కడప: యోగివేమన విశ్వవిద్యాలయానికి ఒకేసారి ఆరు రామన్ ఫెలోషిప్లు దక్కాయి. విశ్వవిద్యాలయ సహాయాచార్యులు ఆరుగురికి యుజిసి(విశ్వవిద్యాలయ నిధుల సంఘం) ‘రామన్ ఫెలోషిప్’లను ప్రకటించింది. ఒక విశ్వవిద్యాలయం నుంచి ఒకేసారి ఆరుగురు ఫెలోషిప్లు దక్కించుకున్న అరుదైన ఘనతను యోగివేమన విశ్వవిద్యాలయం దక్కించుకుంది.
యోవేవి సహాయాచార్యులు డాక్టరు తుమ్మల చంద్రశేఖర్, డాక్టరు చంద్రఓబులరెడ్డి, డాక్టరు బి.విజయకుమార్నాయుడు, డాక్టరు కె.ఎస్.వి.కృష్ణారావు, డాక్టరు వై.వెంకటసుబ్బయ్య ఫెలోసిఫ్ కు ఎంపికైనారు. ఫెలోషిప్ కు ఎంపికైన ఆచార్యులు అమెరికాలోని పరిశోధనా సంస్థల్లో పరిశోధనలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
విద్యా పరిశోధనలపరంగా విశ్వవిద్యాలయం ఎప్పడూ ముందుంటుందని ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ అన్నారు. ఫెలోషిప్ కు ఎంపికైన ఆచార్యులకు విశ్వవిద్యాలయ ఉపకులపతి, మిగతా ఆచార్యులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
డాక్టరు తుమ్మల చంద్రశేఖర్ : వైవీయూ పర్యావరణ శాఖ సహాయాచార్యులు. ఈయన అమెరికాలోని ఆరిజోన స్టేట్ యూనివర్సిటీలోని జీవ రసాయనశాఖలో పరిశోధనలు చేయనున్నారు. ఇంధన వనరులు అంతరించి పోతున్న తరుణంలో దాని ప్రత్యామ్నాయ ఇంధనాన్ని సృష్టించే విషయంపై ప్రయోగాలు చేసేందుకు వెళుతున్నారు.
డాక్టరు చంద్రఓబులరెడ్డి : వృక్షశాస్త్ర విభాగానికి చెందిన సహాయాచార్యులు. ఈయన అమెరికాలోని ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీలోని సూక్ష్మజీవశాస్త్రం విభాగంలో వేరుసెనగపై పరిశోధనలకు ఆహ్వానం వచ్చింది. వేరుసెనగలో నీటి ఎద్దడిని తట్టుకునే వంగడాల రూపకల్పనపై పరిశోధనలు చేస్తారు. వర్షాభావ పరిస్థితుల్లో గింజ ఏర్పడే దశలో నీరులభ్యం కాక దిగుబడి తగ్గుతోంది . దీనికి ఉన్న ఏకైక మార్గం నీటి ఎద్దడిని తట్టుకునే వంగడాల రూపకల్పనేనని ఆయన అంటున్నారు.
డాక్టరు ఎల్. దాక్షాయని : జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్ విభాగ సహాయాచార్యులు. ఈమె కెన్సర్ వ్యాధి గురించి పరిశోధనలు చేసేందుకు అమెరికాలోని టెక్సాస్లో ఉన్న ఎం.డి. అండర్సన్ కెన్సర్ పరిశోధన విభాగానికి వెళుతున్నారు.
డాక్టరు బి.విజయకుమార్ : నానోటెక్నాలజి అండ్ మెటీరియల్ సైన్సు శాఖ సహాయాచార్యులు. అమెరికాలోని టెన్నిసి హెల్త్ రీసెర్చి కేంద్రం, మెంపిస్లో పరిశోధన చేస్తారు. శరీరంలో వ్యాధి ఉన్న చోటును మాత్రమే గుర్తించి ఆ భాగానికి ఔషధాన్ని చేకూర్చే వాహకాలన సృష్టించేప్రయత్నం చేస్తారు. దానికి తగ్గ ఔషధాల పనితీరు, మెరుగుపరచి ఎక్కువ కాలం శరీరంలో పనిచేసేందుకు అవసరమైన ప్రక్రియలపై పరిశోధన చేస్తారు.
డాక్టరు వై.వెంకటసుబ్బయ్య : ఈయన భౌతికశాస్త్ర సహాయాచార్యులు. తిన్ఫిల్మ్ సోలార్ ఎనర్సీ మెటీరియల్స్ అనే అంశంపై పరిశోధన చేసేందుకు అమెరికాలోని ఉత్తాహ్ సాల్ట్లేక్ విశ్వవిద్యాలయానికి వెళుతున్నారు. నానో స్ట్రక్చర్ మెటీరియల్స్ రీసెర్చి ల్యాబోరేటరిలో డాక్టరు అశుతోష్తివారితో కలసి పరిశోధనలు చేస్తారు.
డాక్టరు కె.ఎస్.వి.కృష్ణారావు : ఈయన రసాయనశాస్త్రం శాఖ సహాయాచార్యులు. అమెరికాలోని డెట్రాయిట్ వేన్స్ స్టేట్ యూనివర్సిటీలో వూపిరితిత్తుల కెన్సర్ వైద్యం కొత్త పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు. నానో మెడిసిన్ సింథిసిస్ క్యాటరైజేషను అండ్ అప్లికేషన్ ఆఫ్ పాలిమర్ అండ్ దేర్ కన్జూగేట్ ఫర్ డ్రగ్ డెలివరీ అప్లికేషన్సు అనే అంశంపై పరిశోధన చేయడానికి వెళుతున్నారు.