ఓఒంటిమిట్ట: ఈ రోజు (గురువారం) రాత్రి జరగనున్న కోదండరామయ్య పెళ్లి ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల పెళ్లి ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహించనున్నారు.
శ్రీరామనవమి నుంచి ఆరో రోజున రాత్రివేళ వెన్నెలలో ఈ కల్యాణం నిర్వహించడం మొదటి నుంచి ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అధిక సంఖ్యలో భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా పలు ఏర్పాట్లు చేశారు. అలాగే పెద్దఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు.
మరోవైపు ఒంటిమిట్ట ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అధికారులు కళ్యాణోత్సవ ఏర్పాట్లను బుధవారం పర్యవేక్షించారు.
జిల్లా ఎస్పీ నవీన్ గులాటి దగ్గరుండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించినారు. భద్రత కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బందికి భద్రత విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి షెడ్యూలు ఇదీ…
గురువారం మధ్యాహ్నం 4 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఒంటిమిట్టలోని కోదండరామస్వామిని దర్శించుకుంటారని అనంతరం వావికొలను సుబ్బారావు కొండపైకి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఒంటిమిట్ట జిల్లా పరిషత్హైస్కూల్కు చేరుకుని బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సుమారు 9 గంటల వరకు ఒంటిమిట్టలోని హరిత హోటల్లో విశ్రాంతి తీసుకుంటారని తెలిపారు. అనంతరం 9 గంటల నుంచి జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారు.