కడప: కడప బెంగుళూరు నగరాల మధ్య నడుస్తున్న ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసులు గత కొద్ది రోజులుగా నడవటం లేదు. ఈ రెండు నగరాల మధ్య వారానికి మూడు సార్లు ఎయిర్ పెగాసస్ ఎటిఆర్ 72 రకం విమానాల్ని నడుపుతోంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే విమాన ప్రయాణీకుల సంఖ్య కూడా బాగానే ఉంది.
అయితే ఉన్నట్టుండి అక్టోబర్ 1 నుండి విమాన సర్వీసును నిలిపివేసిన ఎయిర్ పెగాసస్ టికెట్ల విక్రయాన్ని కూడా ఆపింది. దీంతో కడప బెంగుళూరుల మధ్య ప్రయాణించే వారు ఇబ్బందికి గురవుతున్నారు. విమాన సర్వీసు రద్దు కావడంతో విమానాశ్రయం మూతపడుతుందేమోనని అక్కడ పనిచేసే కొద్దిపాటి సిబ్బంది సైతం ఆందోళన చెందుతున్నారు.
ఇదే విషయమై విమానాశ్రయ డైరెక్టర్ ను సంప్రదించడానికి ప్రయత్నిస్తే ఆయన అందుబాటులో లేరు. ఎయిర్ పెగాసస్ అధికారులను సంప్రదిస్తే నిర్వహణా కష్టాల కారణంగా తాత్కాలికంగా విమాన సర్వీసును ఆపినట్లు తెలిపారు.
నవంబరు మధ్య నుండి విమానాలు యదావిధిగా తిరుగుతాయని చెప్పారు. ఇందుకు సంబంధించి టికెట్ల అమ్మకాన్ని కూడా తిరిగి ప్రారంభించామని చెప్పారు.