కడప : కడప- చిత్తూరు జిల్లాల సరిహద్దులో సరిహద్దులోని బొంతకనుము రెండవ కల్వర్టు వద్ద పోలీసుల సోదాలో మూడు మందు పాతరలు, ల్యాప్ట్యాప్ లభ్యం కావడం సంచలనం రేపింది. సిఎం కిరణ్ కుమార్రెడ్డి పర్యటన తన సొంత నియోజకవర్గంలో బుధవారం అర్ధాంతరంగా వాయిదాపడడంతో పోలీసుల సోదాలు నిర్వహిస్తుండగా గురువారం మందుపాతరలు లభ్యం కావడం గమనార్హం!. సీమ జిల్లాల్లో మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోయారని పోలీసులు భావిస్తున్న ..తరుణంలో కడప-చిత్తూరు జిల్లాల సరిహద్దులో మందుపాతరలు లభించడం సంచలనానికి కారణమైంది. మందుపాతరలు ఎప్పుడు, ఎవరు అమర్చారు, ఎవరిని లక్ష్యంగా చేసుకుని వీటిని అమర్చారు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే వీటిని మావోలు తాజాగా అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో జిల్లాలో మావోలు అమర్చిన మందుపాతరలను పోలీసులు దాదాపుగా తొలగించారు. మావోలకు గతంలో సేఫ్జోన్గా ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో భాగమైన కడప జిల్లాలోని సుండుపల్లె మండలం, చిత్తూరు జిల్లాలోని కెవిపల్లె మండలం సరిహద్దులోని బొంతకనుము కల్వర్టు వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ మందుపాతరులు లభ్యమయ్యాయి. వీటిలో రెండింటిని పోలీసులు నిర్వీర్యం చేసినట్లు సమాచారం. చీకటి పడడంతో మరో మందు పాతరను శుక్రవారం నిర్వీర్యం చేయనున్నారని తెలిసింది.
మరోవైపు మావోల కోసం శేషాచలం అడవులను పోలీసులు జల్లెడపడుతున్నారు. స్పెషల్ పార్టీలు, ఎపిఎస్పి, గ్రేహౌండ్స్ దళాలతో కడప జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలో మావోల జాడ లేదనుకుంటున్న తరుణంలో మందుపాతరలు లభించడం గమనార్హం. దీంతో మావోలు ఉన్నారనే వార్తలకు బలం చేకూరినట్టయింది.
ఇదీ చదవండి!
కడపలో రాజధానితోనే రాయలసీమ సమగ్రాభివృద్ధి
రాయలసీమ ప్రాంతంలో కడప లాంటి నగరంలో రాజధాని నెలకొల్పకుంటే, సమీప భవిష్యత్తులోనే ప్రత్యేక తెలంగాణా తరహా మరో వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి అటు అభివృద్ధి పరంగాను, ఇటు శాంతిభద్రతల పరంగాను ఈ ప్రాంతాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిరక్షించదలచుకుంటే కడప నగరంలో రాజధాని ఏర్పాటు ప్రభుత్వపరంగా ఒక చారిత్రక బాధ్యత.