అన్బురాజన్‌

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ

ఆలయాల వద్ద పటిష్ట నిఘా

గ్రామ రక్షక దళాలతో పోలీసుల సమన్వయం

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారమివ్వండి 

కడప : జిల్లాలో ఉన్న  దేవాలయాలు, ప్రార్థనా మందిరాల భద్రతపై పోలీసుల పటిష్ట నిఘాతో పాటుగా రాత్రి వేళ పెట్రోలింగ్ , ఆకస్మిక తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్.పి అన్బురాజన్ ఈ రోజు  (సోమవారం) మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటుగా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు.

మందిరాల భద్రతలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ఆయా గ్రామాల్లో గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్నసంఘటనల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైందన్నారు. డీఎస్పీలు, సి.ఐ లు క్షేత్ర స్థాయికెళ్లి దేవాలయాలు/ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను సమీక్షిస్తున్నారని ఎస్.పి తెలిపారు.

చదవండి :  కడప ఎస్పీగా అన్బురాజన్‌

దేవాదాయ శాఖ అధికారులను సి.సి కెమెరాలను ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. పోలీసులు రాత్రి పూట పర్యటిస్తూ గ్రామరక్షక దళాలకు తగు సూచనలు చేస్తున్నారన్నారు. దేవాలయాల్లో ఘటనలకు పాల్పడే దుండగులు, కుట్రదారులు, అనుమానితులపై ముందస్తు నిఘా కొనసాగుతోందన్నారు.

ఆలయ పూజారులు, దేవాలయ కమిటీ నిర్వాహకులు, ఫాస్టర్లు, ఇమామ్ లు, గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతల ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండేలా జాగ్రత్తలు సూచించడం జరిగిందన్నారు. వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు జిల్లా ఎస్.పి సూచించారు. జిల్లాలోని 4127 ఆలయాలు, చర్చిలు, మసీదులు, ఇతర ప్రార్ధన మందిరాల వద్ద1044 సి.సి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చకచకా పనులు సాగుతున్నాయన్నారు. రాత్రి గస్తీని ముమ్మరం చేశామన్నారు.

చదవండి :  ఎంపీల రాజీనామాల తిరస్కరణ

ఎస్.ఐ స్థాయి నుండి అదనపు ఎస్.పి స్థాయి వరకూ గస్తీ తిరుగుతున్నారని, రాత్రి వేళల్లో సంచరించే వారి వేలిముద్రలను గస్తీలో ఉన్న పోలీస్ అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. ఫేస్ ట్రాకింగ్ కెమెరాల ద్వారా పాత నేరస్థులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని ఎస్.పి గారు వివరించారు. ఈ ‘ఫేస్ ట్రాకింగ్ కెమెరా’ల ద్వారా వారి ఫోటో తీయడం జరుగుతుందని, పాత నేరస్థులైతే వారి నేరాల చిట్టా మొత్తం బయట పడుతుందన్నారు.

అనుమానాస్పద వ్యక్తుల సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు లేదా డయల్ – 100 కు లేదా జిల్లా ఎస్.పి గారి మొబైల్ నెంబర్ 9440796900కు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

చదవండి :  ఉక్కు కర్మాగారం ఏర్పాటు పరిశీలనకై వచ్చిన సెయిల్‌ బృందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: