింది. శ్రీశైలం మాదిరిగానే మేము కూడా ‘ కోయినా ప్రాజెక్టు’ను విద్యుత్తు ఉత్పాదన కోసమే కట్టుకున్నాం.

కనుక మా ప్రాజెక్టుకు కూడా అదనంగా ఆవిరి నష్టం కోసం నీటిని కేటాయించవలసిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ని అర్థిస్తే, మీరు విద్యుత్తు ఉత్పత్తి చేసాక ‘కోయినా’ నీటిని అరేబియా సమువూదంలోకి వదిలేస్తున్నారు. కాని ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి చేసాక నీటిని నాగార్జునసాగర్ ద్వారా సాగు కోసం వినియోగిస్తున్నది. కనుక వారికి ఆవిరినష్టం కోసం 33 టి.ఎం.సి లను కేటాయించాం. మీకు అలా కేటాయించడం కుదరదు అని కరాఖండిగా చెప్పింది. దీనర్థం ఏమంటే శ్రీశైలం జలాశయంలో నిలువ చేసిన నీరు రెండు చోట్ల అంటే శ్రీశైలం దగ్గర, నాగార్జునసాగర్ వద్ద (నీటిని బట్టి) విద్యుత్తు ఉత్పత్తికి తోడ్పడమే కాకుండా సాగర్ ఆయకట్టు, కృష్ణా డెల్టాకు సాగుకు వినియోగింపబడాలన్న మాట. కానీ దురదృష్టం ఏమంటే మన ప్రభుత్వం అనేక గారడీలు మాయలు చేసి క్రమక్షికమంగా విద్యుత్తు కోసం ఉద్దేశింపబడ్డ శ్రీశైలాన్ని సాగునీటి ప్రాజెక్టుగా మార్చింది. ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తించింది.

చదవండి :  ముఖ్యమంత్రి గారూ, అభినందించండి సార్!

తొలుత మద్రాసుకు మంచినీళ్ల కోసం ఏర్పాటు చేసిన తెలుగుగంగను క్రమంగా సాగునీటి కాలువగా మార్చింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సైజును ఇటీవలి కాలంలో నాలుగైదు రెట్లు పెంచి వరదనీటి ముసుగులో శ్రీశైలం నీటిని భారీ ఎత్తున రాయలసీమకు తరలించే అనేక కార్యక్రమాలు చేపట్టింది. తెలుగుగంగ ఎస్‌ఆర్‌బిసికి ఆదనంగా హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు, వీటి ద్వారా తరలించే నీటిని ఒడిసి పట్టుకోవడానికి అనేక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించింది. ఒక్క రాయలసీమకే నీరంతా పంపిస్తే బాగుండదని, ప్రకాశం జిల్లాకు పనికొచ్చే వెలిగొండను తెలంగాణకు పనికొచ్చే నెట్టంపాడు, కల్వకుర్తి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను కూడా చేపట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం 227. 50 టి.ఎం.సి ల (పేరుకు) మిగులు జలాలనుపయోగించే సాగునీటి ప్రాజెక్టులను చేపట్టితే అందులో కోస్తాంవూధకు 43.50 టి.ఎం.సి లు తెలంగాణకు 77 టి.ఎం.సి లు రాయలసీమకు 107 టి.ఎం.సి లు చెందే విధంగా రూపకల్పన చేయడం జరిగింది.

227.50 టి.ఎం.సి ల నీరు ‘మిగులు జలాల’ని చెప్పుతున్నా అవి నికర జలాలే అన్న విషయం అందరికీ తెలుసు. అవి నికర జలాలే అయితే వాటిపైన ఆధారపడ్డ నాగార్జునసాగర్ ఆయకట్టుదారులు, కృష్టా డెల్టా ఆయకట్టుదారుల గతేమవుతుందో భగవంతునికే తెలియాలి. ఆ నీటితో ఉత్పత్తి చేయగల విద్యుత్తు ( రెండుచోట్ల) గోవిందా అయినా ప్రభుత్వం ఎన్నడూ ఆ సంగతి మాట్లాడిన పాపానపోలేదు. ఇదండీ శ్రీశైలం ప్రాజెక్టు దీనావస్థ. దౌర్జన్యంగా, బాహాటంగా నియమాలకు విరుద్ధంగా జరుగుతున్న నీటి దోపిడీ. ఇప్పుడర్థమైందా రాయలసీమ నాయకులకు శ్రీశైలం పైన ఎందుకంత ఆసక్తీ, ఆదుర్దో….

నదీ జలాలపై హక్కు రాజ్యాంగంలోని 246 అధికరణంలోని ఏడ వ షెడ్యూల్‌లో మూడు జాబితాలు ఉన్నాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబి తా. కేంద్ర జాబితాలో పొందుపర్చిన విషయాలపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకు, రాష్ట్ర జాబితాలోని విషయాలపై ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు, ఉమ్మడి జాబితాలోని విషయాల పై ఉభయులకు ఉంటాయి.

రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 17లో నీరు, నీటి సరఫరా, సాగునీరు, కాలువలు, మురుగునీరు, అడ్డుకట్టలు, నీటి నిలువ, విద్యుచ్ఛక్తి ఉన్నాయి. అయితే ఇవి కేంద్ర జాబితా ఎంట్రీ 56 లోని విషయాలకు లోబడి ఉంటాయి. కేంద్ర జాబితాలోని ఎంట్రీ 56 లో అంతర్‌రాష్ట్ర నదుల, నదీలోయల అభివృద్ధి, క్రమబద్ధీకరణ ఉన్నాయి. అయితే ఇదినీటిపైన పార్లమెంటు చట్టం చేసిన పరిధికి లోబడే ఉంటాయి. తేలికైన మాట ల్లో చెప్పాలంటే తమ సరిహద్దులో పుట్టి, ప్రవహించే నదులపైన సంపూర్ణ అధికారం రాష్ట్రాలకుంటుంది. ఉదాహరణ: గుండ్లకమ్మ ఈ నదిపైన పూర్తి హక్కు ఆంధ్రవూపదేశ్‌కుంటుంది. అంతర్ రాష్ట్ర నదుల విషయంలో తమకు కేటాయించిన నీటిని ఉపయోగించే హక్కు మాత్రమే రాష్ట్రాలకుంటుంది.అది కూడా పొరుగు రాష్ట్రాలకు ఇబ్బంది కలిగించకుండా ఉండేటట్టు అయితేనే. ఉదాహరణకు, కృష్ణా నదిపైన నిర్మించిన జూరాల, గోదావరిపై నిర్మాణం తలపెట్టిన పోలవరం- జూరాలకు 17.84 టి.ఎం.సిల నీటి కేటాయింపు ఉంది.

చదవండి :  తెదేపా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 120 ఇదే!

కాని కట్టే డ్యాం మూలంగా ముంపుకు గురయ్యే కర్ణాటక గ్రామాల విషయంలో ఆ రాష్ట్రం అనుమతి తీసుకొని నష్ట పరిహారం చెల్లించాకే జూరాలను పూర్తిగా నింపడం జరుగుతోంది. పోలవరం విషయంలో నీటి కేటాయింపు సమస్యలేదు. సమస్య అంతా పొరుగు రాష్ట్రాలతో కలిగే ముంపు గురించే.ఈ జగడం సుప్రీంకోర్టులో ఉంది. నీటి విషయం ఉమ్మడి జాబితాలో ప్రస్తావించలేదు.

గమనిచవలసిన విషయం:

రావు గారు తన వాదన మొత్తానికి ట్రిబ్యునల్ తీర్పును ఆధారంగా చేసుకుంటారు. ట్రిబ్యునల్ మిగులు జలాలని చెప్పినవి నికర జలాలని అందరికీ తెలుసునంటారు. తరువాతి వాక్యంలో వారే అవి నికర జలాలైతే అంటూ సందేహం వెలిబుచ్చుతారు. నికర జలాల కేటాయింపు పొందిన సాగర్ ఆయకట్టు, కృష్ణా డెల్టాలను గురించి వీరి బాధ చూడండి. అంతేనా పనిలో పనిగా ప్రభుత్వాన్నీ తిట్టి పోశారు – విద్యుత్తు గురించి. వారికి వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోకుండా దానికే ఫిక్సయిపోయి – మిగులు జలాలు లేదా వరద జలాల మీద ఆధారపడ్డ సీమ వాసులు దౌర్జన్యం, దోపిడీ చేశారు అంటారు. ఇదీ మేధావి గారి డొల్ల వాదన. ఇదంతా తెలంగాణా ప్రజల మనస్సులో సీమ వాసులపై విషం నింపటం తప్ప మరొకటి కాదు!

పోతిరెడ్డి పాడు సైజు పెంచి వరద నీటి ముసుగులో శ్రీశైలం నీటిని తరలించే ప్రయత్నం చేశారనిబాధ పడ్డ రావు గారు సీమ వాసుల దోపిడీని కప్పి పుచ్చేందుకు పాలమూరు, ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టులు కడుతున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అసలు వీరి ఉద్దేశ్యం పాలమూరు, ప్రకాశం జిల్లాలలో ప్రాజెక్టులు కట్ట వద్దనా? లేక బురద జల్లే ప్రయత్నంలో ఆప సోపాలు పడుతున్నారా? వరద నీటిని సముద్రంలో కలిపే బదులు దుర్భిక్షంతో అల్లాడుతున్న సీమలో ప్రాజెక్టులు కట్టి నిల్వ చెయ్యటం వీరికి నచ్చలేదనుకోవాలా? జలసంఘంలో కీలక భాద్యతలు నిర్వహించిన రావు గారు ఇంగితం ఎరిగిన మనిషి. వారికి కృష్ణా – పెన్నార్   ప్రాజెక్టు నేపధ్యమూ, శ్రీబాగ్ ఒప్పందమూ తెలుసు. మరి ఎందుకీ విషం చిమ్మే ప్రయత్నం?

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

2 వ్యాఖ్యలు

  1. ఈ మేధావి కచరాకు నమ్మిన బంటు. ఇంతకు మించి మరో రకమైన ప్రచారం ఎలా చేస్తారు.

  2. You are true. He support to K.C.R telangana. and He follow to telangana criticism.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: