కథానిక, నవల, నాటకం ఏదైనా తెలుగు సాహిత్యం సామాజిక చైతన్యానికి- రుగ్మతలు రూపుమాపటానికి ఉపయుక్తమవుతుందని తెలుగు శాఖ సహ ఆచార్యుడు తప్పెట రామప్రసాద్రెడ్డి వివరించారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో ’21వ శతాబ్ది తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సులో శుక్రవారం ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు.
మూఢాచారాలను రూపుమాపేందుకు సాహిత్యం ఆయుధమన్నారు. 21వ శతాబ్ది సాహిత్యం మరింత పదునైన ఆయుధంగా రూపుదిద్దుకొంటోందని సంతృప్తి వ్యక్తం చేశారు. సమాజం మరింత పురోభివృద్ధి చెందటానికి తనవంతు పాత్ర పోషిస్తోందన్నారు. సదస్సు నిర్వాహకులు డాక్టర్ పాలెం రమాదేవి మాట్లాడుతూ 21వ శతాబ్ద సాహిత్యంలో వివిధ ప్రక్రియలపై పత్రాలు విలువైనవి వచ్చాయన్నారు. భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడేలా మరిన్ని సదస్సులు ఉంటాయన్నారు.
తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సహాయాచార్యులు రాజేశ్వరమ్మ అభ్యుదయ- విప్లవవాద కథానికపైన, కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు చిన్నరెడ్డయ్య రాయలసీమ నవలపై, టి.రామప్రసాద్రెడ్డి రాతిలోతేమపై, విరిసిన మల్లెలు కథపై డాక్టరు జి.పార్వతి పత్రసమర్పణ చేశారు.
రెండో సదస్సునకు తెలుగు శాఖ సమన్వయకర్త ఎన్.ఈశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి హాజరయ్యారు. తెలుగు పరిశోధక విద్యార్థులు విజయభాస్కర్, ఉపేంద్ర, నల్లారెడ్డి, నాగరాజు, తవ్వా వెంకటయ్య, నాగలక్ష్మీ, జయలక్ష్మీ, కథ, సాహిత్యం, నవల, విమర్శలపై పత్రసమర్పణ చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.